చిరుధాన్యాలతో... ఆరోగ్య సిరులు!

పేరుకే చిరుధాన్యాలు... అందించే ప్రయోజనాలు బోలెడు... ఆటలాడే బొంగరం లాంటి చిన్నారులకు.. పనులతో అలసిపోయిన అతివలకు.. వయసు పైబడుతున్న పెద్దవారికి.... ఇలా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ శక్తితోపాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాంటి  సిరిధాన్యాల్లో  సామలు, సజ్జలు, ఊదలు, కొర్రలతో నోరూరించే రుచులను ఆస్వాదించండి మరి.

Updated : 12 Sep 2021 05:36 IST

పేరుకే చిరుధాన్యాలు... అందించే ప్రయోజనాలు బోలెడు... ఆటలాడే బొంగరం లాంటి చిన్నారులకు.. పనులతో అలసిపోయిన అతివలకు.. వయసు పైబడుతున్న పెద్దవారికి.... ఇలా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ శక్తితోపాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాంటి  సిరిధాన్యాల్లో  సామలు, సజ్జలు, ఊదలు, కొర్రలతో నోరూరించే రుచులను ఆస్వాదించండి మరి.

సజ్జలతో లడ్డూ...

కావాల్సినవి: సజ్జలు, బెల్లం- కప్పు చొప్పున, పాలు- అర కప్పు, ఖర్జూరం- ఐదారు, జీడిపప్పు, కిస్‌మిస్‌- రెండు చెంచాల చొప్పున, యాలకుల పొడి, శొంఠిపొడి- అరచెంచా చొప్పున,  ఉప్పు- చిటికెడు, నెయ్యి- తగినంత.

తయారీ: సజ్జలను నాలుగైదు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత దళసరి వస్త్రంపై పొడిబారే వరకు ఆరబెట్టాలి. స్టవ్‌ వెలిగించి పాన్‌ పెట్టి సజ్జలను వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో పాలు పోసి మరిగించి వాటిలో విత్తనాలు తీసిన ఖర్జూరాలను వేసి నానబెట్టాలి. పాన్‌లో మరికొంత నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. సజ్జల్ని మిక్సీజార్‌లో వేసి పొడి చేసి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సీలో ఖర్జూరాలు, ఉప్పు, యాలకుల పొడి, శొంఠిపొడి, బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని సజ్జపొడిలో వేసి కలపాలి. ఇందులోనే డ్రైఫ్రూట్స్‌ను కూడా వేసి కలపాలి. దీన్ని లడ్డూల్లా చేసుకుంటే రుచికరమైన సజ్జ లడ్డూలు రెడీ..


కొర్రలతో పొంగలి...

కావాల్సినవి: కొర్రలు, పెసరపప్పు- కప్పు చొప్పున, నెయ్యి- అర కప్పు, జీడిపప్పు- రెండు చెంచాలు, పచ్చిమిర్చి- అయిదారు, ఉప్పు- తగినంత, అల్లం తరుగు- చెంచా, జీలకర్ర, మిరియాల పొడి- పావు చెంచా చొప్పున, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- రెండు రెబ్బలు.

తయారీ: కొర్రలను ఆరేడు గంటలు నానబెట్టుకోవాలి. పొయ్యిపై పాన్‌ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక పెసరపప్పు వేసి వేయించిన తర్వాత మరో గిన్నెలోకి తీసుకోవాలి. అదే పాత్రలోనే నానబెట్టిన కొర్రలను పోసి నీరంతా పోయే వరకు వేయించాలి. వీటిని రోట్లో వేసి దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెసరపప్పులో వేసి నీళ్లు పోసి అరగంటపాటు ఉడికించాలి. ఇప్పుడు మరోపాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం తరుగు, మిరియాల పొడి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపును ఉడికించిన కొర్రల్లో కలపాలి.


సామలతో.. పులిహోర...

కావాల్సినవి: సామలు- 100 గ్రా., ఆవాలు- పావుచెంచా, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు- పెద్ద చెంచా చొప్పున, ఎండుమిర్చి- నాలుగైదు, పచ్చిమిర్చి- ఆరు (తరగాలి), కరివేపాకు- రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, అల్లం తరుగు- చెంచా, ఆవపిండి- చెంచా, ఇంగువ, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, చింతపండు గుజ్జు- చిన్న కప్పు, నూనె- తగినంత.

తయారీ: సామలను ఐదారు గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కప్పు సామలకు రెండు కప్పుల వంతున నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పచ్చిసెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఆవాలు వేసి వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం తరుగు, పసుపు వేసి మరికాసేపు వేయించాలి. చింతపండు గుజ్జును వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, ఆవపిండి, ఇంగువ వేసుకోవాలి. వేయించిన ఈ తాలింపును ఉడికించిన సామల్లో వేసి కలిపితే వేడి వేడి సామల పులిహోర రెడీ.


మల్టీ మిల్లెట్స్‌తో... ఉప్మా..

కావాల్సినవి: మల్టీ మిల్లెట్‌ రవ్వ- కప్పు (నానబెట్టాలి), తరిగిన ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- అయిదారు, జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, అల్లం- చెంచా చొప్పున,  గరంమసాలా- పావు చెంచా, కొత్తిమీర- కొద్దిగా, నెయ్యి, ఉప్పు- తగినంత, దాల్చినచెక్క పొడి- అర చెంచా, మిరియాల పొడి- పావు చెంచా.

తయారీ: పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన వెల్లుల్లి, అల్లం, జీలకర్ర వేసి బాగా వేయించాలి. వీటిలోనే రవ్వను వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత కప్పు రవ్వకు రెండు కప్పుల నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, గరంమసాలా వేసి మరోసారి కలపాలి. అంతే రుచికరమైన మల్టీ మిల్లెట్స్‌ ఉప్మా రెడీ.


ఊదలతో...  కిచిడి..

కావాల్సినవి: ఊదలు- కప్పు, ఆలూ, క్యారెట్‌ ముక్కలు- అర కప్పు చొప్పున, టొమాటో ముక్కలు- నాలుగైదు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, జీలకర్ర, అల్లం తరుగు- పావుచెంచా చొప్పున, కరివేపాకు- రెమ్మ, పచ్చిమిర్చి తరుగు- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత.

తయారీ: ఊదలను నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక జీలకర్ర, అల్లం తరుగు, కరివేపాకు, పచ్చిమిరపకాయల తరుగు, బంగాళా దుంపలు, క్యారెట్‌ ముక్కలు వేసి వేయించాలి. దీనికి ఉప్పును జత చేయాలి. టొమాటో ముక్కలనూ వేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టిన ఊదల్ని వేసి, సరిపడా నీళ్లు పోసి కుక్కర్‌ మూత పెట్టి అయిదారు విజిల్స్‌ వచ్చిన తర్వాత పొయ్యి కట్టేయాలి. అంతే రుచికరమైన కిచిడీ చిటికెలో సిద్ధమైనట్లే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని