నాలా పన్నులు కట్టించుకోరు తనఖాలో ఆస్తులు విడుదల చేయరు

ఇదొక చిత్రమైన సమస్య. కొందరు బిల్డర్లు ఎదుర్కొంటున్న వింత పరిస్థితి. నాలా ఛార్జీలు కట్టలేక.. వారి ప్రాజెక్ట్‌లోని మార్ట్‌గేజ్‌ ఆస్తులు విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని కొనుగోలు చేసిన వారు సైతం రిజిస్ట్రేషన్లు కాక దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు.

Published : 15 Oct 2022 02:35 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఇదొక చిత్రమైన సమస్య. కొందరు బిల్డర్లు ఎదుర్కొంటున్న వింత పరిస్థితి. నాలా ఛార్జీలు కట్టలేక.. వారి ప్రాజెక్ట్‌లోని మార్ట్‌గేజ్‌ ఆస్తులు విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని కొనుగోలు చేసిన వారు సైతం రిజిస్ట్రేషన్లు కాక దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని నరెడ్కో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతోంది.

నగరం అభివృద్ధి చెందుతూ శివార్లకు విస్తరిస్తోంది. జనాభా పెరిగేకొద్దీ వ్యవసాయ భూములు కాస్తా ఆవాస కేంద్రాలుగా మారిపోతున్నాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలైన పరిశ్రమలు, వాణిజ్య భవనాలు, గృహ నిర్మాణం, ప్లాటింగ్‌ వెంచర్ల కోసం వినియోగించుకోవాలంటే మొదట భూవినియోగ మార్పిడి చేయించుకోవాలి. నిబంధనల మేరకు ఉంటే అధికారులు అనుమతులు ఇస్తారు. వ్యవసాయం కోసం మాత్రమే వినియోగించాల్సి ఉంటే దరఖాస్తును తిరస్కరించే అధికారం అధికారులకు ఉంటుంది. భూ వినియోగ మార్పిడి కోసం నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్స్‌ అసెస్‌మెంట్‌(నాలా) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

తగ్గించారు

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో భూమి విలువపై 2 శాతం నాలా పన్నులు ఉంటే.. శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లాల్లో పన్నులు 3 శాతంగా ఉన్నాయి. ఎక్కువ శాతం నాలా మార్పిడి కోసం శివార్ల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. ధరణితో ప్రక్రియ సులువు అయిందని బిల్డర్లు చెబుతున్నాయి. అయితే సమస్యల్లా గతంలో నాలా పన్నులు అధికంగా ఉన్నప్పటిదని చెబుతున్నారు. ఇదివరకు 7 నుంచి 9 శాతం వరకు నాలా పన్నులు చాలా భారంగా ఉండేవని గుర్తు చేశారు. మాస్టర్‌ ప్లాన్‌లో రెసిడెన్షియల్‌ జోన్‌గా గుర్తించిన ప్రాంతంలో నివాసాలు కడుతుంటే నాలా పన్నులు వేయడం అర్థం లేనిదని.. కన్వర్షన్‌ ఫీజులు కట్టిన తర్వాత నాలా పన్నులు ఎందుకని కొందరు బిల్డర్లు కోర్టుకెళ్లారు.


5 శాతం అదనంగా మార్ట్‌గేజ్‌ చేశారు

నాలా పన్నులు అధికంగా ఉన్నప్పుడు కొంతమంది బిల్డర్లు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. నాలా పన్నులు కట్టకుండానే హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందారు. అనుమతి ఇస్తూనే హెచ్‌ఎండీఏ సాధారణంగా ఉండే 10 శాతం మార్ట్‌గేజ్‌కు అదనంగా మరో 5 శాతం మార్ట్‌గేజ్‌ చేయించుకుంది. కొంతకాలం క్రితమే ఈ ప్రాజెక్టుల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ సైతం పలువురు బిల్డర్లు పొందారు. నాలా పన్నులు కట్టాల్సిందేని కోర్టు చెప్పడంతో బిల్డర్లు సైతం కట్టేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా భూమి వినియోగ మార్పిడికి నాలా ఛార్జీలు కడతారు. ఇక్కడ ఇదివరకే భూమి మార్పిడి జరిగింది. ఇప్పుడు దీనికి ఎలా నాలా పన్నులు కట్టించుకోవాలో తెలియని పరిస్థితులు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తే తప్ప నాలా పన్నులు కట్టడం సాధ్యం కాదు. ఎంతోకాలంగా అధికారులను అడుగుతున్నా స్పందన లేదు. దీంతో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టుల్లో 5 శాతం తనఖాలో ఉండిపోయాయి. డబ్బులు కట్టించుకుని తనాఖాలోని స్థిరాస్తులను విడుదల చేయాలి. పన్నులు కట్టగానే వెంటనే విడుదల అవుతాయని భావించి వీటిని సైతం విక్రయించిన వారు రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బంది పడుతున్నారు.

- ఎం.విజయసాయి, ప్రధాన కార్యదర్శి, నరెడ్కో తెలంగాణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని