మెట్రోతో మెరుగ్గా..

మెట్రోరైలు రాకతో ఒక ప్రాంతంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌లో దాని ప్రభావం ఎలా ఉంటుంది? స్థిరాస్తుల విలువ, అద్దెల్లో వృద్ధి ఏ మేరకు ఉంటుంది? బెంగళూరు మెట్రోకి సంబంధించి అక్కడి ఆఫీస్‌ మార్కెట్‌పై కొలియర్స్‌ సంస్థ అధ్యయనం చేసింది.

Published : 15 Apr 2023 00:38 IST

ఈనాడు, హైదరాబాద్‌ : మెట్రోరైలు రాకతో ఒక ప్రాంతంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌లో దాని ప్రభావం ఎలా ఉంటుంది? స్థిరాస్తుల విలువ, అద్దెల్లో వృద్ధి ఏ మేరకు ఉంటుంది? బెంగళూరు మెట్రోకి సంబంధించి అక్కడి ఆఫీస్‌ మార్కెట్‌పై కొలియర్స్‌ సంస్థ అధ్యయనం చేసింది. మెట్రో అనుసంధానంతో వైట్‌ఫీల్డ్‌ ప్రాంతంలో కార్యాలయ అద్దెల్లో వచ్చే రెండేళ్లలో ఎనిమిది నుంచి పది శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. మనవాళ్లు బెంగళూరులో సైతం పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడమే కాదు ఐటీ ఉద్యోగులు ఎంతోమంది అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు.

కొత్తగా రహదారులు నిర్మించినా, మెట్రో ప్రాజెక్ట్‌ వచ్చినా ఆ ప్రాంతంలో స్థిరాస్తుల ధరలకు రెక్కలొస్తాయి. ఇల్లు, కార్యాలయాల అద్దెలు పెరుగుతాయి. బెంగళూరు మెట్రో అధ్యయనంలోనూ ఇదే తేలింది. అక్కడ వైట్‌ఫీల్డ్‌ ఐటీ కార్యాలయాల హబ్‌గా ఉంది. 40.4 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయాల నిర్మాణాలు ఉన్నాయి. ట్రాఫిక్‌ సమస్యలు, సరైన అనుసంధానం లేక గత ఏడాది నాలుగో త్రైమాసికంలో 17.2 శాతం ఖాళీలు ఉన్నాయి. మెట్రో అనుసంధానం వచ్చాక ఖాళీలు నిండటమే కాదు వాటి అద్దెలు రెండేళ్లలో 8 నుంచి 10 శాతం పెరగనున్నట్లు సదరు సంస్థ అంచనా వేసింది.

* 2011-16తో పోలిస్తే మెట్రో నిర్మాణం ప్రారంభం అయ్యాక వైట్‌ఫీల్డ్‌లో 2017 నుంచి 2022 వరకు కార్యాలయాల నిర్మాణాల్లో 10 శాతం పెరుగుదల కనిపించింది. లీజింగ్‌ కూడా 18 శాతం పెరిగింది.

* మెట్రో ప్రకటన సమయంలో వార్షిక లీజింగ్‌ 1.5 మిలియన్‌ చదరపు అడుగులు ఉంటే  ప్రణాళిక దశలో 1.9 మిలియన్‌ చదరపు అడుగులకు, నిర్మాణ దశలో 2.2 మిలియన్‌ చదరపు అడుగులకు పెరిగింది. 

* కొత్తగా నిర్మాణాలు సైతం 2 మిలియన్‌ చ.అ. నుంచి 2.2 మి.చ.అ, 2.4 మి.చ.అ.లకు పెరిగింది.

* బెంగళూరు సీబీడీ ప్రాంతంలో రవాణా ఆధారిత అభివృద్ధిలో గణనీయమైన మార్పులు వచ్చాయి.

మన దగ్గర సైతం

మన దగ్గర ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో రాబోతోంది. ప్రకటన సమయం నుంచి ఇప్పటికే ఈ మార్గంలో స్థిరాస్తుల ధరల్లో గణనీయమైన పెరుగుదల వచ్చింది. ఐటీ కారిడార్‌లో కోట్లకు పడగలెత్తినా ఇళ్లను కొనలేనివారు సిటీకి దూరంగా శంషాబాద్‌ వైపు కొనుగోలుకు మార్గం ఏర్పడింది. దూరమైనా మెట్రోలో అరగంటలో ఐటీకారిడార్‌కు చేరుకునే సౌలభ్యం మెట్రోతో రాబోతోంది. ఈ మార్గంలో ఐటీ కార్యాలయాలు సమీప భవిష్యత్తులో పెరగనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు