భవిష్యత్తు గృహాలు ఎలా ఉండబోతున్నాయి?

ఇళ్ల నిర్మాణంలో 75 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నేలను తాకేలా ఉండే పూరిళ్లు మొదలు.. ఇప్పుడేమో ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా ఆకాశహర్మ్యాల కాంక్రీట్‌ నిర్మాణాల వరకు ఎన్నెన్నో మార్పులు.. ఇవన్నీ నిర్మాణపరంగా

Updated : 13 Aug 2022 12:26 IST

వెంటవెంటనే ఇళ్లను మారుస్తున్న కొనుగోలుదారులు 

మున్ముందు సబ్‌స్క్రిప్షన్‌ విధానం వచ్చే అవకాశంపై అంచనాలు

ఈనాడు, హైదరాబాద్‌ 

ఇళ్ల నిర్మాణంలో 75 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నేలను తాకేలా ఉండే పూరిళ్లు మొదలు.. ఇప్పుడేమో ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా ఆకాశహర్మ్యాల కాంక్రీట్‌ నిర్మాణాల వరకు ఎన్నెన్నో మార్పులు.. ఇవన్నీ నిర్మాణపరంగా వచ్చినవి. అయినా ఇప్పటికీ సొంతిల్లు ఎంతోమందికి తీరని కలగానే ఉంది. ఈ స్వప్నం నెరవేర్చుకునేందుకు జీవితకాలంగా కష్టపడుతున్నవారు ఉన్నారు. మరోవైపు  కొందరేమో ఐదారేళ్లకు ఒక సొంతిల్లు మారుస్తున్నారు. వచ్చే రెండున్నర దశాబ్దాల్లో ఇదే పెద్ద పోకడ కాబోతుందని.. మున్ముందు ఇళ్లు కొనడం ఉండకపోవచ్చని.. సబ్‌స్క్రిప్షన్‌ విధానం వచ్చే అవకాశం ఉందని స్థిరాస్తి రంగంలోని యువ డెవలపర్లు అంటున్నారు.

తరం మారుతోంది.. సొంతింటిపై ఆలోచనలూ మారుతున్నాయి. ఒకప్పుడు సొంతింట్లో రెండు మూడు తరాలు నివసించేవారు. కొంతకాలానికి అదికాస్తా ఒక తరానికి తగ్గింది. ప్రస్తుతం చూస్తే ఒక తరం సైతం పూర్తిగా ఉండటం లేదు. పది, పదిహేనేళ్లు కాగానే పాత ఇంటిని అమ్మేసి కొత్త ఇంటికి మారిపోతున్నారు. పెరిగిన కుటుంబ అవసరాలు, ఆర్థిక స్థోమత కారణమేదైతేనేం మార్పును కోరుకుంటున్నారు. ఇప్పటితరం మరింత వేగంగా ఆలోచిస్తోంది. ముఖ్యంగా 2000 తర్వాత పుట్టిన మిలీనియన్లు ఐదారేళ్లలో ఇళ్లు మార్చేస్తున్నారు. కొందరైతే రెండు మూడు ఇళ్లు మారిన ఉదంతాలు కూడా నగరంలో ఉన్నాయి. సొంతిల్లు లేనన్ని రోజులు దానికోసమే తపన. ఇల్లు కొనగానే రెండు మూడేళ్లలో ఆ ముచ్చట కాస్తా తీరగానే మరో ఇంటికో, మరో చోటుకో వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో ఎక్కువగా ఇది కనబడుతోంది.

ఏంటీ విధానం? 

ఇప్పటివరకు ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. నివాసంతో పాటూ పెట్టుబడిగానూ చూస్తున్నారు. ఇతర అన్ని పెట్టుబడి సాధనాలతో పోలిస్తే అత్యధిక రాబడి రియల్‌ ఎస్టేట్‌లోనే వస్తోంది. దీంతో ఇదివరకే ఇళ్లు ఉన్నప్పటికీ రెండు మూడు కొనేవాళ్లు ఉన్నారు. అద్దెలూ వస్తాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ కాబట్టి మరో దశాబ్దం వరకు స్థిరాస్తుల ధరలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా పెరగడం, పట్టణీకరణ, వలసలతో ఇళ్లకు ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉంది. ఇంకా కొంత కాలం ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో సబ్‌స్క్రిప్షన్‌ విధానం తెరపైకి వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలను ఉటంకిస్తూ బిల్డర్లు అంచనా వేస్తున్నారు. 

రాబోయే పాతికేళ్లలో ఇప్పటిలాగా ఇళ్లు కొనకుండానే సొంతం చేసుకోవచ్చు. దీన్నే సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ అంటున్నారు. కొవిడ్‌ ముందు కార్ల విక్రయాలు తగ్గిన సమయంలో మారుతి కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌ విధానం కొత్తగా తీసుకొచ్చింది. కారు అవసరం ఉన్న వ్యక్తులు కొనాల్సిన అవసరం లేకుండా ప్రతినెలా చందా చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవచ్చు. నిర్ణీత కాలాన్ని ఎంచుకుని చందా చెల్లించినంత కాలం ఆ కారుకు మీరే యాజమాని. డౌన్‌పేమెంట్‌ చెల్లింపు, మెయింటనెన్స్, బీమా ఖర్చులేవి ఉండవు. కంపెనీ వీటన్నింటనీ పరిగణనలోకి తీసుకుని నెలసరి చందా మొత్తాన్ని ఎంచుకున్న వాహనాన్ని బట్టి నిర్ణయిస్తుంది. ఇంటికి సైతం ఇదే విధానంలో బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు సబ్‌స్క్రిప్షన్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ‘సొంతిల్లు అయినా ఇటీవల ఒకేఇంట్లో ఎక్కువకాలం ఉండటం లేదు. పనిచేసే ప్రదేశానికి దగ్గరగా ఉండాలని.. అక్కడికి మారిపోతున్నారు. ట్రాఫిక్‌లో సమయం వృథా చేయడం కంటే ఇంట్లో కుటుంబంతో ఎక్కువ సమయం గడపవచ్చు అనేది వారి ఆలోచన. ఇందుకోసం అవసరమైతే సంవత్సరాల వ్యవధిలోనే రెండు మూడు ఇళ్లను మార్చేస్తున్నారు. సొంతిల్లు అని కూడా వెనకాడం లేదు. సిటీలోని ఇతర ప్రాంతాల్లో ఉండేవారు సైతం ఐటీ కారిడార్‌లో ఫ్లాట్‌ కావాలని ఇక్కడ బుక్‌ చేస్తున్నారు. అయితే చాలా తరచుగా ఇళ్లు మారుస్తున్న పోకడను గమనిస్తే.. మున్ముందు రియల్‌ ఎస్టేట్‌లోనూ కార్ల మార్కెట్లో వచ్చినట్లు సబ్‌స్క్రిప్షన్‌ విధానం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయంగా కొన్ని అధ్యయనాలు దీనిపై వచ్చాయి’ అని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఏఎస్‌బీఎల్‌ సీఈవో అజితేష్‌ ‘ఈనాడు’తో అన్నారు.

ఆర్థికంగా వచ్చిన మార్పు 

హైదరాబాద్‌ నగరంలో తాతల తరంలో చూస్తే ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలతో సొంతిల్లు కొనుగోలు చేసేవారు. వీరి తర్వాత తండ్రుల తరంలో ఉద్యోగంలో చేరి పదేళ్ల అనంతరం గృహరుణం తీసుకుని సొంతింట్లోకి అడుగుపెట్టేవారు. ఈ తరం ఉద్యోగంలో చేరడం మొదలు సొంతిల్లు కొనేస్తున్నారు. ఆదాయాలు పెరగడం, ఆదాయ పన్ను ప్రయోజనాల దృష్ట్యా కొలువులో చేరిన మొదట్లోనే ఇల్లు కొనేస్తున్నారు. సిటీలో అమ్మానాన్నల పేరుతో ఇల్లు ఉన్నా.. సొంతంగా తనపేరుతో ఇల్లు ఉండాలని వారు కొలువుండే చోట కొనడానికి ఇష్టపడుతున్నారు. అక్కడ కూడా స్థిరంగా ఉండటం లేదు. ఆర్థిక స్థోమత మారగానే ఇల్లు మార్చేస్తున్నారు. ప్రపంచీకరణతో వచ్చిన మార్పులు కూడా దీనికి తోడయ్యాయి. దేశ విదేశాల్లో పనిచేయాల్సి రావడంతో ఎక్కడ ఉన్నా స్వల్పకాలం మాత్రమే కావడంతో ఇళ్లు మారుతున్నట్లు యజమానులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ భవిష్యత్తులో కొత్త పోకడలకు నాంది కాబోతున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌లో భవిష్యత్తులో సబ్‌స్క్రిప్షన్‌ విధానం రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని