పసందైన పనీర్ జిలేబీ
జిలేబీని చూడగానే నోట్లో నీళ్లూరతాయి. మరి దాన్ని పనీర్తో చేస్తే... ఆహా అనకుండా ఉండలేం. పనీర్ జిలేబీ అనగానే నగరంలోని కాచిగూడ స్టేషన్ రోడ్డులోని బాలాజీ రతన్లాల్ మిఠాయి దుకాణం చాలామందికి గుర్తుకు వస్తుంది. ఇక్కడ చేసే పనీర్ జిలేబీ మరెక్కడా దొరకదంటే అతిశయోక్తి కాదు.
జిలేబీని చూడగానే నోట్లో నీళ్లూరతాయి. మరి దాన్ని పనీర్తో చేస్తే... ఆహా అనకుండా ఉండలేం. పనీర్ జిలేబీ అనగానే నగరంలోని కాచిగూడ స్టేషన్ రోడ్డులోని బాలాజీ రతన్లాల్ మిఠాయి దుకాణం చాలామందికి గుర్తుకు వస్తుంది. ఇక్కడ చేసే పనీర్ జిలేబీ మరెక్కడా దొరకదంటే అతిశయోక్తి కాదు.
సుల్తాన్బజార్ బడీచౌడీకి చెందిన రతన్లాల్ ఒకసారి పూరీ జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడ ప్రసాదంగా తిన్న పనీర్ జిలేబీ రుచి ఆయనకు బాగా నచ్చింది. ఆ తర్వాత 1967లో కాచిగూడలో బాలాజీ రతన్లాల్ మిఠాయి దుకాణాన్ని ప్రారంభించారు. తాను తయారు చేసే మిఠాయిల్లో తనకెంతో నచ్చిన పనీర్ జిలేబీని చేర్చారు. ఈ రుచి ప్రజలకూ బాగా నచ్చింది. ఇతర నేతి మిఠాయిలున్నా కేవలం దీని కోసం ఎక్కడెక్కడి నుంచో జనం రావడం మొదలైంది.
వంశపారంపర్యంగా... ఆవు పాలను విరగొట్టి పనీర్గా మారుస్తారు. దీన్ని చపాతీ పిండిలా కలిపి, జిలేబీల్లా నెయ్యిలో వేసి వేయిస్తారు. ఆ తర్వాత చక్కెర పాకంలో వేస్తారు. ఈ జిలేబీకి నగరవాసుల నుంచి చక్కటి ఆదరణ ఉండటంతో రతన్ లాల్ కొడుకు పూనమ్ చంద్ దీని తయారీని కొనసాగించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు రాజేశ్ పన్వార్ ప్రస్తుతం దీన్ని తయారుచేస్తున్నారు. దీని తయారీకి రెండు గంటలు పడుతుందంటారాయన. నగరంతోపాటు దేశ, విదేశాల్లో జరిగే శుభకార్యాలు, కార్యక్రమాలకు పనీర్ జిలేబీని ప్రత్యేక ఆర్డర్తో తయారు చేయించి తీసుకెళుతుంటారు.
- వినోద్, ఈనాడు, కాచిగూడ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.