కాస్త కారప్పొడి వేసుకోండి!

జ్వరం వచ్చినా నోరు అరుచిగా ఉన్నా అన్నంలో కాస్త కారప్పొడీ, నెయ్యీ కలుపుకుని తింటే ఆ రుచే వేరు. పిల్లలు కూడా కిమ్మనకుండా తింటారు. అందుకే కొన్ని కారప్పొడుల రుచులు..!

Published : 26 Jun 2021 16:30 IST

జ్వరం వచ్చినా నోరు అరుచిగా ఉన్నా అన్నంలో కాస్త కారప్పొడీ, నెయ్యీ కలుపుకుని తింటే ఆ రుచే వేరు. పిల్లలు కూడా కిమ్మనకుండా తింటారు. అందుకే కొన్ని కారప్పొడుల రుచులు..!


కొబ్బరి కారం

కావలసినవి
ఎండుకొబ్బరి చిప్పలు: రెండు, ఎండుమిర్చి: పావుకిలో, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, సెనగపప్పు: 3 టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు: టీస్పూను, నూనె: అరటీస్పూను, జీలకర్ర: 3 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, కరివేపాకు: పది రెబ్బలు

తయారుచేసే విధానం
* బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, సెనగపప్పు వేసి వేయించి తీయాలి. తరవాత ఎండు కొబ్బరిముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి వేయించి చల్లారనివ్వాలి.
* ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి.


పల్లీల పొడి

కావలసినవి
పల్లీలు: కప్పు, ఎండుమిర్చి: 12, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, జీలకర్ర: 2 టీస్పూన్లు, ఎండుకొబ్బరి పొడి: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: టీస్పూను

తయారుచేసే విధానం
* పల్లీలు వేయించి, చల్లారాక పొట్టు తీసి పక్కన ఉంచాలి. అదే పాన్‌లో నూనె వేసి ఎండుమిర్చి ఓ నిమిషం వేగాక జీలకర్ర వేసి ఓ నిమిషం వేయించి దించాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. తరవాత వెల్లుల్లి, వేయించిన పల్లీలు కూడా వేసి కచ్చాపచ్చాగా పొడి చేసి తీయాలి.


నల్ల కారం

 

కావలసినవి
దనియాలు: కప్పు, మినప్పప్పు: 3 టేబుల్‌స్పూన్లు, సెనగపప్పు: 3 టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: 20, కరివేపాకు: 2 రెబ్బలు, చింతపండు: నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, నూనె: 2 టీస్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేసే విధానం
* బాణలిలో నూనె వేసి కాగాక దనియాలు వేసి వేయించి తీసి చల్లారనివ్వాలి.
* బాణలిలో సెనగపప్పు,మినప్పప్పు వేసి వేగనివ్వాలి. తరవాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి తీయాలి. తరవాత చింతపండు, వెల్లుల్లి కూడా వేసి ఓ నిమిషం వేయించి తీయాలి. చల్లారిన తరవాత ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీలో వేసి పొడి చేసి తీయాలి.


పుదీనా కారం పొడి

కావలసినవి
పుదీనా: రెండు కట్టలు (పెద్దవి), నూనె: టీస్పూను, మినప్పప్పు: 3 టేబుల్‌స్పూన్లు, సెనగపప్పు: పావుకప్పు, ఎండుమిర్చి: నాలుగు, ఇంగువ: చిటికెడు, చింతపండు: కొద్దిగా, మిరియాలు: అరటీస్పూను, జీలకర్ర: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేసే విధానం
* బాణలిలో నూనె వేసి కాగాక మినప్పప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, చింతపండు వేసి వేయించాలి. తరవాత జీలకర్ర కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తరవాత అన్నీ కలిపి మిక్సీలో వేసి పొడి చేయాలి.


వెల్లుల్లి కారం

కావలసినవి
ఎండుమిర్చి: 15, వెల్లుల్లి: ఆరు రెబ్బలు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు: టేబుల్‌స్పూను, చింతపండు: చిన్న నిమ్మకాయంత, ఉప్పు: సరిపడా

తయారుచేసే విధానం
* బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, మినప్పప్పు వేసి వేయించాలి. తరవాత జీలకర్ర కూడా వేసి వేగనివ్వాలి. విడిగా మరో పాన్‌లో వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. అన్నీ చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి.


పప్పుల పొడి

కావలసినవి
ఎండుమిర్చి: 30, కొబ్బరి తురుము:4 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, చింతపండు: టేబుల్‌స్పూను, సెనగపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, పెసరపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు: 2 టేబుల్‌స్పూన్లు, పంచదార: టీస్పూను, నెయ్యి: 2 టీస్పూన్లు, కరివేపాకు: కొద్దిగా

తయారుచేసే విధానం
* బాణలిలో ఎండుమిర్చి, కొబ్బరి వేసి ఐదు నిమిషాలు వేయించి పక్కన ఉంచాలి.
* తరవాత సెనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు వేసి వేయించి చల్లార నివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా పొడి చేయాలి.
* బాణలిలో నెయ్యి వేసి కాగాక కరివేపాకు వేసి వేయించి పొడిలో కలిపి నిల్వ చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని