సగ్గుబియ్యంతో లడ్డు, దోశ!

ఇంట్లో సగ్గుబియ్యం ఉన్నాయంటే కిచిడీ లేదా వడలు చేస్తాం... అదే పండగల్లో అయితే పాయసం వండుతాం. కానీ సగ్గుబియ్యంతో ఈ రెండే కాదు మరికొన్ని వంటకాలూ చేసుకోవచ్చు. అలాంటివే ఇవన్నీ...

Published : 26 Jun 2021 09:29 IST

ఇంట్లో సగ్గుబియ్యం ఉన్నాయంటే కిచిడీ లేదా వడలు చేస్తాం... అదే పండగల్లో అయితే పాయసం వండుతాం. కానీ సగ్గుబియ్యంతో ఈ రెండే కాదు మరికొన్ని వంటకాలూ చేసుకోవచ్చు. అలాంటివే ఇవన్నీ...

మురుకులు

కావలసినవి: బియ్యప్పిండి: కప్పు, సగ్గుబియ్యం: పావుకప్పు, పెరుగు: పావుకప్పు, మినప్పప్పు: రెండు టేబుల్‌స్పూన్లు, నువ్వులు: చెంచా, కారం: అరచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా, ఉప్పు: తగినంత.
తయారీ విధానం: పెరుగులో సగ్గుబియ్యం వేసి కనీసం మూడు గంటలసేపు నానబెట్టుకోవాలి. తరువాత అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. అవసరం అయితే... నీళ్లు చల్లుకుంటూ మురుకుల పిండిలా చేసుకోవాలి. చివరగా రెండు చెంచాల వేడినూనె కూడా వేసి ఓసారి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మురుకుల గొట్టంలో తీసుకుని, కాగుతున్న నూనెలో జంతికల్లా వత్తుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


చీలా

కావలసినవి సగ్గుబియ్యం: అరకప్పు, ఉడికించిన బంగాళాదుంపలు: రెండు, జీలకర్ర: చెంచా, అల్లం తురుము: చెంచా, పచ్చిమిర్చి: నాలుగు, వేయించిన పల్లీలు: పావుకప్పు (కచ్చాపచ్చాగా పొడిచేసుకోవాలి), కొత్తిమీర తరుగు: పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు.
తయారీ విధానం: ముందురోజు సగ్గుబియ్యాన్ని కడిగి పావుకప్పు నీళ్లల్లో నానబెట్టుకోవాలి. మర్నాడు అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. అవసరం అనుకుంటే రెండు చెంచాల నీళ్లు చల్లి గట్టి పిండిలా చేసుకుని, రెండు చెంచాల నూనె వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు స్టౌమీద పెనం పెట్టి ఈ పిండిని కొద్దిగా ఉంచి రోటీలా చేత్తోనే వత్తుకుని అక్కడక్కడా చిల్లులు పెట్టి చుట్టూ నూనె వేయాలి. దీన్ని రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.  దీనికి పెరుగుచట్నీ మంచి కాంబినేషన్‌.


మిక్స్షర్‌

కావలసినవి: సగ్గుబియ్యం: అరకప్పు, పల్లీలు: పావుకప్పు, కిస్‌మిస్‌: పావుకప్పు, జీడిపప్పు: పావుకప్పు, కారం: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీవిధానం: స్టౌమీద బాణలి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. అది వేడయ్యాక సగ్గుబియ్యాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ అవి పొంగేవరకూ వేయించుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. అదేవిధంగా పల్లీలు, జీడిపప్పు, కిస్‌మిస్‌లను ఒక్కొక్కటిగా వేయించుకుని తీసుకోవాలి. వీటన్నింటినీ ఓ గిన్నెలో తీసుకుని ఉప్పు, కారం కూడా వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి.


దోశ

కావలసినవి: సగ్గుబియ్యం: అరకప్పు, బియ్యం: అరకప్పు, మినప్పప్పు: పావుకప్పు, మెంతులు: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: పావుకప్పు.
తయారీ విధానం: సగ్గుబియ్యం, మినప్పప్పు, మెంతుల్ని ఓ గిన్నెలో వేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అదే విధంగా బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. అయిదారు గంటల తరువాతసగ్గుబియ్యంలోని నీటిని పూర్తిగా వంపేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత బియ్యాన్ని కూడా మెత్తగా రుబ్బుకుని సగ్గుబియ్యప్పిండిలో వేయాలి. ఇందులో తగినంత ఉప్పు వేసి అన్నింటినీ కలిపి మూత పెట్టాలి. మర్నాటికి ఈ పిండి పులుస్తుంది. అప్పుడు స్టౌమీద పెనం పెట్టి గరిటెతో ఈ పిండిని దోశలా పరిచి, నూనె వేసి కాల్చుకుని తీసుకోవాలి.


లడ్డు

కావలసినవి: సగ్గుబియ్యం: కప్పు, పల్లీలు: కప్పు, నెయ్యి: మూడు టేబుల్‌స్పూన్లు, కొబ్బరి తురుము: పావుకప్పు, యాలకులపొడి: పావుచెంచా, చక్కెరపొడి: ముప్పావుకప్పు, పాలు: పావుకప్పు.
తయారీవిధానం: స్టౌమీద కడాయి పెట్టి సగ్గుబియ్యం వేసి రెండునిమిషాలు వేయించుకుని తీసుకోవాలి. అవి వేడి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. అదేవిధంగా పల్లీలను కూడా వేయించుకుని తరువాత పొట్టుతీసి పొడిచేసుకుని పెట్టుకోవాలి. అదే బాణలిలో నెయ్యి వేసి సగ్గుబియ్యం పొడిని దోరగా వేయించి, కొబ్బరి తురుము వేయాలి. దాన్ని కూడా ఓ నిమిషంపాటు వేయించి స్టౌకట్టేయాలి. అందులో పాలు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. చివరగా పాలు చల్లుకుంటూ లడ్డూల్లా చుట్టుకుంటే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు