Jackfruit: పోషకాల వరస పనస!

వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పనస కూడా ఒకటి. పండిన పనస తొనలతో రుచి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. ఇతర పండ్లతో పోలిస్తే విటమిన్లు, ఫొలేట్‌, నియాసిన్‌, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.

Published : 07 May 2023 00:06 IST

పోషకాలం

వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పనస కూడా ఒకటి. పండిన పనస తొనలతో రుచి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. ఇతర పండ్లతో పోలిస్తే విటమిన్లు, ఫొలేట్‌, నియాసిన్‌, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అధికంగా ఉండే ఫైబర్‌ జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. అల్సర్‌, మధుమేహాం, గుండెపోటు, రక్తపోటు తదితర సమస్యలు దూరమవుతాయి. ఇందులో ఉండే సి విటమిన్‌ చర్మం, శిరోజాలను సంరక్షిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. క్యాన్సర్‌ నిరోధకాలుగా పనిచేసే ఫైటో న్యూట్రియంట్స్‌ పనసలో పుష్కలంగా ఉంటాయి.  క్యాన్సర్‌ సమస్యని కూడా దూరం చేస్తుంది. ఖనిజాలు, లవణాలు థైరాయిడ్‌ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించటమే కాక బరువును అదుపులో ఉంచుతుంది. ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. విటమిన్‌ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫుడ్‌ అలర్జీ ఉన్న వారు పనస పండుకి దూరంగా ఉంటేనే మంచిదట. దీంట్లో ఉండే క్యాల్షియం ఎముకలు గట్టిపడేలా చేసి, విరగకుండా కాపాడుతుంది. పచ్చి పనసతో బిర్యాని కూడా చేస్తారు. పనస పండు గింజలను ఇష్టంగా తింటారు. వీటిల్లో ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి.

హల్వా..

కావల్సినవి:  పనస తొనలు- కప్పు, కోవా- రెండు చెంచాలు, పంచదార- రెండు చెంచాలు, డ్రైఫ్రూట్స్‌- పావుకప్పు, నెయ్యి- పావుకప్పు..

తయారీ: ముందుగా పనస తొనల్లోని గింజలు తొలగించేసి.. మిక్సీలో వేసి మెత్తగా తిప్పాలి. బాణలి పెట్టుకొని దాంట్లో రెండు చెంచాల నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ వేయించుకొని తీసుకోవాలి. అందులోనే పనసతొనల గుజ్జు వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేగనివ్వాలి. ఇప్పుడు దాంట్లో మెత్తగా మెదిపిన కోవా, పంచదార వేసి కలపాలి. కడాయికి అంటుకోకుండా దగ్గర పడేంత వరకూ కలుపుతూ ఉండాలి. చివర్లో వేయించిన ఢ్రైఫ్రూట్‌్్స వేసుకొని దింపేయటమే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని