శివ కేశవ క్షేత్రం... పుష్పగిరి

హరిహరులు ఒకేచోట కొలువైన పుణ్యక్షేత్రం పుష్పగిరి. దక్షిణకాశీగా పిలిచే ఈ ఆలయాన్ని శైవ, వైష్ణవ భక్తులందరూ దర్శించుకుంటారు. రాష్ట్రంలో ఏకైక అద్వైతపీఠంగా గుర్తింపుపొందిన ఈ ఆలయం పినాకిని నదికి ఎదురుగా కనిపిస్తూ ప్రకృతి

Updated : 26 Jun 2022 05:15 IST

శివ కేశవ క్షేత్రం... పుష్పగిరి

హరిహరులు ఒకేచోట కొలువైన పుణ్యక్షేత్రం పుష్పగిరి. దక్షిణకాశీగా పిలిచే ఈ ఆలయాన్ని శైవ, వైష్ణవ భక్తులందరూ దర్శించుకుంటారు. రాష్ట్రంలో ఏకైక అద్వైతపీఠంగా గుర్తింపుపొందిన ఈ ఆలయం పినాకిని నదికి ఎదురుగా కనిపిస్తూ ప్రకృతి రమణీయతకు అద్దం పట్టడం విశేషం.

పచ్చని ప్రకృతి మధ్య
కనిపిస్తూ... శిల్పకళావైభవానికి ప్రతీకగా నిలుస్తూ... భక్తులను ఆకట్టుకుంటుంది పుష్పగిరి చెన్నకేశవస్వామి ఆలయం. ఇక్కడ విష్ణుమూర్తి చెన్నకేశవస్వామిగా, పరమేశ్వరుడు చంద్రమౌళీశ్వరుడిగా పూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు. ఏడో శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు దర్శించుకున్నారని చెబుతారు. నిత్యపూజలతో కళకళలాడే ఈ ఆలయం కడపలోని పుష్పగిరిలో ఉంది.  

స్థలపురాణం
ఓసారి కశ్యప మహర్షి భార్యలైన కద్రువ, వినత కలిసి ఆడుకుంటూ.. పందెంలో ఓడిపోయినవారు గెలిచినవారికి దాసిలా పని చేయాలని షరతు పెట్టుకున్నారట. ఆ పందెంలో వినత ఓడిపోవడంతో కద్రువకు దాసిలా పని చేసేదట. వినతకు జన్మించిన గరుత్మంతుడు తన తల్లికి ఆ బానిసత్వం నుంచి విముక్తి కలిగించమని కద్రువను కోరాడట. అప్పుడు కద్రువ తనకు అమృతాన్ని తెచ్చిస్తే వినతకు స్వేచ్ఛను ఇస్తానని చెప్పిందట. దేవేంద్రుడి దగ్గరున్న ఆ అమృతాన్ని గరుత్మంతుడు తెచ్చే క్రమంలో జరిగిన పోరులో రెండు అమృతం చుక్కలు ఈ ప్రాంతంలోని పినాకిని నదిలో పడటంతో ఇందులో స్నానాలు చేసిన వారందరూ మరణం లేకుండా, యుక్తవయస్కుల్లా మారిపోయారట. అది చూసి దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని సంప్రదించారు. విష్ణుమూర్తి ఆ నీటిలో పెద్ద పర్వతం ముక్కను వేసినా అమృతం ప్రభావం వల్ల ఆ నీటిలో రాయి మునగకుండా పుష్పం ఆకారంలో పైకి తేలిందట. దాంతో శివకేశవులు తమ పాదాలతో ఆ రాయిని నీటిలోనే ఉండిపోయేలా తొక్కేశారనీ ఆ తరవాతే హరిహరులు ఇక్కడ వెలిశారనీ... అలా ఈ ప్రాంతానికి  పుష్పగిరి అనే పేరువచ్చిందనీ అంటారు. ఈ ఆలయాన్ని విద్యారణ్యస్వామి నెలకొల్పినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడున్న పంచనదీ సంగమంగా గుర్తింపు పొందిన పినాకిని నది... ఉత్తరం నుంచి దక్షిణం దిశగా కాశీశ్వరాలయంవైపు పయనించడం వల్లే పుష్పగిరిని దక్షిణకాశీగా పిలుస్తారు.

నిత్య పూజలు...
ఈ ఆలయానికి చెన్నకేశవస్వామే క్షేత్రపాలకుడు. ఇక్కడున్న స్వామి నిలువెత్తు విగ్రహం తిరుమలలోని శ్రీవారి విగ్రహం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ ఏడాది మొత్తం జరిగే పూజలు కాకుండా ధనుర్మాసంలో, కార్తికంలో విశేష అభిషేకాలూ, ఉత్సవాలూ జరిపిస్తారు. కొండ మీద ఒకే ఆవరణలో ఉన్న చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం దర్శించుకున్నాక రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ ఉపాలయాలనూ చూడొచ్చు.  

ఎలా చేరుకోవచ్చు
ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారు కడప వరకూ బస్సు లేదా రైల్లో చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాల్లో కర్నూలుకు వెళ్లే రహదారి మార్గంలో ఉప్పరపల్లె మీదుగా 16 కి.మీ. ప్రయాణిస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.

 

- గుండ్రాతి రాజేష్‌గౌడ్‌, ఈనాడు, కడప


ఔపోసన ఎందుకు పడతారు?

భోజనం చేసేముందు కొందరు చేతిలో నీళ్ళు పోసుకుని కంచం చుట్టూ తిప్పి.. చాలా కొద్దిగా నీటిని తీసుకుంటారు. ఇలా చేయడం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి?
భోజనం చేసేముందు కంచం చుట్టూ నీళ్లు చల్లి, కొద్దిగా ఆ నీటిని తీసుకోవడాన్ని ఔపోసన పట్టడం అంటారు. ఇలా చేయడం అనేది ఓ సంప్రదాయమైనా మన మహర్షులు దీనివెనుక ఆరోగ్యసూత్రాలనూ జోడించారని అర్థంచేసుకోవాలి. విస్తరిలో పదార్థాలన్నీ వడ్డించాక గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఆ విస్తరిచుట్టూ నీటిని చల్లి... తరువాత నీటిని కొద్దిగా తాగాకే భోంచేస్తారు. ఇలా చేయడం వల్ల వడ్డించిన పదార్థాలు అమృతంతో సమానంగా మారతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే విస్తరి చుట్టూ చీమల వంటి క్రిమికీటకాల్లాంటివి ఉన్నా తినే భోజనంలోకి చేరవని చెబుతారు. ఇక, ముందుగా కొద్దిగా నీళ్లు తీసుకోవడం వల్ల అన్నవాహిక అన్నం స్వీకరించేందుకు సిద్ధమవుతుంది. లేదంటే కొన్నిసార్లు గొంతుపట్టేసి ఏదైనా ప్రమాదం సంభవించే ఆస్కారం ఉండొచ్చు. అవేవీ జరగకుండా భోంచేయడానికి ముందు పక్కన నీళ్లు తప్పనిసరి అనే నియమం పెట్టేందుకే ఈ సంప్రదాయాన్ని తెచ్చి ఉండొచ్చు మన పూర్వీకులు.

- అన్నదానం చిదంబరశాస్త్రి , ఆధ్యాత్మిక ప్రవచనకర్త
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..