ఆహ్లాద గుళికలు

కాసేపు హాయిగా నవ్వుకుంటే దైనందిన జీవితంలోని ఒత్తిళ్లు ఎంతో కొంత తగ్గిపోతాయి. అలాంటి హాస్యరసాన్ని ఆలంబనగా చేసుకుని రాయలసీమ రచయితలు అల్లిన కథల సంకలనమిది.

Updated : 14 Dec 2022 11:10 IST

ఆహ్లాద గుళికలు

కాసేపు హాయిగా నవ్వుకుంటే దైనందిన జీవితంలోని ఒత్తిళ్లు ఎంతో కొంత తగ్గిపోతాయి. అలాంటి హాస్యరసాన్ని ఆలంబనగా చేసుకుని రాయలసీమ రచయితలు అల్లిన కథల సంకలనమిది. నాటి ప్రసిద్ధులతోపాటు సమకాలీనులవి కలిపి మొత్తం 44 రచనలు ఇందులో ఉన్నాయి. ఇంటి తాళంచెవిని ఓచోట దాచిపెట్టే దంపతుల అతి రహస్యం తేలిగ్గా బట్టబయలవటం ‘శ్రీవారూ-తాళం చెవి’ ఇతివృత్తం. సామెతలను అస్తవ్యస్తంగా వాడేసే ప్రహసనం ‘భానుమూర్తి భాషాభిమానం’. చుట్టాలను తప్పించుకోవడానికి భార్యాభర్తలు పడే పాట్లతో నవ్వులు కురిపిస్తుంది ‘అతిథి దేవోభవ. కడుపుబ్బ నవ్వించకపోయినా మందహాసాలను తెప్పించే కథలే అన్నీ.  

రాయలసీమ హాస్య కథలు
సంపాదకులు: డా.ఎం.హరికిషన్‌
పేజీలు: 295; వెల: రూ.280/-
ప్రతులకు: ఫోన్‌: 9849065280
- సీహెచ్‌.వేణు


కథల సేద్యగాడు

అడుగడుగునా మట్టి పరిమళం ఉన్న నేల కథలివి. ‘మా బతుకంతా మట్టిలో మునిగినం. పేడలో పొర్లాడినం. కసువులో మెసిలినం...’ అని పాత్రలతో చెప్పిస్తూ జీవితం పట్ల ఏ భ్రమలూ కలిగించకుండా, పాఠకుడిలో వాస్తవిక సామాజిక దృక్పథాన్ని రగిలించే సీమ కథలివి. ‘కొత్త దుప్పటి’ మొదలుకుని ‘సేద్దెగాడు’ వరకూ ప్రతి కథా సీమ జీవితాలని అద్దంలో చూపిస్తుంది. అత్యంత సహజమైన ఎత్తుగడతో పాటు మరపురాని ముగింపులు ఈ కథల ప్రత్యేకతలు. కులాలమధ్య అంతరాన్ని ‘చనుబాలు’  చెబితే, ‘గిరి గీయొద్దు’ కథ తరాల అంతరాన్ని వివరిస్తుంది. కరవు కన్నా కఠినమైనదేదీ లేదంటుంది ‘దెబ్బ’. కథలన్నింటిలోనూ సీమ భాష సౌందర్యం గుబాళిస్తుంది.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కథలు
పేజీలు: 111; వెల: రూ.70/-
ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన
పుస్తకకేంద్రాలు
- నందిని


పిల్లల కోసం భాగవతం

భాగవతమూ దశావతారాల కథలూ  పిల్లలకు అర్థమయ్యేలా సులభమైన భాషలో చెప్పాలంటే ఎంతో నేర్పు కావాలి. ఈ పుస్తకంలో ఆ నైపుణ్యం కనిపిస్తుంది. ఆసక్తిగా వినే మనవరాలికి బామ్మ దశావతారాల గురించి వివరించి చెబుతున్నట్లుగా రాయడమే కాక, కథలో పాఠకులకు వచ్చే సందేహాలనూ తానే ఊహించి వాటిని మనవరాలి ప్రశ్నలుగా మలచి నివృత్తి చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఆయా అవతారాలకు సంబంధించి కథ జరిగేటప్పుడు మధ్యలో సందర్భోచితంగా వచ్చే పిట్టకథలూ పాఠకుల్ని అలరిస్తాయి. దశావతారాలతో పాటు గజేంద్రమోక్షం, అంబరీషుడు, అజామిళుడు, ధ్రువుడు తదితర కథల్ని కూడా రచయిత్రి ఇందులో చేర్చారు.

రమణీయ శ్రీ భాగవతం (దశావతారాలు)
రచన: ముళ్లపూడి శ్రీదేవి
పేజీలు: 364; వెల: రూ. 350/-
ప్రతులకు: ఫోన్‌- 8341450673
- శ్రీ


అవినీతిపై పోరాటం

సమాజంలో అవినీతిని నిర్మూలించాలన్న ఆశయం అతడిది. అవినీతి మార్గంలోనే అయినా ఉన్నతస్థాయికి చేరాలన్న ఆశ ఆమెది. మనసులు కలిసిన
వారిద్దరూ ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ఎంపికయ్యారు. ఉద్యోగాల్లో చేరారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ కథ. అవినీతీ, అక్రమాలే ఆసరాగా బతికే రాజకీయ నాయకులే కాదు, నిరుద్యోగులుగా ఉన్నన్నాళ్లూ ఉద్యోగం వస్తే చాలనుకున్న సాధారణ పౌరులు కూడా ఉద్యోగంలో చేరాక లంచగొండులుగా మారుతూ సత్సంకల్పం ఉన్న ఉన్నతాధికారుల విధి నిర్వహణను నిత్య సంఘర్షణగా మారుస్తున్న వైనాన్ని చర్చించే ఈ నవల ఆసక్తిగా చదివిస్తుంది.

సంభవం (నవల)
రచన: సింహప్రసాద్‌
పేజీలు: 188; వెల: రూ. 120/-
ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన
పుస్తకకేంద్రాలు
- పద్మ



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..