నీళ్ల ట్యాంకు... చదువు చెబుతోంది!

అది హైదరాబాద్‌లోని ఓ పెద్ద నీళ్ల ట్యాంకు. రోజూ సాయంత్రం కాగానే ఎంతో మంది విద్యార్థులు ఆ నీళ్ల ట్యాంకు పైకి వెళుతుంటారు.

Published : 20 Nov 2022 00:24 IST

నీళ్ల ట్యాంకు... చదువు చెబుతోంది!

అది హైదరాబాద్‌లోని ఓ పెద్ద నీళ్ల ట్యాంకు. రోజూ సాయంత్రం కాగానే ఎంతో మంది విద్యార్థులు ఆ నీళ్ల ట్యాంకు పైకి వెళుతుంటారు. మళ్లీ రాత్రి తొమ్మిదింటికి ఒకరి వెనక ఒకరు కిందికి దిగుతారు. అక్కడున్న వాహనాలు ఆ పిల్లల్ని సురక్షితంగా ఇళ్లకు చేరుస్తాయి. ఇంతకూ ఆ నీళ్ల ట్యాంకు పైకి వాళ్లు రోజూ ఎందుకు వెళ్తున్నారనుకుంటున్నారా... వాళ్ల జీవితాలను బాగు చేసుకోవడానికి. అదెలాగంటే...

స్రవంతి తండ్రి కుట్టు పని చేస్తుంటాడు. తను జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదువుకునేది. స్తోమత లేక ఇంట్లో చదువు ఆపేయమన్నారు. అయినా బీటెక్‌ పూర్తిచేసి ఇప్పుడు ‘బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా’లో రూ.12 లక్షల వార్షిక వేతనంతో పనిచేస్తోంది. తండ్రి సెక్యూరిటీ గార్డు.

వచ్చే జీతం తప్ప ఎలాంటి ఆధారమూ లేదు. అయినా సరే కల్యాణి 2007లో పదో తరగతి పూర్తయ్యాక పాలిటెక్నిక్‌లో చేరింది. తర్వాత బీటెక్‌ చదివి, ఇప్పుడు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఏడాదికి రూ.20 లక్షల వేతనంతో ఉద్యోగంలో చేరింది. వీళ్లే కాదు... ఇలా ఇప్పటి వరకూ వందలమంది పేద విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకుని అనుకున్నది సాధించారు. అన్నట్టూ ఈ పిల్లలంతా రోజూ ఆ నీళ్ల ట్యాంకు ఎక్కిదిగినవాళ్లే. ఇంతకీ వీళ్ల చదువుకూ, నీళ్ల ట్యాంకుకూ సంబంధం ఏంటో తెలియాలంటే ‘పోతుకూచి సోమసుందర సోషల్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు’ సేవాసంస్థ కథ చదవాలి.

అసలేంటీ సంస్థ... 

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉండే పోతుకూచి శ్రీనివాస్‌ ఓ ప్రైవేటు ఉద్యోగి. చుట్టూ కనిపించే పేద పిల్లలకు ఏదైనా సాయం చేయాలనే తపనతో ఉండేవాడు. అలాంటి విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు  కొని ప్రభుత్వ పాఠశాలల్లో పంచేవాడు. కొన్నాళ్లకు- వాటిని మాత్రం అందించడం వల్ల పిల్లల జీవితంలో అనుకున్న మార్పేమీ జరగదనుకున్నాడు. ఇంకేదైనా చేసి పేదవిద్యార్థులకు అండగా నిలవాలనుకున్నాడు. ఆ ఆలోచనతోనే 2003 ఆగస్టు 15న తన తండ్రి పేరు మీద ‘పోతుకూచి సోమసుందర సోషల్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు’ను ఏర్పాటు చేశాడు. 

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలంటే ఎక్కువమంది పేదవాళ్లే ఉంటారు. ఆ కుటుంబాల్లో రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితే కనిపిస్తుంది. అలాంటప్పుడు అమ్మానాన్నలు ఇంటి దగ్గర పిల్లలకు అవసరమైన పాఠాలూ చెప్పలేరు. అలా అని ప్రైవేటు ట్యూషన్లూ పెట్టించలేరు. మరైతే ఆ పిల్లల చదువులు బాగవ్వాలంటే ఏం చేయాలీ అని ఆలోచించిన శ్రీనివాస్‌ రోజూ బడి తర్వాత సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత ట్యూషన్లు చెప్పించడం మొదలుపెట్టాడు. నిపుణులైన టీచర్లను తీసుకొచ్చి గణితమూ, సైన్సూ, ఇంగ్లిషూ... ఇలా అన్ని సబ్జెక్టుల సిలబస్‌నీ పూర్తిగా చెప్పించి విద్యార్థుల సందేహాలన్నింటినీ తీర్చే ప్రయత్నం చేసేవాడు. 

నీళ్ల ట్యాంకే బడిగా...

పిల్లల్ని ఒక దగ్గర చేర్చి పాఠాలు చెప్పాలంటే ఓ చోటు అంటూ ఉండాలి కదా. అందుకే మొదట్లో మియాపూర్‌లోని ఓ పెద్ద నీళ్ల ట్యాంకునే గోడలతో బడిగా మార్చాడు. రోజూ సాయంత్రాలతో పాటు సెలవు రోజుల్లో, వేసవిలో మాత్రం రోజంతా క్లాసులు తీసుకుంటారు. ఒకవైపు పిల్లలూ బాగా చదవడమూ... మరోవైపు ఓ మంచి పని కోసం శ్రీనివాస్‌ పడుతున్న కష్టమూ చూసి దాతలూ ముందుకు రావడంతో ట్యూషన్‌ని కాస్తా కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌గా మార్చిందీ సంస్థ. అలా తొమ్మిదీ, పదీ తరగతులతోపాటూ పై చదువులు చదవడానికీ కావాల్సిన కోచింగ్‌ కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. అంతేకాదు... విద్యార్థుల కోసం కంప్యూటర్‌, కెమిస్ట్రీ ల్యాబుల్నీ అందుబాటులోకి తెచ్చింది. రోజూ రాత్రిపూట ఉచిత భోజనమూ, తరగతులు ముగిశాక పిల్లల్ని ఇంటికి దింపడానికి వాహనాల్నీ ఏర్పాటుచేసింది. 

ఉద్యోగం వచ్చేవరకూ...

మంచి స్పందన రావడంతో హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లోని కూకట్‌పల్లి, శంకర్‌పల్లి, చర్లపల్లి, చేవెళ్ల, జహీరాబాద్‌ వంటి ప్రాంతాలకూ ఈ సంస్థ తమ సేవల్ని విస్తరించింది. గదుల్ని అద్దెకు తీసుకుని తరగతులు మొదలుపెట్టింది. కేవలం చదువు చెప్పడమే కాకుండా అవసరమైతే ఫీజు చెల్లించి మరీ పై చదువులు చదువుకునే వీలును కల్పిస్తోంది. ఇంకా భాషా నైపుణ్యాలు అభివృద్ధి చేయడమూ, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌, కెరియర్‌, విద్య కౌన్సెలింగ్‌ల్లాంటివి ఇప్పిస్తూ- ఒక్కమాటలో చెప్పాలంటే మంచి ఉద్యోగంలో స్థిరపడేవరకూ తోడుగా ఉంటుంది. ఇప్పటివరకూ 920 మంది విద్యార్థులు ఈ సంస్థ అందించిన సహకారంతో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. 1200 మంది పదో తరగతి పూర్తి చేశారు. ప్రస్తుతం 469 మంది చదువుకుంటున్నారు.పిల్లలు లేని శ్రీనివాస్‌ ఆయన భార్య శాంతిశ్రీ ఈ పేద పిల్లల్నే కన్నబిడ్డల్లా భావిస్తూ... వాళ్ల జీవితంలో వస్తున్న మంచి మార్పును చూసి మురిసిపోతున్నారు.

- యార్లగడ్డ అమరేంద్ర, ఈనాడు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..