రియల్‌పై క్రిప్టో ప్రభావం ఎంత?

కుమార్‌ కొన్నేళ్ల క్రితం ఇల్లు కొన్నాడు. దంపతులు వేతనజీవులు కావడంతో ఈఎంఐ, ఇంటి ఖర్చులు పోను భారీగా ఆదాయం మిగులుతోంది. ఈ సొమ్మును ఆయన క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాడు. ఈయన తోటి ఉద్యోగులు

Published : 27 Nov 2021 04:06 IST

ఈనాడు, హైదరాబాద్‌

* కుమార్‌ కొన్నేళ్ల క్రితం ఇల్లు కొన్నాడు. దంపతులు వేతనజీవులు కావడంతో ఈఎంఐ, ఇంటి ఖర్చులు పోను భారీగా ఆదాయం మిగులుతోంది. ఈ సొమ్మును ఆయన క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాడు. ఈయన తోటి ఉద్యోగులు ఎక్కువ మంది రుణం తీసుకుని నగర శివార్లలో స్థలాలు కొనుగోలు చేస్తే.. కొందరు భవిష్యత్తు క్రిప్టోదేనని.. అందులో పెట్టుబడి పెడుతున్నారు. ఇటీవల క్రిప్టో ఖాతాలు పెరుగుతుండటం చూస్తే మదుపర్ల ఆలోచన ధోరణులు మారుతున్నాయి. ఈ ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పై పడే అవకాశం ఉందా? ఉంటే ఏ మేరకు? ఈ రంగంలో నిపుణులు ఏమంటున్నారు?

బ్యాంకుల్లో వడ్డీరేట్లు తక్కువగా ఉండటం.. షేర్‌ మార్కెట్లో ఒడిదొడుకులతో నోట్ల రద్దు అనంతరం స్థిరాస్తుల్లో పెట్టుబడికి ఎక్కువ మంది మొగ్గు చూపారు. కొవిడ్‌ సమయంలో షేర్‌ మార్కెట్‌తో పాటూ భూముల్లో పెద్ద ఎత్తున మదుపు చేశారు. దీర్ఘకాలంలోనే కాదు స్వల్పకాలానికి భూములపై పెట్టుబడులతో మంచి రాబడులు అందుకుంటున్నారు కొనుగోలుదారులు. దీంతో ఇటీవల కాలంలో భూములు, స్థలాలు, ఫ్లాట్లపై ఎక్కువ మంది పెట్టుబడి పెట్టారు. ఇల్లు కట్టుకునేందుకు కొనడంతో పాటూ పెట్టుబడి దృష్ట్యా కొనుగోలు చేస్తుండటంతో స్థిరాస్తుల ధరలకు లెక్కలొచ్చాయి. కొవిడ్‌ తర్వాత భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి.  స్వల్పకాలంలో ఇంతలా పెరగడం మార్కెట్‌కు మంచిది కాదని.. దిద్దుబాటు ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భూముల ధరలు అసాధారణంగా పెంచడంపై నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సిటీలో అందుబాటు ధరల్లో ఇళ్లు లేకుండా పోయాయి. స్థిరాస్తుల ధరలు అందుకోలేనంత పెరగడంతో ఇతర పెట్టుబడి మార్గాల వైపు కొనుగోలుదారులు చూస్తున్నారు. తాజాగా క్రిప్టో ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. దీని ప్రభావం ఎంత మేరకు రియల్‌ ఎస్టేట్‌పై ఉంటుందనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది.

డిజిటల్‌ ఆస్తులు..

క్రిప్టో కూడా ఒకరకంగా ఆస్తే. కాకపోతే వర్చువల్‌గా ఉంటుంది. డిజిటల్‌ ఆస్తిగా చెబుతుంటారు. ఇందులో పెట్టుబడిగా.. ఆన్‌లైన్‌లో కొనుగోళ్ల చెల్లింపులకు ఉపయోగిస్తుంటారు. పలు సంస్థలు  ఇందులోకి ప్రవేశించి విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో భారత్‌లో ఖాతాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే క్రిప్టో ఖాతాలు 10కోట్లకు చేరాయి. వీటి సంఖ్య పెరుగుతుండటంతో  నియంత్రణపై చర్చలు నడుస్తున్నాయి. వ్యాపార వర్గాల్లో దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.  ఇదంతా ఒకపక్క నడుస్తుండగానే వీటిలో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు ఆర్జించినవారు, నష్టపోయినవారు కనిపిస్తున్నారు. కొత్త పెట్టుబడి సాధనం కావడంతో సహజంగానే పెట్టుబడిదారుల దృష్టి వీటిపై పడింది. హైదరాబాద్‌లోనూ చాలామంది వీటిలో మదుపు చేశారు. ఒక పెట్టుబడి సాధనంలో మదుపు పెరిగితే ఆ మేరకు మరో దగ్గర తగ్గినట్లేనని... ఇది రియల్‌ ఎస్టేట్‌పైన కొంత వరకు ప్రభావం చూపే అవకాశం ఉందని డెవలపర్లు అంటున్నారు. ముఖ్యంగా ఇదివరకు రెండో మూడో ఇంటిని పెట్టుబడి దృష్ట్యా కొనేవారిలో కొంతమంది అటువైపు మళ్లే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

దిద్దుబాటుకు ఇదే కారణం కాదు - ఎ.సుమంత్‌రెడ్డి, ఎం.డి., ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌; మాజీ అధ్యక్షుడు, నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌ ఇండియా

క్రిప్టో కరెన్సీపై ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంతో సహజంగానే కొంత అటువైపు మొగ్గే అవకాశం ఉంది. వీటిలో పెట్టుబడి పెట్టేవారు సాధారణంగా స్టాక్‌ మార్కెట్లో, కమోడిటీస్‌లో ఇప్పటివరకు మదుపు చేస్తున్నవారే ఎక్కువగా ఉంటారు. మొదటి నుంచి కూడా వీరు ఇలాంటి వాటినే ఎంపిక చేసుకుంటుంటారు.  ఇందులో త్వరగా అమ్ముకుని నగదు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌లో ఒక్క ప్రతికూలత ఏంటంటే విలువ పెరిగినా.. వెంటనే అమ్ముకోలేరు. లిక్విడిటీకి కొంత సమయం పడుతుంది. రేపు డబ్బు కావాలంటే దొరకదు. స్టాక్స్‌, క్రిప్టోలో రేపు కావాలంటే నగదు చేసుకోవచ్చు. మార్కెట్‌పై ప్రతికూలంగా పరిగణించేంత ప్రభావం క్రిప్టోతో ఉంటుందని అనుకోవడం లేదు. మార్కెట్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో దిద్దుబాటు కచ్చితంగా ఉంటుంది. కానీ ఇది క్రిప్టో కారణంగా మాత్రం కాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు