బ్రహ్మోత్సవం.. శ్రీశైల మహోత్సవం!

నిరంతరం వినిపించే ‘ఓం నమశ్శివాయ’ మంత్రం... రోజుకొకటి చొప్పున పార్వతీపరమేశ్వరులకు జరిపే సేవలూ... ఆది దంపతులకు అంగరంగ వైభవంగా నిర్వహించే కల్యాణం... పాహిమాం పరమేశ్వరా అంటూ ప్రార్థించే భక్తులూ... ఈ వేడుకలన్నీ శ్రీశైలంలో మహాశివరాత్రి సమయంలో పదకొండు రోజులపాటు నిర్వహించే బ్రహోత్సవాల్లో కనిపించే విశేషాలు...దట్టమైన నల్లమల అడవుల్లో, కృష్ణానది ఒడ్డున... జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట వెలసిన భూలోక

Published : 27 Feb 2022 01:09 IST

బ్రహ్మోత్సవం.. శ్రీశైల మహోత్సవం!

నిరంతరం వినిపించే ‘ఓం నమశ్శివాయ’ మంత్రం... రోజుకొకటి చొప్పున పార్వతీపరమేశ్వరులకు జరిపే సేవలూ... ఆది దంపతులకు అంగరంగ వైభవంగా నిర్వహించే కల్యాణం... పాహిమాం పరమేశ్వరా అంటూ ప్రార్థించే భక్తులూ... ఈ వేడుకలన్నీ శ్రీశైలంలో మహాశివరాత్రి సమయంలో పదకొండు రోజులపాటు నిర్వహించే బ్రహోత్సవాల్లో కనిపించే విశేషాలు...

ట్టమైన నల్లమల అడవుల్లో, కృష్ణానది ఒడ్డున... జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట వెలసిన భూలోకకైలాసమే శ్రీశైలం. ఇక్కడ పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున లింగంగా కొలువైతే, పార్వతీదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబికా దేవిగా దర్శనమిస్తోంది. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ జరిపే బ్రహ్మోత్సవాలనూ, శివ పార్వతుల కల్యాణాన్నీ చూసేందుకు సుమారు పదిలక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకూ జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఎందరో శివభక్తులు పాదయాత్ర చేసి మరీ శ్రీగిరిని చేరుకునేందుకు ఆసక్తి చూపించడం విశేషం.

శివ-శక్తి ఒకేచోట

కృతయుగంలో శిలాద అనే మహర్షి సంతానంకోసం శివుడిని పూజించాడట. పరమేశ్వరుడు అనుగ్రహించి... ఆ మహర్షికి ఇద్దరు కుమారులు కలగడంతో వారికి నందికేశ్వరుడు, పర్వతుడు అని పేర్లు పెట్టాడట. కొంతకాలానికి నందికేశుడు శివుని పూజించి స్వామికి వాహనంగా మారితే, పర్వతుడు కూడా తపస్సు చేసి.. తనపైన కొలువుదీరమంటూ స్వామిని వేడుకున్నాడట. ఆ పర్వతం పైనే శివుడు స్వయంభువుగా వెలిశాడనీ, అదే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటనీ అంటారు. ఇక, దక్షయజ్ఞం సమయంలో... తండ్రి వల్ల అవమానానికి గురైన సతీదేవి అగ్నిలో దూకి ఆత్మాహుతికి యత్నించగా శివుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని విలయతాండవం చేశాడు. ఆ ప్రళయాన్ని ఆపడం కోసం మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ భాగాలు పలుచోట్ల పడి ఆ ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలిశాయి. వాటిల్లో మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలమనీ... అందుకే ఈ ప్రాంతాన్ని శివశక్తి క్షేత్రమనీ అంటారు.

ఇక్కడి ఆదిపరాశక్తికి భ్రమరాంబిక అనే పేరు రావడం వెనుకా ఒక కథ ఉంది. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ మంత్రాన్ని జపించి మరణం లేకుండా వరం పొందాడట. అది తెలిసి దేవతలు జగన్మాతను ప్రార్థించడంతో... గాయత్రీమంత్రం జపిస్తున్నంతవరకూ అతడిని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పిందట. దేవతలు ఓ పథకం ప్రకారం తమ గురువైన బృహస్పతిని అరుణాసురుడి దగ్గరకు పంపించారు. అలా వెళ్లిన బృహస్పతి తాను కూడా గాయత్రీమాత భక్తుడినని అరుణాసురుడితో చెప్పడంతో... దేవతలు పూజించే అమ్మవారిని తాను పూజించనంటూ ఆ రాక్షసుడు మంత్ర జపాన్ని ఆపేశాడు. అప్పుడు ఆదిపరాశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టించిందట. అవన్నీ అరుణాసురుడినీ, అతడి సైన్యాన్నీ సంహరించడంతో అమ్మవారికి భ్రమరాంబిక అనే పేరు వచ్చిందనీ చెబుతారు. 

రెండుసార్లు బ్రహ్మోత్సవాలు..

భూలోక కైలాసంగా గుర్తింపు పొందిన శ్రీక్షేత్రంలో ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తే... మొదటి ఉత్సవాలను సంక్రాంతి సమయంలో... రెండోసారి మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి సమయంలో నిర్వహిస్తారు. మొదటి రోజు సాయంత్రం ధ్వజారోహణ, భేరీ పూజ చేసి దేవతలను ఆహ్వానించి ఉత్సవాలను ప్రారంభించి, ఆ మర్నాటి నుంచీ ఆదిదంపతులకు రోజుకో వాహనసేవను నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో వేద పండితులూ, అర్చకులూ కలిసి మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకం, ఆ తరువాత శివపార్వతుల కల్యాణం... చివరగా ప్రభోత్సవం, తెప్పోత్సవం నిర్వహించి ఈ ఉత్సవాలను ముగిస్తారు. 

పట్టువస్త్రాల సమర్పణ... పాగాలంకరణ

ఈ ఉత్సవాల్లో... పార్వతీ పరమేశ్వరులకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటూ తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి సన్నిధానం, కాణిపాకం దేవస్థానం నుంచీ పట్టువస్త్రాలు వస్తాయి. అలాగే శివపార్వతుల కల్యాణానికి ముందు అర్థరాత్రి 12 గంటల తరవాత పాగాలంకరణ పేరుతో 365 మూరల పొడవున్న పాగాను స్వామివారి గర్భాలయ విమానశిఖరం నుంచి ముఖమండపంపైన ఉండే నందులను కలుపుతూ అలంకరిస్తారు. కొన్ని సంవత్సరాల నుంచీ.. చీరాల పరిధిలోని హస్తినాపురానికి చెందిన పృథ్వి వెంకటేశ్వర్లు కుటుంబమే ఈ పాగాలంకరణను చేస్తోంది. వెంకటేశ్వరుల కుటుంబం భక్తిశ్రద్ధలతో రోజుకో మూర చొప్పున ఏడాది మొత్తం దీన్ని నేసి బ్రహ్మోత్సవాల సమయానికి ఆలయానికి తెస్తారు. ఇక, ఈ వేడుకలను చూసి తరించేందుకు ఎందరో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు.

- యడ్లపాటి బసవ సురేంద్ర, ఈనాడు డిజిటల్‌, కర్నూలు 


ప్రకృతి ఓడిలో... పాదయాత్ర!

పార్వతి... ప్రకృతి స్వరూపిణి. శ్రీశైలం చుట్టూ ఉన్న అడవి ఆ తల్లి అవతారమనే అంటారు భక్తులు. ఆ అడవిలో కాలినడకన ప్రయాణించడమంటే పార్వతమ్మ వెచ్చటి పొత్తిళ్లలో తలదాచుకోవడమే... ఆ పాద యాత్ర తర్వాత మల్లికార్జునుని కొలవడమంటే అమ్మ ఒడి నుంచి వచ్చి అయ్య దీవెనలు నిండారా అందుకోవడమేనని భావిస్తారు భక్తులు. అందుకే శివరాత్రికి కాస్త ముందు ఈ పాదయాత్రకి అటవీశాఖ అనుమతించగానే వేలాదిమంది తరలివస్తుంటారు.

అటవీశాఖ ప్రస్తుతం అనుమతిస్తున్న వెంకటాపురం- నాగలూటి- భీముని కొలను పాదయాత్ర మార్గం... శ్రీశైలాన్ని చేరుకునే ప్రాచీన దారుల్లో ఒకటి.  రాయలసీమ నలుమూలల నుంచీ వచ్చేవాళ్లు కర్నూలు జిల్లా వెంకటాపురానికి వాహనాల్లో చేరుకుంటారు. అక్కడి నుంచే పాదయాత్ర మొదలవుతుంది. అలా... ఓ మూడు కిలోమీటర్లు పంటపొలాల దారిలో నడిచి ముర్తుజావలి దర్గావద్దకు చేరుకుంటారు భక్తులు. హిందూ ముస్లిముల ఐక్యతకి సంకేతంలా భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకోవాలన్నది ఐతిహ్యం. ఇక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే... దట్టమైన అరణ్యంలోకి అడుగుపెడుతున్నామనడానికి సంకేతంగా కీచురాళ్ల రొద మొదలవుతుంది.

వెదురుచెట్ల గొడుగులు...

కాలిబాటన వెళ్తున్నవారికి గొడుగుపడుతున్నట్టు దారికి ఇరువైపులా ఎత్తైన వెదురుచెట్లు పలకరిస్తాయి. ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఎనిమిదికిలోమీటర్లు నడిస్తే నాగలూటి వీరభద్రస్వామి ఆలయం వస్తుంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఆలయం ఇది! ఇక్కడిదాకా వచ్చిన భక్తులకు శ్రీశైలం ఆలయ సిబ్బంది రూ.200 శీఘ్రదర్శన టికెట్టు అందిస్తారు. ఈ యాత్రలో తొలి కొండ మెట్లమార్గం ఇక్కడే మొదలవుతుంది. సుమారు వెయ్యి మెట్లుంటాయి ఇక్కడ. ఆయాసంతో ఉక్కిరిబిక్కిరైతేనేం... ఎప్పటికప్పుడు చల్లగాలి సేదతీరుస్తూ ఉంటుందీ మెట్ల మార్గం. ఇక్కడి నుంచి ఓ పదికిలోమీటర్లు నడిస్తే... కొండకింద ‘పెద్దచెరువు’ అన్న గిరిజన గ్రామం వస్తుంది. కర్నూలులో మనం ఎనిమిదిగంటలకి బయల్దేరితే... ఇక్కడికి సాయంత్రం ఆరుగంటలకి చేరుకుంటాం. ఆ తర్వాత అడవిమార్గంలో ప్రయాణించడం ప్రమాదకరం కాబట్టి ఇక్కడే మజిలీ చేస్తారు భక్తులు. వాళ్ల కోసం శ్రీశైలం ఆలయ ట్రస్టు ఉచిత భోజనం సహా అన్ని వసతులూ కల్పిస్తుంది. ఇక్కడ చీకటి ముదిరేకొద్దీ అడవిలో కీచురాళ్ల రొదకి జంతువుల అరుపులూ తోడై గమ్మత్తైన అనుభూతినిస్తాయి. వేకువనే ఇక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే మెట్లమార్గం ప్రారంభమవుతుంది. ఇవి దాదాపు ఎనిమిదివందల ఏళ్లకిందట కట్టించినవని చెబుతారు. అలా నడుస్తూ అడవి పక్షుల కిలకిలల మధ్య... చీకటి తెరలని తొలగించుకుంటూ వచ్చే ఉదయభానుణ్ణి చూడటం ఓ అద్భుతమైన అనుభవంగా మిగిలిపోతుంది. అక్కడి నుంచి భీముని కొలను మూడుకిలోమీటర్లే కానీ... అది ఓ పెద్ద లోయ అడుగున ఉంటుంది. చుట్టూ నిండిన పచ్చదనానికి లేత ఎండ అద్దే బంగారు మెరుగులూ, మన చుట్టూ చేరి తారట్లాడే మేఘాల పలకరింపులూ... రెండ్రోజుల శ్రమనంతా ఇట్టే మరచిపోలా చేస్తాయి ఇక్కడ. భీముని కొలనులో భీముడి విగ్రహమూ... ఓ కొలనూ ఉంటాయి. మరో రెండుకిలోమీటర్లు మెట్లమార్గంలో పైకెక్కాక... శ్రీశైలం కైలాసద్వారం కనిపిస్తుంది. అక్కడి నుంచి అరగంటలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయాన్ని చేరుకోవచ్చు!

- కాకనూరు వెంకట రామకృష్ణారెడ్డి, ఈటీవీ, కర్నూలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు