ఆకు కూర కలిస్తే అదుర్సే...

కలగలుపు కూరల రుచి ఎప్పుడూ సూపరే. కావాలంటే మటన్‌లో కాస్త గోంగూర కలపండి. చుక్కకూరతో చికెన్‌ను ఒక చూపు చూడండి. తోటకూరలో కాసిన్ని రొయ్యలు వేసి వండేయండి. ఆ రుచికి మీరు ఫిదా కాకుండా ఉండలేరు.

Updated : 28 Sep 2022 16:07 IST

కలగలుపు కూరల రుచి ఎప్పుడూ సూపరే. కావాలంటే మటన్‌లో కాస్త గోంగూర కలపండి. చుక్కకూరతో చికెన్‌ను ఒక చూపు చూడండి. తోటకూరలో కాసిన్ని రొయ్యలు వేసి వండేయండి. ఆ రుచికి మీరు ఫిదా కాకుండా ఉండలేరు.


మేథీ ముర్గ్‌

కావాల్సినవి: చికెన్‌- అరకేజీ, మెంతికూర- మూడు కట్టలు, పసుపు- అర టీస్పూన్‌, ఉప్పు- సరిపడా, కారం- టేబుల్‌స్పూన్‌, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి- రెండు, ధనియాలపొడి- టీస్పూన్‌, తుంచిన కరివేపాకు- రెండు రెమ్మలు, అల్లంవెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూన్‌, సన్నగా తరిగిన ఉల్లిపాయలు- రెండు, చిన్నగా కోసిన టొమాటో- ఒకటి, జీలకర్ర- అరటీస్పూన్‌, గరంమసాలా పొడి- టీస్పూన్‌, కసూరీ మేథి- టీస్పూన్‌, కొత్తిమీర తరుగు- గుప్పెడు.
తయారీ: మెంతికూర, చికెన్‌ శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్‌ను వెడల్పాటి గిన్నెలో వేసుకుని దీంట్లో పసుపు, కారం, ఉప్పు, ధనియాలపొడి, అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. గిన్నె మీద మూతపెట్టి అరగంటపాటు పక్కన పెట్టాలి. కడాయిలో నూనె వేడిచేసి మెంతికూరను బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. బాగా వేయించడం వల్ల చేదు లేకుండా ఉంటుంది. ఇదే నూనెలో జీలకర్ర వేసి చిటపటలాడాక నానబెట్టిన చికెన్‌ వేయాలి. దీన్ని బాగా కలుపుతూ మధ్యస్థంగా ఉండే మంట మీద ఐదు నిమిషాలపాటు వేయించాలి. తర్వాత చికెన్‌లో నుంచే నీళ్లు వస్తాయి. అవి ఇంకిపోయేంత వరకు ఉడికించి మెంతికూర, గరంమసాలా పొడి వేయాలి. ఇప్పుడు కసూరీమేథి వేసి బాగా కలిపి నీళ్లు పోసి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. చివర్లో కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. ముద్ద కూరలా కావాలనుకుంటే తక్కువ నీళ్లు పోయాలి. గ్రేవీ బాగా ఉండాలంటే ఎక్కువ నీళ్లు కలపాలి.  


తోటకూర పచ్చి రొయ్యలు

కావాల్సినవి: రొయ్యలు- అరకేజీ, తోటకూర తరుగు- కప్పు, తరిగిన ఉల్లిపాయ, టొమాటో- ఒక్కోటి చొప్పున, చీల్చిన పచ్చిమిర్చి- నాలుగు,, పసుపు- అర టీస్పూన్‌, గరంమసాల, ధనియాలు, జీలకర్రపొడి, అల్లంవెల్లుల్లి పేస్టు- టీస్పూన్‌ చొప్పున, కారం, ఉప్పు- రుచికి సరిపడా,  కొత్తిమీర- కొద్దిగా.

తయారీ: పచ్చిరొయ్యలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీంట్లో కొంచెం ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి. తర్వాత కొంచెం నీళ్లు పోయాలి. దీంట్లో పసుపు, ధనియాల పొడి, జీలకర్రపొడి, గరంమసాల వేయాలి. ఇప్పుడు రొయ్యలు వేసి బాగా కలపాలి. చిన్న రొయ్యలను ఎంచుకుంటే రుచిగా ఉంటాయి. రొయ్యలు బాగా ఉడికిన తర్వాత తోటకూర తురుము, ఉప్పు వేసి మూత పెట్టి కాసేపు మగ్గించాలి. ఇలాగే ఎండు రొయ్యలతోనూ వండుకోవచ్చు.


గోంగూర మటన్‌

కావాల్సినవి: మటన్‌- అరకేజీ, గోంగూర- మూడు కట్టలు, సన్నగా కోసిన ఉల్లిపాయలు- మూడు, అల్లంవెల్లుల్లి  పేస్టు- రెండు టీస్పూన్లు, చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు- నాలుగు, పసుపు- పావు టీస్పూన్‌, గరం మసాలా- టీస్పూన్‌, ఉప్పు- రుచికి సరిపడా, కారం- రెండు టీస్పూన్లు, ధనియాల పొడి- టీస్పూన్‌, కొత్తిమీర తరుగు - కొద్దిగా.
తయారీ: మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గోంగూరను ఉడికించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. కుక్కర్‌లో నూనె వేడిచేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు గోధుమరంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. దీంట్లో అల్లంవెల్లులి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు మటన్‌, కారం, ఉప్పు, పసుపు, ధనియాలు, గరంమసాలా పొడి వేసి బాగా కలపాలి. మూతపెట్టి తక్కువ మంట మీద కాసేపు మగ్గించాలి. దీంట్లో నీళ్లు పోసుకుని మూడు, నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత ముందుగా పేస్టు చేసి పెట్టుకున్న గోంగూర వేసి బాగా కలిపి కాసేపు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని