పండగ వేళ...రుచుల మేళా!

తియ్యతియ్యగా... పుల్లపుల్లగా... కారంకారంగా...  పండగపూట సంతోషంగా...నోరు తీపి చేసుకుందామా! రానున్న రంజాన్‌ పర్వదినం సందర్భంగా  తీపి, పులుపు, కారం రుచుల మేళవింపు మీ కోసం!కావాల్సినవి: బాదం-200 గ్రా., చక్కెర- 100 గ్రా., పసుపు రంగు- చిటికెడు, యాలకుల పొడి-చెంచా, పాలు- 150 ఎం.ఎల్‌., నెయ్యి-100 గ్రా.,

Updated : 15 Jun 2021 12:38 IST

తియ్యతియ్యగా... పుల్లపుల్లగా... కారంకారంగా...  పండగపూట సంతోషంగా...నోరు తీపి చేసుకుందామా! రానున్న రంజాన్‌ పర్వదినం సందర్భంగా  తీపి, పులుపు, కారం రుచుల మేళవింపు మీ కోసం!

బాదం  హల్వా

కావాల్సినవి: బాదం-200 గ్రా., చక్కెర- 100 గ్రా., పసుపు రంగు- చిటికెడు, యాలకుల పొడి-చెంచా, పాలు- 150 ఎం.ఎల్‌., నెయ్యి-100 గ్రా.,                    
తయారీ: వేడి నీటిలో బాదంపప్పును 40 నిమిషాలు నానబెట్టాలి. పొట్టుతీసి గ్రైండర్‌లో వేసి చక్కెర, ఇలాచి జత చేసి బరకగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.  
నాస్‌స్టిక్‌పాన్‌లో నెయ్యి వేసి గ్రైండ్‌ చేసుకున్న బాదంపప్పు ముద్దతోపాటు పసుపు రంగు, పాలు పోసి 15 నుంచి 20 నిమిషాలపాటు మీడియం మంటపై వేయించాలి లేదా నెయ్యి పైకి తేలే వరకూ వేయించాలి. చల్లారాక బాదం పలుకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

ఫలఫెల్‌...

కావాల్సినవి: నానబెట్టిన కాబూలీ సెనగలు- కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, వెల్లుల్లి- ఒకటి, కొత్తిమీర, పుదీనా తరుగు; ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరంమసాలా- చెంచా చొప్పున; ఉప్పు- తగినంత, వంటసోడా- పావు చెంచా, మైదా- రెండు పెద్ద చెంచాలు, నిమ్మకాయ- సగం ముక్క, ఉప్పు- తగినంత.
తయారీ:  నానబెట్టుకున్న సెనగలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, నిమ్మరసం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, గరంమసాలా, వంటసోడా, ఉప్పు... అన్నింటినీ కలిపి బ్లెండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా గ్రైండ్‌ చేసుకున్న మిశ్రమంలో మైదా, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పొయ్యి వెలిగించి బాణలీ పెట్టి నూనె పోయాలి. అది బాగా కాగిన తర్వాత ఈ ఉండలను వేసి బంగారు రంగు వరకు వచ్చేవరకు వేయించుకోవాలి. వీటిని టొమాటో సాస్‌తో సర్వ్‌ చేసుకుంటే సరి.

షీర్‌ కుర్మా

కావాల్సినవి: పాలు- అర లీటరు, చక్కెర- 125 గ్రా., నెయ్యి- మూడు పెద్ద చెంచాలు, జీడిపప్పు- రెండు పెద్ద చెంచాలు, కిస్మిస్‌- పెద్ద చెంచా, పిస్తా- ఎనిమిది, సార పలుకులు- పెద్ద చెంచా, యాలకుల పొడి- చెంచా, ఖర్జూరం- అయిదు, బాదం-ఎనిమిది, సన్న సేమ్యా- 100 గ్రా.
తయారీ: జీడిపప్పు, బాదం, ఖర్జూరాలను సన్నగా కట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
* నాన్‌స్టిక్‌ పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక సన్నగా కట్‌ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, ఖర్జూరం ముక్కలు, కిస్మిస్‌, పిస్తా, సార పలుకులను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదేపాన్‌లో సేమ్యాను వేసి నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ వేయించిన పాన్‌లోనే పాలు పోసి మరిగించాలి. ఈ పాలలో చక్కెర వేసి చిక్కగా అయ్యేవరకు కలుపుతూ ఉండాలి. మరిగిన ఈ షీర్‌ కుర్మాలో వేయించిన డ్రైఫ్రూట్స్‌, నట్స్‌ వేసి  వేడిగా/చల్లగా తినొచ్చు.

బగారా దహీ వడ

కావల్సినవి: సెనగపిండి- 150 గ్రా., అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, పసుపు- చిటికెడు, కారం- ఒకటిన్నర చెంచా, ఉప్పు- తగినంత, వంటసోడా- రెండు చిటికెలు, పెరుగు- నాలుగు కప్పులు, నూనె- వేయించడానికి సరిపడా, జీలకర్ర- చెంచా, ఎండుమిర్చి- అయిదు, కరివేపాకు- మూడు రెమ్మలు, పుదీనా, కొత్తిమీర తరుగు- మూడు పెద్ద చెంచాల చొప్పున.
తయారీ: గిన్నెలో సెనగపిండి, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, పసుపు, కారం, వంటసోడా, రెండు కప్పుల నీళ్లు పోసి చిక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంటపాటు నానబెట్టాలి.
* మరో గిన్నెలో పెరుగు, నాలుగు కప్పుల నీళ్లు, కొంచెం అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
* పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక సెనగపిండి మిశ్రమాన్ని బజ్జీల్లా వేసుకుని బంగారు వర్ణం వచ్చేవరకు వేయించుకోవాలి.
* వేడి వేడి బజ్జీలను ముందుగా తయారుచేసి పెట్టుకున్న పెరుగులో 10-15 నిమిషాలు నానబెట్టాలి.
* మరో బాణలి తీసుకుని పొయ్యి మీద పెట్టి నూనె వేయాలి. వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాలింపును బగారా దహీ వడలో వేసుకోవాలి. అంతే రుచికరమైన, నోరూరించే బగారా దహీ వడ రెడీ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని