చిక్కీతో చలికి చెక్‌!

చలి చలిగా ఉందా.. అయితే వెంటనే ఓ చిక్కీని అందుకోవాల్సిందే. నువ్వులు, ఓట్సు, గులాబీలు,  డ్రైఫ్రూట్స్‌, అవిసె, గుమ్మడి గింజలను బెల్లంతో కలిపి చేసిన చిక్కీలు శరీరానికి శక్తినీ, వేడిని అందించి రోజంతా మిమ్మల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుతాయి.

Updated : 15 Jun 2021 12:57 IST

చలి చలిగా ఉందా.. అయితే వెంటనే ఓ చిక్కీని అందుకోవాల్సిందే. నువ్వులు, ఓట్సు, గులాబీలు,  డ్రైఫ్రూట్స్‌, అవిసె, గుమ్మడి గింజలను బెల్లంతో కలిపి చేసిన చిక్కీలు శరీరానికి శక్తినీ, వేడిని అందించి రోజంతా మిమ్మల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుతాయి.


గులాబీలతో ..

కావాల్సినవి: జీడిపప్పు, బాదం, పిస్తా తురుము- కప్పు, పంచదార- కప్పు, ఎండిన గులాబీరేకలు- అరకప్పు,  గసగసాలు- టీస్పూన్‌, యాలకుల పొడి- చిటికెడు, నెయ్యి- పావుకప్పు.
తయారీ: కడాయిలో పంచదార వేసి తక్కువ మంట మీద వేయించాలి. అది మెల్లగా కరిగి పాకంలా అవుతుంది. దీంట్లో జీడిపప్పు, బాదం తరుము వేసి బాగా కలపాలి. ప్లేటుకు నెయ్యి రాసి దాంట్లో ఈ మిశ్రమాన్ని పెట్టి, పైౖన గులాబీరేకలను వేయాలి. మిశ్రమాన్ని చపాతీ కర్రతో పలచగా చేయాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే చాకుతో గీతలు పెట్టుకోవాలి. అరగంట తర్వాత ముక్కల్లా కోసుకోవాలి.


రాజ్‌గిరాతో..

కావాల్సినవి: రాజ్‌గిరా- అరకప్పు, వేయించిన పల్లీలు- అరకప్పు, బెల్లం- అరకప్పు, కొబ్బరినూనె- టేబుల్‌స్పూన్‌, నెయ్యి- టేబుల్‌స్పూన్‌, యాలకులపొడి, ఉప్పు- కొద్దిగా.
తయారీ: కడాయిలో రాజ్‌గిరాను వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు కడాయిలో కొబ్బరినూనె, బెల్లం వేయాలి. బెల్లం మెల్లగా కరుగుతుంటే ఉప్పు, యాలకులపొడి వేయాలి. దీంట్లో పల్లీలు, రాజ్‌గిరా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటు మీద వేసి గట్టిగా వత్తాలి. కాస్త చల్లారిన తర్వాత ముక్కల్లా కోయాలి.


గుమ్మడి గింజలతో..

కావాల్సినవి: గుమ్మడి గింజలు- కప్పు, బెల్లం- ముప్పావుకప్పు, యాలకుల పొడి- కొద్దిగా, ఉప్పు- చిటికెడు.
తయారీ: సన్నటి మంట మీద గుమ్మడి గింజలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో బెల్లం వేసుకుని పావుకప్పు నీళ్లు పోసి పాకం పెట్టాలి. దీంట్లో యాలకుల పొడి, గుమ్మడివిత్తనాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేటులో ఈ మిశ్రమాన్ని వేయాలి. రెండుమూడు నిమిషాల తర్వాత చాకుతో ఇష్టమైన ఆకృతిలో కోసుకోవాలి. బెల్లానికి బదులుగా తేనె వేసుకుని కూడా చిక్కీ తయారుచేయొచ్చు.


ఓట్సుతో..

కావాల్సినవి: ఓట్సు- కప్పు, బెల్లం తురుము- అరకప్పు, నెయ్యి- పావుకప్పు, యాలకుల పొడి- చిటికెడు.
తయారీ:  కడాయి పెట్టి వేడిచేసి ఓట్సును దోరగా వేయించాలి. వీటిని పళ్లెంలో పోసుకుని చల్లార్చాలి. గిన్నెలో బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించాలి. దీంట్లో కొద్దిగా నెయ్యి, ఓట్సు వేసి పాకం గట్టి పడేంతవరకు కలపాలి. ఇప్పుడు ప్లేటు మీద నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి. కాస్త గట్టిపడిన తర్వాత దీన్ని నచ్చిన ఆకారంలో కోసుకోవాలి.


అవిసె గింజలతో

కావాల్సినవి: అవిసెగింజలు- కప్పు, బెల్లం తురుము- కప్పు, నెయ్యి- పావుకప్పు.
తయారీ: గిన్నెలో కొన్ని నీళ్లు పోసి బెల్లం వేసి గట్టి పాకం పట్టి పక్కన పెట్టుకోవాలి. అవిసెగింజలను తక్కువ మంట మీద దోరగా వేయించాలి. తర్వాత వీటిని పాకంలో వేసి బాగా కలపాలి. ప్లేటుకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి. చాకుతో గీతలు పెట్టుకుంటే చల్లారాక సులువుగా కోసుకోవచ్చు.
* అవిసెగింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు క్యాన్సర్‌, గుండె  వ్యాధుల నుంచి కాపాడతాయి.
* వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
* దీంట్లో అధికంగా ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని