స్థిరాస్తి ప్రదర్శన 16 నుంచి

క్రెడాయ్‌ హైదరాబాద్‌ పదో స్థిరాస్తి ప్రదర్శన (ప్రాపర్టీ షో)ను ఏప్రిల్‌ 16,17,18 తేదీల్లో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు పి.రామకృష్ణారావు తెలిపారు...

Published : 20 Mar 2021 03:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: క్రెడాయ్‌ హైదరాబాద్‌ పదో స్థిరాస్తి ప్రదర్శన (ప్రాపర్టీ షో)ను ఏప్రిల్‌ 16,17,18 తేదీల్లో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు పి.రామకృష్ణారావు తెలిపారు. బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో ప్రదర్శనకు సంబంధించి స్టాల్స్‌ లేఅవుట్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి అవసరాలు, బడ్జెట్‌కు తగినట్లుగా వెయ్యికిపైగా స్థిరాస్తులను ఒకే గొడుగు కింద ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులకు మాత్రమే అవకాశం కల్పించినట్లు  తెలిపారు. డెవలపర్ల నుంచి స్పందన బాగుందని.. హాల్‌-1లోని స్టాల్స్‌ తొలిరోజు రెండు గంటల వ్యవధిలో వందశాతం బుక్‌ అయ్యాయని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌ దృష్ట్యా మరింత విశాలమైన స్టాల్స్‌, సమావేశ మందిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తరచూ శానిటైజ్‌ చేయడం, ప్రతి స్టాల్‌ వద్ద శానిటైజర్‌ అందుబాటులో ఉంచడంతో పాటు మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేశామని, సందర్శకుల భద్రతకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో ఉపాధ్యక్షులు సి.మురళీమోహన్‌, కె.రాజేశ్వర్‌, వేణు వినోద్‌, కోశాధికారి ఆదిత్యగౌర, సంయుక్త కార్యదర్శులు కె.రాంబాబు, శివరాజ్‌ ఠాగూర్‌, సభ్యులు నితీష్‌రెడ్డి, క్రెడాయ్‌ యువజన విభాగం నుంచి జాయ్‌దీప్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని