వెండితెర వయా బుల్లితెర

సినిమాల్లో ఛాన్స్‌ కొట్టేసి... తారలుగా నిలదొక్కుకోవడం నటీనటులకు అంత తేలికకాదు. అందుకే ఈ తారలు మొదట టీవీరంగంలో అడుగుపెట్టి తరవాత సినీ ఇండస్ట్రీవైపు పయనమయ్యారు.

Published : 26 Nov 2022 23:40 IST

వెండితెర వయా బుల్లితెర

సినిమాల్లో ఛాన్స్‌ కొట్టేసి... తారలుగా నిలదొక్కుకోవడం నటీనటులకు అంత తేలికకాదు. అందుకే ఈ తారలు మొదట టీవీరంగంలో అడుగుపెట్టి తరవాత సినీ ఇండస్ట్రీవైపు పయనమయ్యారు. అలా వెండితెర వయా బుల్లితెరగా తమ ప్రయాణాన్ని ప్రారంభించిన కొందరు తారల విశేషాలివిగో...

ఈటీవీ కలిపింది ఇద్దర్నీ

పాన్‌ ఇండియా సినిమా ‘కేజీఎఫ్‌’ హీరో యశ్‌ నటన మీద ఇష్టంతో టీనేజీలోనే ఇంటి నుంచి పారిపోయాడు. థియేటర్‌ ఆర్టిస్టుగా పని చేస్తూనే టెలివిజన్‌ రంగంలో పరిచయాలు పెంచుకుని సీరియళ్లలో అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. మూడేళ్లలో ఆరు సీరియళ్లలో నటించిన యశ్‌కి ఈటీవీ కన్నడలో వచ్చిన ‘నంద గోకుల’ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సీరియల్‌లో నటించినప్పుడే సహనటి రాధికా పండిట్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి సీరియళ్లతోపాటూ కొన్ని సినిమాల్లోనూ నటించారు.


ఎన్ని విషయాలు చెప్పేదో  

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార కూడా టీవీ నుంచే సినిమాల్లోకి వచ్చింది. 2003లో హీరోయిన్‌గా పరిచయమవడానికి ముందు ఓ మలయాళం ఛానల్‌లో ప్రజెంటర్‌గా- ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌, సౌందర్యోత్పత్తులు, నగలు, గ్యాడ్జెట్లు, సెలబ్రిటీల విషయాలెన్నో పంచుకునేది. దాదాపు ఏడాదిపాటు అక్కడ పని చేసిన నయన్‌ ఆ తరవాతే వెండితెరపైన మెరిసింది.


‘ఢీ’తో మొదలై

డాన్సర్‌గా జీవితం మొదలుపెట్టిన సాయి పల్లవి డాన్స్‌ చూస్తే- నెమలికి రూపమొస్తే అది సాయి పల్లవిలానే ఉంటుందేమో అనిపిస్తుంది. తమిళంలో స్టార్‌ విజయ్‌, తెలుగులో ఈటీవీ ‘ఢీ’లోనూ అవకాశాలు అందుకున్న సాయిపల్లవి... ఆ షోలలో తన డాన్స్‌తో ప్రేక్షకుల్ని ఫిదా చేసేసింది. అయితే, ఆమె డాన్స్‌ చూసిన చాలామంది సాయి పల్లవికి సినిమాల్లో అవకాశమివ్వడానికి ముందుకొచ్చినా అమ్మానాన్నలకోసం మెడిసిన్‌ చదివింది. ఆ తరవాతే సినిమాల్లోకి అడుగుపెట్టింది.


సీరియళ్లలో బాలనటిగా  

చాలామంది తల్లిదండ్రులు ఏ వృత్తిలో ఉంటే పిల్లలూ అదే వృత్తిలోకి వెళ్లాలనుకుంటారు. అందుకేనేమో కీర్తిసురేశ్‌ సినిమాల్లో నటించాలని చిన్నతనంలోనే నిర్ణయించుకుంది. అమ్మానాన్నలూ అందుకు ఒప్పుకోవడంతో బాల నటిగా సీరియళ్లూ, సినిమాల్లోనూ నటించింది. కానీ, ఆమె తల్లి మేనక మాత్రం చదువుకే మొదటి ప్రాధాన్యమిచ్చేది. కీర్తి మాత్రం సినిమాలను ఆరాధించేది. అందుకే నటనలో మంచి మార్కులే సొంతం చేసుకుంటోంది.


వ్యాఖ్యాతగా  

పదకొండేళ్లకే ఓ మలయాళీ ఛానల్‌లో క్విజ్ ప్రోగ్రామ్‌కి యాంకరింగ్‌ చేసే అవకాశం వచ్చింది నజ్రియాకి. ఆ తరవాత చదువుకుంటూనే మ్యూజిక్‌, చాట్‌షోల్లోనూ దాదాపు ఏడేళ్లపాటు వ్యాఖ్యాతగా పని చేసింది. మరోవైపు బాలనటిగానూ అవకాశాలు అందిపుచ్చుకున్న నజ్రియా ఆ తరవాత హీరోయిన్‌గానూ అవకాశాలు అందుకుంది.‘రాజారాణి’తో బ్రేక్‌ సొంతం చేసుకున్న ఈ తార భర్త ఫహద్‌తో కలిసి నిర్మాతగా మారి సినిమాలు కూడా తీస్తోంది.


డాక్టర్‌ కాబోయి యాక్టర్‌

ప్రీతిజింతా స్ఫూర్తితో మోడలింగ్‌లోకి వచ్చిన మృణాల్‌ ఠాకూర్‌ని ఓ షోలో చూసిన దర్శకుడు 2012లో ‘ముఝే కుఛ్‌ కెహ్‌తీ హై ఖామోషియా’ అనే సీరియల్‌లో అవకాశమిచ్చారు. ఆ తరవాత వచ్చిన ‘కుంకుమ భాగ్య’ మృణాల్‌ జీవితాన్నే మార్చేసింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రసారమై మంచి పేరును తెచ్చిపెట్టింది. ఒకవైపు సీరియళ్లు చేస్తూనే మరోవైపు రియాలిటీ షోల్లోనూ పాల్గొనేది. ఆ తరవాత సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకున్న ఆమె ‘సీతారామం’లో ‘సీత’గా మన ముందుకొచ్చింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు