మధురమైన... మంచు ముత్యాలు!

సగ్గుబియ్యంతో కిచిడీ చేస్తే ఆ రుచి మనసుకు గాలం వేస్తుంది... పాయసం చేస్తే పంటికింద పరుగులు పెట్టే సగ్గుబియ్యం గింజల రుచి రోజంతా గుర్తుంటుంది. సగ్గుబియ్యంతో అవి మాత్రమే కాదు ఘుమఘుమలాడే వంటకాలు చాలానే చెయ్యొచ్ఛు.

Updated : 15 Jun 2021 13:03 IST

సగ్గుబియ్యంతో అద్భుత రుచులు

సగ్గుబియ్యంతో కిచిడీ చేస్తే ఆ రుచి మనసుకు గాలం వేస్తుంది... పాయసం చేస్తే పంటికింద పరుగులు పెట్టే సగ్గుబియ్యం గింజల రుచి రోజంతా గుర్తుంటుంది. సగ్గుబియ్యంతో అవి మాత్రమే కాదు ఘుమఘుమలాడే వంటకాలు చాలానే చెయ్యొచ్ఛు.


కిచిడి

కావాల్సినవి: సగ్గుబియ్యం- కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ- ఒకటి, ఉడికించి చిన్న ముక్కలుగా కోసిన బంగాళాదుంపలు- రెండు, దోరగా వేయించి పొట్టు తీసిన వేరుసెనగపప్పు- మూడు టేబుల్‌స్పూన్లు, తరిగిన పచ్చిమిర్చి- రెండు, జీలకర్ర- అర టీస్పూన్‌, కరివేపాకు- కొద్దిగా, కొత్తమీర- కొద్దిగా, నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు- పావు టీస్పూన్‌, ఉప్పు- తగినంత.

తయారీ: సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి మూడు గంటలపాటు నానబెట్టి నీళ్లు వడకట్టాలి. వేరుసెనగపప్పును బరకగా మిక్సీ పట్టాలి. గిన్నెలో సగ్గుబియ్యం, సగం పల్లీపొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, చిటికెడు ఉప్పు వేసి వేయించాలి. ఇప్పుడు వేరుసెనగపప్పు, బంగాళాదుంప ముక్కలు, వేరుసెనగ పొడి, సగ్గుబియ్యం మిశ్రమం వేయాలి. ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి అయిదు నిమిషాలపాటు ఉడికించాలి. పక్కన పెట్టుకున్న వేరుసెనగపప్పు పొడిని వేసి కలపాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి దించేయాలి. ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్ఛు సగ్గుబియ్యాన్ని ఎక్కువసేపు నానబెడితే కిచిడి త్వరగా ఉడికిపోతుంది.


వడలు

కావాల్సినవి: సగ్గుబియ్యం - కప్పు, బంగాళాదుంపలు- రెండు, వేరుసెనగపప్పు- కప్పు, జీలకర్ర- టీస్పూన్‌, కరివేపాకు రెబ్బలు- కొన్ని, తరిగిన పచ్చిమిర్చి- రెండు, కారం- టేబుల్‌స్పూన్‌, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడినంత.

తయారీ: సగ్గుబియ్యాన్ని మూడుగంటలపాటు నానబెట్టుకోవాలి. బంగాళాదుంపలు ఉడికించి, పొట్టు తీసి మెత్తగా చేసి పెట్టుకోవాలి. వేరుసెనగపప్పును దోరగా వేయించి పొడిచేయాలి. గిన్నెలో సగ్గుబియ్యం, బంగాళాదుంప ముద్ద, వేరుసెనగపప్పు పొడి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి సగ్గుబియ్యం మిశ్రమంతో వడలు చేసి వేయించాలి. వీటిని చిన్నమంట మీద రెండు వైపులా దోరగా వేయించాలి. టమాటా సాస్‌ లేదా కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయి.


దోసెలు

కావాల్సినవి: బియ్యం- రెండు కప్పులు, సగ్గుబియ్యం- కప్పు, అటుకులు- అరకప్పు, మినప్పప్పు- పావుకప్పు, మెంతులు- పావు టీస్పూన్‌, ఉప్పు- కొద్దిగా.

తయారీ: బియ్యం, మినప్పప్పు, మెంతులు, అటుకులు, సగ్గుబియ్యాన్ని అయిదు గంటలపాటు నానబెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని రాత్రంతా అలాగే ఉంచాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్‌ వెలిగించి పెనం పెట్టి, అది వేడెక్కాక నూనె పోసి దోసె వేయాలి. ఈ దోసెలు ఎంతో మృదువుగా రుచిగా ఉంటాయి.


షర్బత్‌

కావాల్సినవి: సగ్గుబియ్యం- అరకప్పు, కొబ్బరి తురుము- అరకప్పు, పంచదార- కప్పు, పాలు- లీటరు, చెనా(పాలవిరుగుడు)- కప్పు, చిన్నముక్కలుగా కోసిన యాపిల్‌- ఒకటి, కిస్‌మిస్‌- స్పూన్‌, ద్రాక్షపండ్లు- పది, అరటిపండ్లు- రెండు, మిరియాలపొడి- అర టీస్పూన్‌, దానిమ్మ గింజలు- రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ: సగ్గుబియ్యాన్ని కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. సగ్గుబియ్యం, కొబ్బరి తురుములో కొద్దిగా పాలు పోసి గ్రైండ్‌ చేసుకోవాలి. అరటిపండ్లను గిన్నెలో వేసి మెదపాలి. దీంట్లో పంచదార, పాలు, చెనా వేసి కలపాలి. తర్వాత మిరియాల పొడి, సగ్గుబియ్యం మిశ్రమం, కిస్‌మిస్‌ వేసి మరోసారి బాగా కలిపితే సరి. చివరగా ద్రాక్షపండ్లు, దానిమ్మ గింజలు వేసుకుంటే రుచిగా ఉంటుంది. దీన్ని కాసేపు ఫ్రిజ్‌లో పెడితే చలచల్లని షర్బత్‌ తయారైనట్లే.


పాయసం

కావాల్సినవి: సగ్గుబియ్యం- అరకప్పు, పంచదార అరకప్పు, పాలు- రెండు కప్పులు, జీడిపప్పు- టేబుల్‌స్పూన్‌, సన్నగా కోసిన ఎండుకొబ్బరి ముక్కలు- టేబుల్‌స్పూన్‌, నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, కిస్‌మిస్‌- ్‌స్పూన్‌, యాలకుల పొడి- పావు టీస్పూన్‌, ఫుడ్‌కలర్‌- కొద్దిగా, నీళ్లు - రెండు కప్పులు.

తయారీ: సగ్గుబియ్యాన్ని కడిగి రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. గిన్నెలో నెయ్యి వేసి వేడెక్కాక జీడిపప్పు, ఎండుకొబ్బరి ముక్కలు, కిస్‌మిస్‌లను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిలో నీళ్లు పోసి, ఫుడ్‌ కలర్‌ వేసి మరిగించాలి. దీంట్లో సగ్గుబియ్యం వేసి అడుగు అంటకుండా కలుపుతూ పది నిమిషాలపాటు ఉడికించాలి. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసి బాగా కలపాలి. పొంగు రాకుండా సన్నని మంట మీద ఉడికిస్తూ పంచదార వేయాలి. చివరగా యాలకుల పొడి, జీడిపప్పు, కిస్‌మిస్‌, కొబ్బరి ముక్కలు వేసి బాగా కలపాలి. పాయసం మరీ పలచగా లేదా గట్టిగా కాకుండా చూసుకోవాలి. దీన్ని వేడిగా లేదా ఫ్రిజ్‌లో పెట్టుకుని చలచల్లగా తినొచ్ఛు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని