ఇది... బాక్స్‌ క్రికెట్‌ బాసూ!

మనది క్రికెట్‌ దేశం. కాసింత ఖాళీ దొరకాలేకానీ నలభైలు దాటినవాళ్లు కూడా ‘గల్లీ క్రికెటర్స్‌’ అయిపోతుంటారు. కాకపోతే, నేటి నగరాల్లో క్రికెట్‌ ఆడటానికి కావాల్సినంత ఖాళీ జాగా కనిపించట్లేదు

Updated : 08 Jan 2023 04:05 IST

ఇది... బాక్స్‌ క్రికెట్‌ బాసూ!

మనది క్రికెట్‌ దేశం. కాసింత ఖాళీ దొరకాలేకానీ నలభైలు దాటినవాళ్లు కూడా ‘గల్లీ క్రికెటర్స్‌’ అయిపోతుంటారు. కాకపోతే, నేటి నగరాల్లో క్రికెట్‌ ఆడటానికి కావాల్సినంత ఖాళీ జాగా కనిపించట్లేదు. ఒకే గ్రౌండులో రెండు మూడు టీమ్‌లు ‘సర్దుకుపోతూ’ ఆడాల్సిన పరిస్థితి. ఈ సమస్యకి పరిష్కారంగా పుట్టుకొస్తున్న ‘బాక్స్‌ క్రికెట్‌’ గ్రౌండ్‌లు గల్లీ క్రికెట్‌ రూపురేఖల్ని సమూలంగా మార్చేస్తున్నాయి!

వారాంతాలు వస్తే నగర జీవులు సకుటుంబసమేతంగానో, స్నేహితులతో కలిసో ఏ మాల్‌కో సినిమా హాల్‌కో రెస్టరంట్‌లకో వెళ్ళడం పరిపాటి కదా! ఇప్పుడు ఆ జాబితాలో బాక్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లు కూడా చేరుతున్నాయి! క్రికెట్‌పైన ఏ కాస్త ఆసక్తి ఉన్నా చాలు... ఆడామగా అన్న తేడా లేకుండా ఫిట్‌నెస్‌ గురించి పట్టించుకోవాల్సిన అవసరం రాకుండా ఈ ‘బాక్స్‌ క్రికెట్‌’ గ్రౌండ్‌లో బ్యాట్‌ని ఝళిపించేయొచ్చు. బంతిని ఎన్ని గింగిరాలైనా తిప్పొచ్చు. మరీ వయసుమీరిన వాళ్ళయితే తప్ప ఎవరూ ప్రేక్షకపాత్ర పోషించాల్సిన అవసరం రాదు. ఈ బాక్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ చిన్నగా ఉండటమూ చుట్టూ నెట్‌ కట్టి ఉండటమే ఇందుకు కారణం. అందువల్ల బంతి కోసం ఎక్కువదూరం పరుగెత్తాల్సిన అవసరం ఉండదు. ఈ బాక్స్‌ క్రికెట్‌కి సంబంధించిన నిబంధనలు కూడా... పెద్దగా శారీరకంగా శ్రమించాల్సిన అవసరంలేని రీతిలోనే ఉంటాయి. గరిష్ఠంగా పది ఓవర్లే ఇందులో ఆడతారు. టీమ్‌లోనూ ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. పరుగెత్తి బౌలింగే చేయాలని లేదు... నిలబడి అలా విసిరినా చాలు. టెన్నిస్‌ బంతినే వాడతారు కాబట్టి గాయాలయ్యే సమస్యా లేదు. బ్యాటర్‌ కొట్టిన బంతి చుట్టూ ఉన్న నెట్‌లో ఒక నిర్ణీత ఎత్తుని తాకితే ఫోర్‌గానూ అంతకంటే ఎత్తుకి వెళితే సిక్స్‌గానూ నిర్ణయిస్తారు. బ్యాటర్‌ బంతిని పైకప్పుకి తాకేలా కొట్టినా... ఔట్‌గానే పరిగణిస్తారు! నో బాల్స్‌, వైడ్‌లాంటివి ఉంటాయి కానీ... లెగ్‌ బైస్‌ ఉండవు. రనౌట్‌, క్యాచ్‌ ఔట్‌లాంటి నిబంధనలు మామూలే. నెట్‌లోపల పూర్తిగా కృత్రిమ గడ్డి ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ బాక్స్‌లలో దుమ్ము రాదు. ఒక టీమ్‌ 10 ఓవర్లు ఆడుతుంది. జట్టులో ఆరుగురే ఆడతారు కాబట్టి... మ్యాచ్‌ గంటలోనే అయిపోతుంది. అందువల్లే ఈ బాక్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లలో గంటకు ఇంతన్న లెక్కన రుసుము వసూలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.300-500 వరకూ ధరలు ఉంటున్నాయి. వారాంతాల్లోనైతే వెయ్యి రూపాయల దాకా డిమాండు చేస్తున్నారు. క్రికెట్‌ కిట్‌ను కూడా నిర్వాహకులే ఇస్తారు. ముఖ్యంగా వీళ్లిచ్చే ప్లాస్టిక్‌ బ్యాటుకి యువతలో మంచి క్రేజ్‌ ఉంది! గల్లీక్రికెట్‌ ఆడే ఏ మైదానంలోనూ లేనివిధంగా వాష్‌ రూమ్స్‌, ఛేంజింగ్‌ రూమ్స్‌ కూడా ఇందులో ఉంటున్నాయి. చాలాచోట్ల బాక్స్‌ క్రికెట్‌ ప్రాంగణంలోనే ఫుడ్‌కోర్ట్సు కూడా ఏర్పాటుచేస్తున్నారు.

క్రికెట్‌ మిద్దెక్కింది!

విదేశాల్లో మొదలైన ఈ బాక్స్‌ క్రికెట్‌... పదేళ్ల కిందటే మనదేశంలో అడుగుపెట్టింది. మొదట ముంబయిలో ఎక్కువగా ఆడేవారు. 2018 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇవి ప్రారంభమయ్యాయి.
క్రికెట్‌ ఆడేందుకు నిత్యం గ్రౌండ్‌ల కోసం వెతుక్కునే యువత పుణ్యమాని హైదరాబాద్‌లోనైతే వీటి సంఖ్య సుమారు వెయ్యిదాకా ఉంది! విజయవాడ, విశాఖ, తిరుపతి, నెల్లూరుల్లోనూ వీటి హవా మొదలైంది. క్రికెట్‌పైన మక్కువున్న యువకులు వీటికి మహరాజ పోషకులుగా ఉండడమే కాదు... కొన్నిచోట్ల తామే ఇలాంటి బాక్స్‌ క్రికెట్‌ గ్రౌండ్స్‌నీ ఏర్పాటుచేస్తున్నారు. ఖాళీగా ఉన్న మైదానాన్ని లీజుకి తీసుకుని నెట్‌లు కట్టి సకల వసతులతో కూడిన బాక్స్‌ క్రికెట్‌ గ్రౌండ్స్‌కి రూపుదిద్దుతున్నారు. నగరాల్లో అలా మైదానం దొరకనివాళ్ళు వినూత్నంగా... పెద్ద భవంతుల్లోని ఫ్లోర్‌లని కూడా ‘బాక్స్‌ క్రికెట్‌ హాళ్లు’గా మారుస్తున్నారు! ఇందుకోసం ఎనభైలక్షల నుంచి కోటి రూపాయలదాకా పెట్టుబడి పెడుతున్నారు. యువతలో మంచి క్రేజ్‌ ఉండటంతో ఇది లాభదాయక వ్యాపారంగా మారింది. ఆ లాభాలని పెంచుకునే క్రమంలోనే ఇంటిల్లిపాదీ వచ్చి క్రికెట్‌ ఆడేలా సకల వసతులూ కల్పిస్తున్నారు.

ఆప్‌లో బుక్‌ చేసుకోవాల్సిందే!

ఈ బాక్స్‌ క్రికెట్‌ బాక్స్‌లను ఉదయం ఏడు నుంచి రాత్రి 11 దాకా కూడా తెరిచి ఉంచుతున్నారు. ఐటీ రంగంలో రాత్రుళ్లు ఉద్యోగం చేసి సాయంత్రందాకా నిద్రపోయి...ఆ తర్వాత ఏదైనా ఆటలాడాలనుకునే వాళ్ళకి ఇదెంతో ఉపయోగపడుతోందట. అంతేకాదు, వారాంతాల్లోనైతే ఈ గ్రౌండ్‌లు అసలు దొరకడంలేదు. వీటిల్లో స్లాట్స్‌ బుక్‌ చేసుకోవడానికని ప్లేయో, జీడబ్ల్యూస్పోర్ట్స్‌ వంటి ప్రత్యేక ఆప్‌లు కూడా ఉన్నాయి. అంతేకాదు, తమ దగ్గరకి రెగ్యులర్‌గా వచ్చే టీమ్‌ల కోసం టోర్నమెంట్‌లూ నిర్వహిస్తుండడం విశేషం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..