5జీ... ప్రపంచాన్ని మార్చేస్తుందా!

టెలి మెడిసిన్‌ గురించి విన్నాం... మెటావర్స్‌ గురించి చదువుతున్నాం. వర్చువల్‌ రియాలిటీ, నానో టెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌... ఎన్నెన్నో కొత్త విషయాలు. అవేంటో ఒక పట్టాన అర్థమే కావు- అనుకుంటున్నారా..! ఇప్పుడిక ఆ అయోమయం అక్కర్లేదు.

Updated : 17 Sep 2022 14:22 IST

5జీ... ప్రపంచాన్ని మార్చేస్తుందా!

టెలి మెడిసిన్‌ గురించి విన్నాం... మెటావర్స్‌ గురించి చదువుతున్నాం. వర్చువల్‌ రియాలిటీ, నానో టెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌... ఎన్నెన్నో కొత్త విషయాలు. అవేంటో ఒక పట్టాన అర్థమే కావు- అనుకుంటున్నారా..! ఇప్పుడిక ఆ అయోమయం అక్కర్లేదు. ఆచరణలో వాటి ప్రయోజనాలను చూసే సమయం వచ్చేసింది. కొంతకాలంగా టెక్నాలజీ ప్రియులను తెగ ఊరిస్తోన్న 5జీ ఎట్టకేలకు అందుబాటులోకి రానుంది. ‘ప్రపంచాన్నే మార్చేసే సాంకేతికత’ అనీ, ‘క్వాంటమ్‌ లీప్‌’ అనీ నిపుణులు చెబుతున్న దీని విశేషాలు ఏమిటో చూద్దామా!

హైదరాబాద్‌లో రాత్రి తొమ్మిది దాటాక భోజనం చేసి టీవీ చూస్తున్న రవికి ఊరినుంచి చెల్లెలు ఫోన్‌ చేసింది. ఆ అమ్మాయి మాట్లాడుతూ ‘అన్నయ్యా... అమ్మకి...’ అని ఏదో చెప్పబోతుండగా ఫోన్‌ కట్టయింది. రవి వెంటనే చెల్లెలి ఫోనుకి డయల్‌ చేశాడు. ‘నాట్‌ రీచబుల్‌’ అని కాసేపూ ఎంగేజ్‌ టోన్‌ కాసేపూ వస్తోంది. అమ్మకి... అని చెల్లెలు వాక్యాన్ని సగంలో ఆపేసేసరికి అమ్మకేమైందోనని రవికి టెన్షన్‌గా ఉంది. అమ్మ నంబరుకి చేస్తే స్విచాఫ్‌ వస్తోంది. చెల్లెలి భర్త టూర్‌కి వెళ్లాడని చెప్పింది. వాళ్లుండేది విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర్లో. దాంతో నెట్‌వర్క్‌ సరిగా లేక తరచూ ఫోన్‌ కట్‌ అవుతుంటుంది. అమ్మకీ చెల్లికీ మార్చి మార్చి చేస్తూంటే ఏదో ఒకటి కలిసేది కాబట్టి ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదు. వాట్సాప్‌ కాల్‌ చేసినా చెల్లెలు తీయలేదు. కంగారు పడుతూనే ఓ అరగంట ఆపకుండా ప్రయత్నిస్తే మళ్లీ చెల్లెలి ఫోను కలిసింది. తాను పిల్లలకు అన్నంపెడుతూ వాట్సాప్‌ చూసుకోలేదని చెప్పిందామె. అమ్మ హైదరాబాద్‌ రావాలనుకుంటోందనీ, శనివారం రాత్రి రైలుకి టికెట్‌ తీసుకున్నాననీ ఆదివారం పొద్దున్నే మర్చిపోకుండా రైల్వేస్టేషన్‌కి వెళ్లమనీ చెప్పింది చెల్లెలు. కాల్‌ కట్టవడంతో ఆ అరగంటా తాను పడ్డ కంగారు గురించి చెల్లెలికి చెప్పి, ఈ కాల్‌డ్రాప్‌ సమస్య తగ్గేవరకూ ఫోన్‌ దగ్గర ఉంచుకుని తరచూ మెసేజ్‌లూ వాట్సాప్‌ కాల్సూ చూసుకుంటూ ఉండమని సలహా ఇచ్చాడు రవి.

ఇలాంటివే కాదు, ఆన్‌లైన్‌లో మీటింగ్‌ జరిగేటప్పుడు ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిపోయి అవతలి వాళ్ల మాటలు ముక్కలు ముక్కలుగా వినపడటం, ల్యాప్‌టాప్‌ తెర అంతా ఎవరు ఎవరో కనపడకుండా అలుక్కుపోవడం, ట్యాక్సీ బుక్‌ చేస్తే ‘కనెక్టింగ్‌’ దగ్గర ఆగిపోయి పావుగంట విసిగించడం, ఒక్క సినిమా డౌన్‌లోడ్‌ చేసుకోడానికి అరగంట పట్టడం, పిల్లల పరీక్షల ఫలితాలు వస్తే సర్వర్‌ డౌన్‌ అయిపోయి ఇంట్లో కంప్యూటర్‌ ఉండీ రిజల్ట్‌ చూసుకోవడానికి టెన్షన్‌ పడాల్సిరావడం, ఏ కిరాణా దుకాణానికో వెళ్లి గూగుల్‌పేనో ఫోన్‌పేనో చేసినప్పుడు మన ఖాతాలో డబ్బులు మైనస్‌ అయ్యి అవతలి ఖాతాలో పడకుండా ట్రాన్సాక్షన్‌ సగంలో ఆగిపోవడం... ఇలా మనం తరచూ ఎదుర్కొనే నెట్‌వర్క్‌ సమస్యలు ఎన్నో. ఇలాంటి వాటన్నిటికీ తెరదించుతూ మరెన్నో కొత్త సౌకర్యాలను మనకు చేరువ చేయబోతోంది ‘5జీ’... అంటే- ఐదో తరం టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ. ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియా సంస్థలు రేపోమాపో 5జీ సేవల్ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో... దానివల్ల రాగల మార్పులేమిటో చూద్దాం.

అసలీ తరాలేమిటీ!
‘జీ’ అంటే జనరేషన్‌ అనే అర్థం. ఈ వైర్లెస్‌ టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ అభివృద్ధినీ తరాల్లో కొలుస్తున్నారు. కాకపోతే మనుషుల్లా కాక నలభయ్యేళ్లలోనే ఇది ఐదో తరంలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో- ఇవాళ మన చేతిలోని స్మార్ట్‌ ఫోను ఎలా మొదలై ఈ దశకి వచ్చిందో తెలుసుకోవడం ఆసక్తికరం. నిప్పన్‌ టెలిగ్రాఫ్‌ అండ్‌ టెలిఫోన్‌ కంపెనీ 1979లో మొదటితరం మొబైల్‌ ఫోన్‌ని టోక్యో వాసులకు పరిచయం చేసింది. 1984కల్లా జపాన్‌ దేశమంతటా 1జీ సర్వీసును అందించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత మోటరోలా లాంటి కంపెనీలు ఆ సాంకేతికతను అన్ని దేశాలకూ చేరవేశాయి. ఆరోజుల్లో అది విప్లవాత్మకమైన మార్పే అయినప్పటికీ ఫోనులో మాట సరిగా వినిపించేది కాదు. విపరీతమైన శబ్దాలు వచ్చేవి. రోమింగ్‌, సెక్యూరిటీ, ఎన్‌క్రిప్షన్‌ లాంటివేవీ తెలియవు. డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 2.4 కేబీపీఎస్‌ మాత్రమే.

అయినా 1జీకి లభించిన ఆదరణ చూసి 1991లో గ్లోబల్‌సిస్టమ్‌ ఫర్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌(జీఎస్‌ఎం) నెట్‌వర్క్‌ మీద 2జీని ప్రారంభించింది ఫిన్లాండ్‌. దీని వేగం 50 కేబీపీఎస్‌. కంటెంట్‌ని ఒక ఫోన్‌ నుంచి మరో ఫోన్‌కి పంపుకోవడానికి వీలయింది దీంతోనే. ఎస్‌ఎంఎస్‌లూ ఎంఎంఎస్‌లూ కొత్త కమ్యూనికేషన్‌ మార్గాలయ్యాయి. బేసిక్‌ స్మార్ట్‌ఫోన్‌ పనితీరు ఇక్కడినుంచే మొదలైంది. సెల్‌ఫోన్ల వాడకం బాగా పెరిగింది. దాంతో 2001లో డొకొమొ కంపెనీ 3జీ సదుపాయాన్ని జపానులో ప్రారంభించింది. 2జీ కన్నా నాలుగు రెట్లు వేగంగా (2 ఎంబీపీఎస్‌) డేటాని బదిలీ చేయగల సామర్థ్యం దీనిది. ఇంటర్నేషనల్‌ రోమింగ్‌, ఈమెయిల్స్‌ లాంటివాటికి వెసులుబాటు వచ్చింది. లైవ్‌ వీడియో చాట్‌కి తెరలేచింది. ఇంటర్నెట్‌ని బ్రౌజ్‌ చేసే అవకాశమూ, పాటలు వినగలగడమూ 3జీలో చెప్పుకోదగ్గ విశేషాలు. బ్లాక్‌బెర్రీ, ఆపిల్‌ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ తయారీ మొదలుపెట్టిందీ అప్పుడే. ఐఫోన్‌ రాకతో అవి పాపులర్‌ అయి, డేటాకి డిమాండ్‌ పెరగడంతో 12.5 ఎంబీపీఎస్‌ వేగంతో నాలుగో తరాన్ని- అంటే 4జీని తెచ్చారు. 2011లో కెనడా మొదటిసారి ఎల్‌టీఈ(లాంగ్‌ టర్మ్‌ ఇవొల్యూషన్‌) వైర్లెస్‌ నెట్‌వర్క్‌ని ప్రారంభించింది. క్రమంగా దాని స్పీడ్‌ కూడా సగటున 30 ఎంబీపీఎస్‌కి చేరింది. సోషల్‌ మీడియా, హెచ్‌డీ స్ట్రీమింగ్‌, గేమింగ్‌, ఉబర్‌ లాంటి ఇంటరాక్టివ్‌ ఆప్స్‌ వాడకం మొదలైంది. అయితే సాంకేతికత నానాటికీ పెరుగుతూనే ఉంది. ఫోను వాడకానికి ఒక హద్దంటూ లేకుండా పోయింది. దాంతో ఇంకా వేగంగా ఉండే నెట్‌వర్క్‌ అవసరం వచ్చింది. దాని ఫలితమే 5జీ.

ఏమిటి దీని ప్రత్యేకతలు?
ఈ ఐదోతరం కూడా నిజానికి 2019లోనే మొదలైంది. దక్షిణ కొరియాలోని టెలికాం ప్రొవైడర్స్‌ 4జీ కన్నా ఇరవై రెట్లు వేగంగా పనిచేసేలా దీన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇది ఎంత వేగంగా పనిచేస్తుందంటే డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌కి ఒక్క క్షణం కూడా వేచి చూసే పనిలేదు. ఇలా బటన్‌ నొక్కగానే అలా డేటా బదిలీ జరిగిపోతుంది. ఇప్పుడా పని జరగడానికి 50 నుంచి 100 మిల్లిసెకన్ల సమయం పడుతోందట. 5జీతో అది ఒక్క మిల్లిసెకన్‌కి తగ్గిపోతుందని అంచనా. క్రమంగా ఇది 4జీ కన్నా వంద రెట్లు స్పీడుగా పనిచేయగలదంటున్నారు.

ఇంటర్నెట్‌ వేగం కోసం, సినిమాల డౌన్లోడ్‌ కోసమేనా 5జీ అంటే... కాదనే చెప్పాలి. 5జీ అంటే- సామర్థ్యం, మన్నిక, భద్రత, నమ్మకం, తెలివైన యంత్రాలు, సరికొత్త ప్రమాణాలు. మనిషి అనుభవాల్నీ అనుభూతుల్నీ ఒక కొత్త స్థాయికి చేర్చగల సాధనం. ఇంటి నుంచి ఆఫీసు వరకూ, వైద్యం నుంచి వ్యవసాయం వరకూ దాదాపుగా అన్ని రంగాలనూ ప్రభావితం చేయగల శక్తి. ఇన్నాళ్లూ అక్కడక్కడా ప్రయోగాత్మకంగా మాత్రమే చూసిన వింతలూ విశేషాలూ, ఊహలుగా ఉన్నవీ ఇప్పుడు వాస్తవం కాబోతున్నాయి. యంత్రాలు వాటికవే ఆలోచించి నిర్ణయం తీసుకునే కృత్రిమ మేధ, వేర్వేరు యంత్రాలూ లేదా పనిముట్లూ ఒకదానితో ఒకటి సంభాషించుకుని సమన్వయంతో పనిచేసే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ లాంటివీ... అన్నీ మన నిత్యజీవితంలోకి వచ్చేందుకు ఇదే మార్గం. ఇంతటితో ఆగలేదు, దీనితో ఇంకా ఏమేం చేయొచ్చన్న దిశగా ఇతర దేశాల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. నిజంగానే 5జీకి ప్రపంచాన్ని మార్చేసే శక్తి ఉందంటున్నాయి ఇప్పటికే దీన్ని వాడుతున్న దేశాలు.

ఏయే దేశాల్లో ఉంది?
గత జులై ఆఖరు నాటికి 70కి పైగా దేశాల్లో 5జీ అందుబాటులో ఉంది. అన్ని దేశాలూ కూడా కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలను అందిస్తున్నాయి కానీ పూర్తిగా దేశమంతటా ఇంకా ఎవరూ ఇవ్వడం లేదు. చైనా అత్యధికంగా 356 నగరాల్లో 5జీ సేవల్ని అందిస్తుండగా 296 నగరాలతో ఆ తర్వాత స్థానంలో ఉంది అమెరికా. ఫిలిప్పీన్స్‌, దక్షిణ కొరియా, కెనడా, స్పెయిన్‌, ఇటలీ, జర్మనీ, బ్రిటన్‌, సౌదీ అరేబియాలు 50నుంచి 100 లోపు నగరాల్లో 5జీ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మన దేశంలోనూ మొదట కొన్ని నగరాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.

దేశమంతా ఒక్కసారే ఇవ్వచ్చుగా...
అది అంత తేలిక కాదు. ఎక్కువ సెల్‌ టవర్లూ, 5జీ సామర్థ్యం ఉన్న ఫోన్లూ ఉండేది నగరాల్లోనే కాబట్టి ఈ సౌకర్యాన్ని మొట్టమొదట అక్కడే కల్పిస్తారు. క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. అసలీ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఎలా పనిచేస్తుందంటే- ఒక్కో ప్రాంతాన్ని చిన్న చిన్న భాగాలుగా(సెల్స్‌) విడదీస్తారు. ఒక్కో సెల్‌లో ఉన్న ఫోన్లన్నీ ఒక టవర్‌కి అనుసంధానమై పనిచేస్తాయి కాబట్టే మొబైల్‌ ఫోన్‌ని సెల్‌ ఫోన్‌ అంటారు. ఫోనులో మాట్లాడేటప్పుడు ధ్వని తరంగాలు ఈ సెల్‌ టవర్‌ ద్వారానే రేడియో తరంగాలుగా మారి ప్రయాణిస్తాయి. ఏడులక్షల సెల్‌ టవర్లతో ప్రపంచంలో మనమే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ చాలా ప్రాంతాలకు ఇంకా నెట్‌వర్క్‌ సమస్య ఉంది. మామూలు ఫోను మాట్లాడాలంటేనే చెట్టో వాటర్‌ ట్యాంకో ఎక్కే పరిస్థితి. అలాంటిది ఇక 5జీ నెట్‌వర్క్‌ ఇవ్వడం అంటే అంత తేలిక కాదు. ప్రస్తుతానికి 4జీ టవర్లనే వాడుతున్నప్పటికీ 5జీ కోసం ప్రత్యేక టవర్లను నిర్మించాల్సి ఉంటుంది. ఫైబరైజేషన్‌ కూడా పెంచుతారు. ఈ పనులన్నీ చేస్తూ రెండేళ్లలోపల దేశమంతా విస్తరించాలన్నది ఆశయం. ఒక్కో చదరపు కి.మీ.పరిధిలో 4జీ కన్నా పదిరెట్ల ఎక్కువ సంఖ్యలో పరికరాల్ని 5జీతో కనెక్ట్‌ చేయగల వెసులుబాటు ఉంది కనుక పని అంటూ మొదలెడితే త్వరగానే ఎక్కువ మందికి అందుబాటులోకి తేవచ్చు. ఇక, ఇప్పటికీ 2జీ, 3జీ ఫోన్లు వాడుతున్న వినియోగదారులు కూడా 4జీకి మారాల్సి ఉంటుంది.

ఫోను ఛార్జీలు పెరుగుతాయేమో?
విదేశాలతో పోలిస్తే మనదేశంలో ప్రస్తుతం డేటా చాలా చౌకగా లభిస్తున్నట్లు లెక్క. ట్రాయ్‌ లెక్కల ప్రకారం దేశంలో 114 కోట్ల మందికి పైగా మొబైల్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్నప్పటికీ వారి నుంచి వస్తున్న ఆదాయం మిగతా దేశాలకన్నా చాలా తక్కువ. ఏటికేడాదీ డేటా వినియోగం విపరీతంగా పెరుగుతోంది కానీ నెలకు సగటు వినియోగదారు నుంచి వచ్చే ఆదాయం అత్యధికంగా రూ.178(అదీ ఎయిర్‌టెల్‌కి. మిగతా వాటికి ఇంకా తక్కువట) మాత్రమేనట. 5జీ వచ్చినా ఛార్జీల్లో పెద్ద మార్పు ఏమీ ఉండే అవకాశం లేదనే ప్రభుత్వం అంటోంది. అయితే 5జీ కేవలం ఫోను వినియోగానికి సంబంధించిన విషయమే కాదు కాబట్టీ... మరెన్నో రంగాల్లో అభివృద్ధికి ఇది ప్రధాన సాధనం అవుతుంది కాబట్టీ... ఇక, కొత్త బంగారులోకానికి స్వాగత ద్వారాలు తెరుచుకోవడమే తరువాయి... అని హామీ ఇస్తున్నారు నిపుణులు. అందుకే ఎప్పుడెప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూసేది మరి..!


అన్నీ మారిపోతాయట..!

ఇప్పటివరకు అభివృద్ధిచేసిన సాంకేతికతల్లో అత్యంత అధునాతన వైర్లెస్‌ టెక్నాలజీ... 5జీ. ఇది అందుబాటులోకి వస్తే...

ఫోను: ఎన్నోరెట్లు వేగంగా డేటా బదిలీ, అప్‌లోడ్‌, డౌన్‌లోడ్లకు వీలవుతుంది. చక్రం తిరిగే (బఫరింగ్‌) ప్రసక్తే ఉండదు. 

ఇల్లు: ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద హైఎండ్‌ టీవీ(7,680్ల4,320 పిక్సెల్స్‌)లను కొనుక్కుంటున్నారు. వాటి పూర్తి సామర్థ్యం 5జీలోనే కన్పిస్తుంది. వీఆర్‌ గేమ్స్‌ ఆడేవారూ, క్రికెట్‌, టెన్నిస్‌ లాంటి మ్యాచ్‌లు చూసేవారూ అయితే వాటిల్లో పూర్తిగా లీనమైపోవచ్చు. ఏకంగా గ్రౌండ్‌లో ఉండి చూస్తున్న అనుభూతి చెందవచ్చు. పలురకాల డేటాని అత్యంత వేగంగా ప్రాసెస్‌ చేయడం వల్ల ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా రియల్‌టైమ్‌ అనుభవం లభిస్తుంది. ఇక, ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న స్మార్ట్‌హోమ్‌ కాన్సెప్ట్‌ని ఆచరణలో పెట్టవచ్చు. ఇంట్లోని పరికరాలన్నిటినీ అనుసంధానించి ఎక్కడ ఉన్నా ఫోనుతో వాటిని పనిచేయించే వెసులుబాటు వస్తుంది.

వైద్యం: గత వందేళ్లలో వైద్యరంగం ఎంత అభివృద్ధి చెందిందో 5జీ వచ్చాక పదేళ్లలోనే అంతకన్నా ఎన్నో రెట్లు అభివృద్ధిని చూడవచ్చంటున్నారు నిపుణులు. కొన్నాళ్లుగా చెబుతున్న స్మార్ట్‌ వైద్యం, టెలిమెడిసిన్‌ ఇప్పుడు అందుబాటులోకి వస్తాయి. పేషెంట్‌ ఇంట్లోనే ఉండి వీడియోలో ఆస్పత్రిలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించవచ్చు. అత్యవసరమైతే తప్ప ఆస్పత్రికి వెళ్లక్కరలేదు. అంబులెన్స్‌ సర్వీసుల్ని అనుసంధానం చేయడం వల్ల అవసరమైనచోటికి త్వరగా చేరుకునేందుకూ, సమయం వృథా కాకుండా అంబులెన్స్‌లోనే వైద్యం మొదలెట్టేందుకూ వీలవుతుంది. ఏ ఊరో వెళ్లి హఠాత్తుగా జబ్బుపడినా భయపడనక్కర లేదు. తాము నివాసం ఉండేచోట ఎప్పుడూ చూపించుకునే ఆస్పత్రి నుంచి పేషెంట్‌ తాలూకు వైద్య చరిత్ర క్షణాల్లో అక్కడి ఆస్పత్రికి అందుతుంది. రోబోటిక్‌ హ్యాండ్స్‌ సాయంతో వైద్యులు దూరంగా మరో ప్రాంతంలో ఉన్న పేషెంట్‌కి రిమోట్‌ సర్జరీలు చేయగలుగుతారు. ఒంటి మీద ధరించే గ్యాడ్జెట్స్‌(వేరబుల్స్‌) అసలు సమస్య రాకముందే హెచ్చరించి అప్రమత్తం చేస్తాయి.

విద్య, ఉపాధి: 2030 నాటికి ఇంటర్నెట్‌లో అతి పెద్ద కంపెనీ అంటూ ఏదైనా ఉంటే అది విద్యారంగానికి చెందినదే అయివుంటుందని ఒక అంచనా. చదువు చాలారకాలుగా ప్రభావితమవుతుంది. విద్యార్థులు ఒకేసారి భిన్న కోర్సులు చదువుకోవచ్చు. ఇంటరాక్టివ్‌ వర్చువల్‌ ట్రైనింగ్‌ పలువృత్తుల్లో సాధ్యమవుతుంది.

వ్యవసాయం: పొలంలో నాట్లు వేసే దశ నుంచి మన పళ్లెంలో ఆహారంగా మారే వరకూ వ్యవసాయరంగాన్ని మొత్తంగా డిజిటలైజ్‌ చేసేయొచ్చు. సెన్సార్లే అన్నిచోట్లా కీలక పాత్ర పోషిస్తాయి. నీటి పారుదల వ్యవస్థనీ, చీడపీడల నిర్వహణనీ, పంట కోతల్నీ... అన్నిటినీ అవే పర్యవేక్షిస్తాయి. కృత్రిమ మేధతో పనిచేసే యంత్రాల వాడకం పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులన్నీ ఎక్స్‌పైరీ డేట్‌తో సహా ప్యాక్‌ అయ్యి బయటకు వస్తాయి.

బ్యాంకింగ్‌, బీమా: నగదు వాడకమూ బ్యాంకుకు వెళ్లడమూ అనేవి పాతకాలపు జ్ఞాపకాలుగానే మిగులుతాయి. అసలు ఊరూరా బ్యాంకు కార్యాలయాల అవసరమే ఉండకపోవచ్చు. బీమా అంచనాలూ చెల్లింపులూ సులువవుతాయి. ఏ ప్రమాదమో జరిగితే క్షణాల్లో డ్రోన్లు అక్కడికి వెళ్లి నష్టాన్ని అంచనా వేసి అప్పటికప్పుడు పరిహారం చెల్లింపులు జరిగిపోయేలా చూస్తాయి.

పరిశ్రమలు: పరిశ్రమల్లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వినియోగంతో ఉత్పాదకత విపరీతంగా పెరుగుతుంది. కృత్రిమమేధ సాయంతో తయారీలోని పలు దశలను ఆటోమేటెడ్‌ షెడ్యూలింగ్‌ చేసుకోవచ్చు. దీనివల్ల సామర్థ్యం రెండు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుంది. కర్బనవాయువుల విడుదల కూడా తగ్గుతుంది.

షాపింగ్‌: ఆన్‌లైన్‌లో అయినా మాల్‌కి వెళ్లినా షాపింగ్‌ అంతా చేసి బిల్లింగ్‌ దగ్గరికి వచ్చేసరికి ఒకింత చికాకు తప్పదు. 5జీ వాడకం పెరిగితే ఒక చిన్న వాయిస్‌ కమాండ్‌తో పనైపోతుంది. షాపింగ్‌ చక్కని అనుభూతిగా మిగులుతుంది.

పాలన వ్యవహారాలు: పూర్తి శరీరాన్ని స్కాన్‌ చేసే హోలోగ్రాఫ్‌ వ్యక్తుల డిజిటల్‌ ఐడెంటిటీగా(గుర్తింపు కార్డు) మారుతుంది. అప్పుడిక ప్రతిదానికీ ఆధార్‌, పాన్‌ తదితర వెరిఫికేషన్ల గోల ఉండదు. పనులన్నీ సులువుగా అయిపోతాయి.

మెటావర్స్‌: ఇప్పుడిప్పుడే వింటున్న మెటావర్స్‌ నిత్యం అనుభవంలోకి వస్తుంది. షాపింగ్‌లో, సోషల్‌మీడియాలో, ఆన్‌లైన్‌ మీటింగుల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంటి దగ్గరే ఉండి అమెరికాలో మనవడి గ్రాడ్యుయేషన్‌ వేడుకలో పాల్గొనవచ్చు. వరండాలో పడక కుర్చీలో కూర్చుని షిర్డీ ఆలయంలో హారతిని కళ్లారా చూడవచ్చు. వీడియోల్లాగా కాకుండా అక్కడే ఉండి ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలిగించడమే మెటావర్స్‌ ప్రత్యేకత.

రవాణా: విద్యుత్‌ వాహనాల వినియోగం, నిర్వహణ తేలికవుతుంది. ఛార్జింగ్‌ స్టేషన్లను వాహనాలకు అనుసంధానం చేయొచ్చు. డ్రైవరు లేకుండా కార్లు నడపడమూ సాధ్యమవుతుంది.

సూపర్‌ ఆప్‌: ఇప్పటివరకూ ఒక్కో పనికి ఒక్కో ఆప్‌ని వాడాల్సి రావడం వల్ల ఫోనులో చాలా ఆప్స్‌ని పెట్టుకోవాల్సి వస్తోంది. పలు సేవలను ఒకేచోట అందించే సూపర్‌ ఆప్‌లను తయారుచేసినా డేటా వేగం సహకరించక అంతగా ఆదరణ పొందడం లేదు. 5జీతో ఆ బాధ తప్పుతుంది. సూపర్‌ఆప్‌తో సులువుగా పనులు చేసుకోవచ్చు.

స్మార్ట్‌ సిటీలు: కొన్ని నగరాలను స్మార్ట్‌ సిటీలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి నగరాల్లో విద్యుత్తు, నీటిసరఫరా, వీధిలైట్లు, ట్రాఫిక్‌, డ్రెయినేజీ, వరద కాలువలు... లాంటివన్నీ నిర్వహించడం 5జీ కనెక్టివిటీ వల్ల సులువవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..