పచ్చగా.. పదికాలాల పాటూ..

నగరంలో నిర్మాణాలు విస్తరించే కొద్దీ ఆ మేరకు పచ్చదనంపై ప్రభావం పడుతోంది. పైగా నిర్మాణ సమయంలో వాతావరణంలోకి వెలువడుతున్న కాలుష్యం ఎక్కువే.

Updated : 22 Apr 2023 06:33 IST

నేడు ధరిత్రి దినోత్సవం
ఈనాడు, హైదరాబాద్‌:  

నగరంలో నిర్మాణాలు విస్తరించే కొద్దీ ఆ మేరకు పచ్చదనంపై ప్రభావం పడుతోంది. పైగా నిర్మాణ సమయంలో వాతావరణంలోకి వెలువడుతున్న కాలుష్యం ఎక్కువే. దీన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే దిశగా నిర్మాణరంగం అడుగులు వేస్తోంది. పర్యావరణ స్ప్రహ కల్గిన నిర్మాణదారులు హరిత భవనాలను నిర్మించేందుకు ముందుకొస్తున్నారు. ఫలితంగా గతంతో పోలిస్తే హరిత భవనాల వాటా సిటీలో క్రమంగా పెరుగుతోంది.

పెరుగుతున్న జనాభా, నగరాలకు పోటెత్తున్న వలసలతో గృహ నిర్మాణం వేగంగా విస్తరిస్తోంది. సిటీలో ఒకప్పుడు ఏడాదిలో 15 వేల ఇళ్ల నిర్మాణమే కష్టంగా సాగే రోజుల నుంచి ఇటీవల వార్షికంగా 50 వేల యూనిట్లను మించి కడుతున్నారు. ఈ సంఖ్య లక్ష దాకా వెళుతోందని నిర్మాణ సంఘాలు అంటున్నాయి. ఐదు అంతస్తుల స్థాయి నుంచి ఇప్పుడు 59 అంతస్తుల వరకు కడుతున్నారు. ఇల్లు, కార్యాలయాలు, పరిశ్రమల భవనాలు ఏటా విస్తీర్ణం పెంచుకుంటూ వెళుతున్నాయి. వీటి ప్రభావం పర్యావరణంపై గణనీయంగా పడుతోంది. పాత ఆవాసాలు కూల్చి, కొత్త వాటిని నిర్మించే క్రమంలో పెద్ద ఎత్తున కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నాయి. నగరాల్లో 40 శాతం కాలుష్యం రియల్‌ ఎస్టేట్‌, ఇన్‌ఫ్రా నుంచే వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ధరిత్రిపై నిర్మాణ రంగ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు క్రెడాయ్‌ తమ సభ్యులను హరిత భవనాలు నిర్మించేలా ప్రోత్సహిస్తోంది. ఈ తరహా భవనాలను కట్టేలా ఇటీవలనే ఐజీబీసీ, క్రెడాయ్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశవ్యాప్తంగా రెండేళ్లలో వెయ్యి ప్రాజెక్టులు, 2030 నాటికి 4వేల ప్రాజెక్ట్‌లను పర్యావరణహితంగా నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.  

నిర్మాణ సమయంలో....

పనులు చేపట్టే ప్రదేశంలో గతంతో పోలిస్తే కొంతవరకు కాలుష్యం తగ్గినా ఇంకా తగ్గించేందుకు అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది అనుసరిస్తున్న విధానాలు మిగతా వారు ఆచరించవచ్చు.

* పాత భవనాలు కూల్చి కొత్తవి కడుతున్నారు. వ్యర్థాలను రీసైక్లింగ్‌ ప్లాంట్‌కు తరలించి వాటితో ఇటుకలు, ఇతర సామగ్రిని తయారు చేయిస్తున్నారు.

* సైట్‌లో పనితో ఎక్కువ కాలుష్యానికి కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో కిటికీలు, తలుపులు మాదిరి స్ట్రక్చర్‌ పరంగా ప్రీకాస్టింగ్‌ విధానంలోకి మారుతున్నారు. నిర్మాణ సామగ్రి ఫ్యాక్టరీలో తయారవుతాయి కాబట్టి కాలుష్యం పెద్దగా ఉండదు.

* ల్యాండ్‌స్కేపింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆకాశహర్మ్యాలను 30 శాతం స్థలంలో నిర్మించి మిగతా 70 శాతంలో పచ్చదనం, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకుంటున్నారు.

* రేడియేషన్‌ తగ్గించేందుకు కూల్‌రూఫ్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఫలితంగా చల్లదనం కోసం కరెంట్‌ వినియోగం తగ్గుతోంది. సౌర పలకల ఏర్పాటుతో వారికి కావాల్సిన కరెంట్‌లో చాలావరకు తమ భవనాలపైనుంచే ఉత్పత్తి చేసుకుంటున్నారు. నెట్‌ జీరో భవనాలను కడుతున్నారు.

* మార్కెట్లో ఐజీబీసీ ధ్రువీకరించిన 500కు పైగా గ్రీన్‌ప్రో ఉత్పత్తులున్నాయి. వీటిని వాడుతూ పర్యావరణహితంగా భవనాలు కడుతున్నారు.

* ఆకాశహర్మ్యాల్లో పైఅంతస్తులకు వెళ్లే కొద్దీ పచ్చదనం కన్పించదు. ఇందుకోసం వర్టికల్‌ గార్డెన్లను భవనాలపై పెంచుతున్నారు. కిటికీల్లో పెంచుకునే సదుపాయాన్నీ కల్పిస్తున్నారు.

రేటింగ్‌లే సూచికలు..

హరితభవనాల్లో మన దగ్గర 30 దాకా రేటింగ్స్‌ ఇస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఐటీ పార్కులు, రిసార్టుల వరకు వీటిలో ఉన్నాయి. పాయింట్ల ఆధారంగా బేసిక్‌, సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినం రేటింగ్‌ను పాయింట్ల ఆధారంగా ఇస్తారు. వీటితో చాలా ప్రయోజనాలున్నాయి.

పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు నిర్మాణంలో తీసుకునే ప్రతి చర్యకు హరిత భవనాల్లో రేటింగ్‌ ఉంటుంది.

* హరిత భవనాల్లో విద్యుత్తు వినియోగం తక్కువ. ఇల్లు, కార్యాలయం ఏదైనా పగటిపూట సహజ వెలుతురు వచ్చేలా.. వెలుగుల కోసం విద్యుత్తు వాడకం పరిమితంగా ఉండేలా నిర్మించుకోవాలి. తద్వారా 30 నుంచి 40 శాతం వరకు విద్యుత్తు ఆదా అవుతుంది.

* కమ్యూనిటీలు, భవనాల్లో వారికి అవసరమైన విద్యుత్తును పూర్తిగా సౌర, పవన విద్యుత్తు ద్వారా ఉత్పత్తి చేసుకున్నట్లయితే నెట్‌జీరో రేటింగ్‌. కరెంట్‌ ఎక్కువగా బొగ్గు నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ సమయంలో ఎక్కువ కాలుష్య ఉద్గారాలు వెలువడుతాయి. ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్తు వాడితే ఆ మేరకు పర్యావరణానికి మేలు చేసినట్లే.

* బహుళ అంతస్తులు, కార్యాలయాల్లో ఏసీ వినియోగం పెరుగుతోంది. ఇంట్లోకి వెలుతురు రావాలే తప్ప వేడి రాకూడదు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్లాసులు వచ్చాయి. నిర్మాణాల ప్రాంగణంలో రేడియేషన్‌ తగ్గించేలా ఎలివేషన్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో ఏసీకి అయ్యే విద్యుత్తు వినియోగం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది.

* 20 నుంచి 30 శాతం నీరు ఆదా చేసే పరికరాల వాడకం, వాడిన నీటిలో 70 శాతం తిరిగి పునర్వినియోగం చేసుకునేలా ఎస్‌టీపీలు ఏర్పాటు చేసుకోవాలి.  

* వాననీటిని పూర్తిగా ఒడిసిపట్టుకోవాలి. శుద్ధి చేసుకుని పునర్వినియోగించుకునేలా నిల్వ చేసుకోవడం, ఇంజక్షన్‌ బోర్‌వెల్స్‌తో భూమిలోకి ఇంకేలా చర్యలతో పట్టణ వరదలను నివారించేందుకు ఉపయోగపడుతుంది.

* నిర్మాణంలో వ్యర్థాలను తగ్గించడం. నిర్మాణంలో ఐజీబీసీ గుర్తింపు ఉన్న సామగ్రిని ఉపయోగిస్తే వాటిలో నివసించేవారు, అక్కడ పనిచేసే వారు మరింత ఆహ్లాదకరంగా ఉంటారు.

* ఇంటి లోపల ఉపయోగించే రంగులు పిల్లలు, గర్భిణులకు తీవ్ర హాని చేస్తుంటాయి. అందులో విడుదలయ్యే రసాయనాలతో చాలామందికి అలర్జీలు వస్తుంటాయి. ఐజీబీసీ సర్టిఫై చేసిన రంగులను వాడుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

* ఈ తరహా భవనాల్లో ఉండేవారు ఆరోగ్యంగా ఉండటం ద్వారా జీవనప్రమాణాలు పెరుగుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని