హరిత భవనాలు @ 10 బిలియన్లు!

దేశంలో హరిత భవనాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 21 లక్షల అపార్ట్‌మెంట్లు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) సర్టిఫికేషన్‌ పొందాయి. హరిత భవనాల రేటింగ్‌లో ఇది ప్రారంభ స్థాయి. ప్రాజెక్టులో వాడిన సామగ్రి, కల్పించిన సౌకర్యాలను బట్టి సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినం రేటింగ్‌ ఇస్తారు.

Updated : 08 Oct 2022 03:56 IST

ఈనాడు, హైదరాబాద్‌ : దేశంలో హరిత భవనాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 21 లక్షల అపార్ట్‌మెంట్లు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) సర్టిఫికేషన్‌ పొందాయి. హరిత భవనాల రేటింగ్‌లో ఇది ప్రారంభ స్థాయి. ప్రాజెక్టులో వాడిన సామగ్రి, కల్పించిన సౌకర్యాలను బట్టి సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినం రేటింగ్‌ ఇస్తారు. ఇప్పటి వరకు 2700 ప్రాజెక్టులు రిజిస్టర్‌ అయ్యాయి. 2.20 బిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో హరిత నివాసాలు విస్తరించాయి. దేశ వ్యాప్తంగా వెయ్యి మంది డెవలపర్లు, 130కి పైగా నగరాల్లో హరిత భవనాలను చేపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కొన్ని ప్రధాన నగరాల వరకే హరిత నివాసాలు విస్తరిస్తే.. భారత్‌లో మాత్రం చిన్న నగరాల్లో సైతం పర్యావరణహిత నివాసాల రాక మొదలైందని ఐజీబీసీ తెలిపింది.

అడుగు దూరంలో...  : గృహ, వాణిజ్య, ఇతర రంగాల్లో కలిపి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8.30 బిలియన్‌ చదరపు అడుగుల్లో హరిత నిర్మాణాలు వచ్చాయి. 8254 గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఏడాది చివరికి 10 బిలియన్‌ చ.అ.కు చేరుకోవాలనే లక్ష్యాన్ని ఐజీబీసీ నిర్దేశించుకుంది. ఈ నెలలో జరిగే సదస్సు స్ఫూర్తితో లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. 

చిన్నగా మొదలై.. : మనదేశంలో హరిత భవనాల నిర్మాణాల పద్ధతి హైదరాబాద్‌ నుంచే 2001లో మొదలైంది. మాదాపూర్‌లో గోద్రెజ్‌ సీసీఐ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ భవనం తొలి హరిత భవనంగా గుర్తింపు పొందింది. ఆ ఏడాదే తొలి గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌ కొద్దిమంది స్పీకర్లతో జరిగింది. 20వ సదస్సు నాటికి హరిత స్ఫూర్తి దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆసియాలోనే అతిపెద్ద సదస్సు స్థాయికి ఎదిగింది. తెలంగాణలో ఇప్పటివరకు 5144 ప్రాజెక్టులు రిజిస్టర్‌ అయ్యాయి.


బిల్డర్లు ముందుకు రావాలి

హరిత భవనాల నిర్మాణానికి అవసరమైన సామగ్రి ప్రస్తుతం మన వద్దే తయారవుతోంది. గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకొనేవారం. 500కు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. బిల్డర్లు ప్లానింగ్‌ దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే ఖర్చు తక్కువే అవుతుంది. తమ సభ్యులు హరిత భవనాలు నిర్మించేలా క్రెడాయ్‌ ప్రోత్సహించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

- సి.శేఖర్‌రెడ్డి, ఛైర్మన్‌, ఐజీబీసీ, హైదరాబాద్‌ చాప్టర్‌


అంతరం తగ్గింది

డెవలపర్లు హరిత నివాసాలను కట్టేందుకు ఐజీబీసీ ప్రోత్సహిస్తోంది. ఫలితంగా ఐజీబీసీకి, డెవలపర్ల మధ్య గతంలో ఉన్న అంతరం చాలావరకు తగ్గింది. ప్రస్తుతం ఎక్కువ మంది ముందుకొస్తున్నారు. చాలామంది బిల్డర్లు రేటింగ్‌ తీసుకోకపోయినా.. వారి ప్రాజెక్టుల్లో హరిత ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు.

- కె.ఎస్‌.వెంకటగిరి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఐజీబీసీ


ఆరోగ్యం మెండు

హరిత భవనాలతో పర్యావరణానికే కాకుండా.. ఆయా ఇళ్లలో ఉండేవారి ఆరోగ్యమూ బాగుంటుంది. ఐజీబీసీ ధ్రువీకరణ పొందిన ప్రాజెక్టుల్లో నిర్మాణ సమయంలో, ఆ తర్వాత నిర్వహణ వ్యయం తగ్గుతుంది. నీటి వినియోగ శాతం తగ్గుతుంది. పునర్వినియోగ సామగ్రితో పర్యావరణంపై తక్కువ ప్రభావం పడుతుంది.

- ఆనంద్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఐజీబీసీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని