పసందైన పనీర్‌ విందు!

కూర, చపాతీ, బిర్యానీ... దేంట్లోనైనా ఇట్టే కలిసిపోతుంది. పరాఠాతో దోస్త్‌  చేస్తుంది. బిర్యానీతో చేరి నోరూరిస్తుంది. దేశీ, విదేశీ వంటకాల్లోనూ మిళితమై వావ్‌ అనిపిస్తుంది.. స్ట్రీట్‌ ఫుడ్‌ నుంచి రెస్టారెంట్‌ వరకు భిన్న రుచుల్లో అందరినీ మెప్పిస్తుంది. మరెందుకాలస్యం ఈ సురుచుల పనీర్‌ వంటకాలు చూసేద్దామా...

Updated : 11 Jul 2021 04:57 IST

కూర, చపాతీ, బిర్యానీ... దేంట్లోనైనా ఇట్టే కలిసిపోతుంది. పరాఠాతో దోస్త్‌  చేస్తుంది. బిర్యానీతో చేరి నోరూరిస్తుంది. దేశీ, విదేశీ వంటకాల్లోనూ మిళితమై వావ్‌ అనిపిస్తుంది.. స్ట్రీట్‌ ఫుడ్‌ నుంచి రెస్టారెంట్‌ వరకు భిన్న రుచుల్లో అందరినీ మెప్పిస్తుంది. మరెందుకాలస్యం ఈ సురుచుల పనీర్‌ వంటకాలు చూసేద్దామా...


బిర్యానీ

కావాల్సినవి: మారినేషన్‌ కోసం... పెరుగు- కప్పు, పసుపు- పావు చెంచా, కారం- రెండు చెంచాలు, ధనియాల పొడి, ఆమ్‌చూర్‌- చెంచా చొప్పున, ఉప్పు- తగినంత, కసూరీ మేథీ- కొద్దిగా, పనీర్‌- 400 గ్రా., 

అన్నం వండటానికి... బాస్మతి బియ్యం- పావుకిలో, లవంగాలు, యాలకులు- రెండు చొప్పున, బిర్యానీ ఆకు- ఒకటి, దాల్చినచెక్క- రెండు ముక్కలు, నక్షత్ర పువ్వు- ఒకటి, పాలు- పెద్ద చెంచా, కుంకుమ పువ్వు రేకలు- కొన్ని.

బిర్యానీకి... నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, బిర్యానీ ఆకు, దాల్చినచెక్క- ఒకటి చొప్పున, యాలకులు- నాలుగు, లవంగాలు- అయిదు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలు- రెండు చొప్పున (సన్నగా తరగాలి), అల్లంవెల్లుల్లి ముద్ద, కారం- చెంచా చొప్పున, పసుపు- పావు చెంచా, ఉప్పు- తగినంత, ధనియాల పొడి- అర చెంచా, పుదీనా, కొత్తిమీర- కొద్దిగా.

తయారీ: బియ్యాన్ని కడిగి, 20 నిమిషాలు నానబెట్టాలి. ఓ చిన్న కప్పులో పాలు పోసి కుంకుమపువ్వు రేకలు వేసి పక్కన పెట్టాలి.

గిన్నెలో పెరుగు, పసుపు, కారం, ధనియాల పొడి, ఆమ్‌చూర్‌ పొడి, ఉప్పు, కసూరీమేథీ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో పనీర్‌ ముక్కలను కలిపి అరగంటపాటు పక్కన పెట్టాలి. పొయ్యి మీద వెడల్పాంటి బాండీ పెట్టి నీళ్లు పోయాలి. మరిగే నీటిలో బాస్మతి బియ్యం, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, నక్షత్ర పువ్వు, పసుపు వేసి కలపాలి. అన్నం మూడొంతులు ఉడికిన తర్వాత నీటిని వడబోసి పక్కన పెట్టేయాలి.

పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. ఇది వేడయ్యాక గరంమసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. దీనికి అల్లంవెల్లుల్లి ముద్దను కలపాలి. టొమాటో ముక్కలనూ వేయాలి. దీంట్లో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి టొమాటోలను ఉడికించాలి. ఆ తర్వాత పుదీనా జత చేయాలి. ఇది కాస్త వేగాక పనీర్‌ మిశ్రమాన్ని వేసి జాగ్రత్తగా ముక్కలు విరిగిపోకుండా కలపాలి. దీన్ని రెండు మూడు నిమిషాలపాటు ఉడికించాలి. గ్రేవీ నుంచి నూనె బయటకు వచ్చే సమయంలో అన్నాన్ని పొరలా వేసుకోవాలి. దీనిపై కుంకుమపువ్వు పాలను పోయాలి. పుదీనా ఆకులను వేసి అల్యూమినిమయం ఫాయిల్‌తో పూర్తిగా కప్పేసి (ఆవిరి బయటకు వెళ్లకుండా) మూతపెట్టి పది నిమిషాలపాటు చిన్న మంటపై ఉడికించాలి. అంతే టేస్టీ పనీర్‌ బిర్యానీ రెడీ.


పనీర్‌ 65

కావాల్సినవి:  పనీర్‌- 200 గ్రా, నూనె- తగినంత, ఉప్పు- సరిపడా, కారం- చెంచాన్నర, పసుపు- పావుచెంచా,  మిరియాలపొడి, చాట్‌ మసాలా- అరచెంచా చొప్పున, పచ్చిమిర్చి ముక్కలు- కొన్ని, అల్లంవెల్లుల్లి ముద్ద, నిమ్మరసం- చెంచా చొప్పున, మైదా, కార్న్‌ఫ్లోర్‌- రెండు చెంచాల చొప్పున, సెనగపిండి-అయిదు చెంచాలు, ఫుడ్‌ కలర్‌- చిటికెడు.

తయారీ: గిన్నెలో పనీర్‌ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి, చాట్‌మసాలా, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలిపి 20 నిమిషాలు  పక్కన పెట్టాలి. ఇప్పుడు పనీర్‌ ముక్కల్లో మైదా, కార్న్‌ఫ్లోర్‌, సెనగపిండి వేసి పట్టించాలి. చిటికెడు ఫుడ్‌ కలర్‌నూ వేసుకోవచ్చు. కొన్ని నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలా కలపాలి. బాండీలో నూనె పోసి, కాగాక పనీర్‌ ముక్కలను వేయించాలి. మరోపాన్‌లో నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపును పనీర్‌ ముక్కలతో కలిపి.. చివరగా నిమ్మరసం చల్లాలి.  


పరాఠా...

కావాల్సినవి: గోధుమపిండి- కప్పున్నర, పనీర్‌ తురుము- 200 గ్రా, ఉప్పు, నూనె- తగినంత, కారం- చెంచా, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరగాలి), ఛీజ్‌- పావు కప్పు, చాట్‌మసాలా, గరంమసాలా- పావు చెంచా చొప్పున, ఇంగువ- చిటికెడు, కొత్తిమీర తరుగు- చెంచా.
తయారీ: గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, నూనె వేసి కలపాలి. నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలిపి ఓ వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి.

మరో గిన్నెలో పనీర్‌ తురుము, ఛీజ్‌, ఉల్లిపాయ ముక్కలు,  పచ్చిమిర్చి తరుగు, చాట్‌మసాలా, గరం మసాలా, ఇంగువ, ఉప్పు, కారం, కొత్తిమీర తరుగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకుని   మందమైన పూరీలా చేసి చిన్న గిన్నెలా చేసి పనీర్‌ మిశ్రమాన్ని మధ్యలో పెట్టి అన్ని వైపులా మూసేయాలి. దాన్ని నెమ్మదిగా చపాతీలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పరాఠాలను పెనంపై వేసి రెండువైపులా నెయ్యి/నూనె వేస్తూ బాగా కాల్చాలి. అంతే రుచికరమైన పనీర్‌ పరాఠా రెడీ. వీటిని టొమాటో కెచప్‌, పెరుగు రైతాతో తింటే బాగుంటాయి.


ఫ్రాంకీ...

కావాల్సినవి:  పనీర్‌ ముక్కలు- 200 గ్రా., కారం, చాట్‌ మసాలా- రెండు చెంచాల చొప్పున, ధనియాల పొడి, జీలకర్ర పొడి- చెంచా చొప్పున, నల్లుప్పు- తగినంత, ఉల్లిపాయ, టొమాటో- ఒకటి చొప్పున (సన్నగా తరగాలి), పసుపు- పావు చెంచా, కొత్తిమీర- కొద్దిగా, నూనె- సరిపడా.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె వేసి అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. టొమాటో ముక్కలనూ జత చేయాలి. దీంట్లోనే పసుపు, నల్లుప్పు, కారం, ధనియాల పొడి, చాట్‌మసాలా కలపాలి. కాసిన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఆ తర్వాత పనీర్‌ ముక్కలను వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. అవసరమైతే కాసిన్ని నీళ్లు పోసి ఉడికిస్తే సరి. ఈ  మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీని తీసుకుని ఒకవైపు మయోనీజ్‌/టొమాటో కెచప్‌ రాయాలి. దీనిపై మధ్యలో పనీర్‌ మిశ్రమాన్ని నిలువుగా వేయాలి. కొద్దిగా నిమ్మరసం, ఉల్లిపాయలు వేసుకుని రోల్‌ చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని