అప్పట్నుంచి దశ తిరిగింది!

మహిళల క్రికెట్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌) వేలంలో అధిక మొత్తం అందుకున్న క్రీడాకారిణి స్మృతి మంధాన. రూ.3.4కోట్లు చెల్లించి బెంగళూరు జట్టు సొంతం చేసుకుందామెను.

Updated : 26 Feb 2023 03:04 IST

అప్పట్నుంచి దశ తిరిగింది!

మహిళల క్రికెట్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌) వేలంలో అధిక మొత్తం అందుకున్న క్రీడాకారిణి స్మృతి మంధాన. రూ.3.4కోట్లు చెల్లించి బెంగళూరు జట్టు సొంతం చేసుకుందామెను. అందం, ఆటల కలబోత అయిన స్మృతి బ్యాటింగ్‌ శైలిలో క్లాస్‌తోపాటు దూకుడూ ఉంటుంది. టీమ్‌ ఇండియా వైస్‌ కెప్టెన్‌ అయిన స్మృతి గురించి మరిన్ని విషయాలు...  


అలా మొదలైంది...

అన్నయ్య క్రికెట్‌ ప్రాక్టీసు చేస్తుంటే తనతోపాటు ఆడేదాన్ని. సహజంగా రైట్‌ హ్యాండర్‌ని. కానీ అన్నయ్యని చూసి లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌ అలవాటు చేసుకున్నా. నాకప్పుడు ఆరేళ్లు ఉంటాయి. ఇంటి సీలింగ్‌కి తాడు కట్టి బంతులు వేలాడదీసి కొడుతూ వంతుల వారీగా బ్యాటింగ్‌ ప్రాక్టీసు చేసేవాళ్లం. అన్నయ్య క్రికెట్‌ వదిలేసినా, నేను కొనసాగుతున్నా.


క్రికెట్‌ మాత్రమే...

బ్యాటింగ్‌ అంటే చాలా ఇష్టం. అర్ధరాత్రి నిద్రలేపినా బ్యాటింగ్‌ చేస్తా. మ్యాచ్‌ ఉన్నా లేకపోయినా ఉదయాన్నే లేచి బ్యాట్‌ పట్టుకుంటా. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టి పదేళ్లయింది. తర్వాత ‘ఇంకేదైనా చేయాలనుకుంటున్నావా?’ అని అమ్మ అడిగితే.. క్రికెట్‌ తప్ప ఇంకే ఆసక్తులూ లేవని చెప్పా.


నిద్ర ఉంటే చాలు...

ఇష్టమైన ఆటలు... క్రికెట్‌ కాకుండా ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ ఫాలో అవుతా  కానీ ఆడలేను. టేబుల్‌ టెన్నిస్‌ ఆడతా.
ఇష్టమైన క్రికెటర్లు... కుమార సంగక్కర, మైఖేల్‌ హెడెన్‌, సచిన్‌ తెందూల్కర్‌.
విరామం దొరికితే... ఎక్కువగా నిద్రపోతా. సినిమాలు చూస్తా. వీడియో గేమ్స్‌ ఆడతా.


సిక్సర్లపైన దృష్టి...

టీ20 క్రికెట్‌ ఆడటం పెరిగాక సిక్సర్లు కొట్టడం అనివార్యమైంది. 2018లో నెలపాటు సిక్సర్లు కొట్టడంపైన కోచ్‌ అనంత్‌ తంబవేకర్‌ ఆధ్వర్యంలో ప్రాక్టీసు చేశా. మొదట 30 గజాలు దాటించడంపైన దృష్టిపెట్టా. తర్వాత దూరం పెంచుకుంటూ పోయా. ఇప్పుడు ధైర్యంగా, నమ్మకంగా సిక్స్‌ కొట్టగలను.


లీగ్‌లతో గుర్తింపు

ఇదివరకు అమ్మాయిల్ని క్రికెట్‌లో కొనసాగించాలా వద్దా అని సందేహం ఉండేది తల్లిదండ్రులకి. ఇప్పుడు మగవాళ్లతో సమానంగా ఫీజు ఇస్తోంది బీసీసీఐ. లీగ్‌లతోనూ గుర్తింపు వస్తోంది. దాంతో వారి ఆలోచనల్లో మార్పు వస్తోంది.


రెండు జట్లలోనూ...

గల్లీ క్రికెట్‌ ఆడేటప్పుడు జోకర్‌గా పెట్టేవారు. దాంతో రెండు టీమ్‌ల తరఫునా బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. నాకు డబుల్‌ ప్రాక్టీసు అన్నమాట. 11 ఏళ్లకే మహారాష్ట్ర అండర్‌-19 జట్టుకి ఎంపికయ్యా. చిన్నప్పుడు టీవీలో మ్యాచ్‌లు చూసింది లేదు. సీనియర్‌ జట్టులోకి అడుగుపెట్టాక మైదానంలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కొన్ని మ్యాచ్‌లు టీవీలో చూపించారు నాన్న.


డబుల్‌ సెంచరీతో...

16 ఏళ్లకే మహారాష్ట్ర తరఫున ఆడుతూ గుజరాత్‌పైన అండర్‌-19 మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ కొట్టా. అన్నయ్యకి రాహుల్‌ ద్రవిడ్‌ సర్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌ అది. ఆ తర్వాత నుంచి నా దశ తిరిగింది.


విదేశీ లీగ్‌లు... పాఠాలు...

2016లో మహిళల బిగ్‌ బాష్‌ లీగ్‌కు ఎంపికయ్యా. తర్వాత ఇంగ్లండ్‌లో సూపర్‌ లీగ్‌ ఆడా. విదేశాల్లో లీగ్‌లు ఆడటంవల్ల చాలా నేర్చుకున్నా. ఇక్కడ హాస్టల్‌ జీవితం అలవాటు లేదు. విదేశాల్లో ఆడటంవల్ల వంట చేయడం, రూమ్‌ శుభ్రపరచుకోవడం, ఖర్చులు చూసుకోవడం, ప్రయాణ ప్రణాళికలు వేసుకోవడం... ఇవన్నీ అలవాటయ్యాయి. వ్యక్తిగా నేనెంతో నేర్చుకున్నా.


మానసిక ఆరోగ్యం ముఖ్యం...

ఉదయాన్నే యోగా, మ్యాచ్‌కు  ముందు ధ్యానం చేస్తా.  సున్నాకే అవుటైనా, సెంచరీ చేసినా  నా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. వర్కవుట్‌లూ, ప్రాక్టీసూ,  నేర్చుకోవడంపైనే దృష్టి ఉంటుంది.  మొదట్లో బ్యాటింగ్‌ ప్రాక్టీసుకే ప్రాధాన్యం ఇచ్చేదాన్ని. ఇప్పుడు... ఫిట్‌నెస్‌కూ టైమ్‌ కేటాయిస్తున్నా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..