ఏ దేశమేగినా..!

ప్రపంచంలోని భారతీయులందరినీ ఒకచోట చేర్చే వేడుకే ప్రవాస భారతీయ దినోత్సవం. ఈసారి ఈ వేడుకలు (జనవరి 8-10) ఇందౌర్‌ వేదికగా జరుగుతున్నాయి.

Updated : 08 Jan 2023 04:09 IST

ఏ దేశమేగినా..!

ప్రపంచంలోని భారతీయులందరినీ ఒకచోట చేర్చే వేడుకే ప్రవాస భారతీయ దినోత్సవం. ఈసారి ఈ వేడుకలు (జనవరి 8-10) ఇందౌర్‌ వేదికగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుల గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు...

భారత విదేశాంగశాఖ లెక్కల ప్రకారం 3.2 కోట్ల మంది భారతీయులూ, భారతీయ మూలాలున్న వారు విదేశాల్లో ఉన్నారు. వారిలో 1.8 కోట్ల మంది తాము ఉంటోన్న దేశ పౌరసత్వం తీసుకోగా, 1.4 కోట్ల మంది భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

* ప్రవాస భారతీయులు అత్యధికంగా ఉన్న మొదటి మూడు దేశాలు... యూఏఈ (35 లక్షలు), అమెరికా (27 లక్షలు), సౌదీ అరేబియా (25 లక్షలు).


* ప్రవాస భారతీయులూ, భారత సంతతి వారూ కలిపి ఎక్కువగా ఉన్నది మాత్రం అమెరికాలో. వీరి సంఖ్య 45 లక్షలు. ఆ దేశ జనాభాలో వీరిది 1.2శాతం.

* ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 2022లో ప్రవాసులు స్వదేశానికి పంపిన మొత్తం రూ.8.2 లక్షల కోట్లు. ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్‌ది అగ్ర స్థానం. గతానికి భిన్నంగా ప్రస్తుతం- గల్ఫ్‌ దేశాల నుంచి కాకుండా అమెరికా, కెనడా, యూకే, సింగపూర్‌ లాంటి దేశాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచి ఎక్కువ మొత్తం వస్తోంది. ఆరు గల్ఫ్‌ దేశాల నుంచి 28 శాతం వస్తుండగా ఒక్క అమెరికా నుంచే 23శాతం వస్తోంది.

* జో బైడెన్‌ ప్రభుత్వంలో 130 మందికిపైగా భారతీయులు ఉన్నతోద్యోగాల్లో ఉన్నారు. ఆర్థికం నుంచి ఆరోగ్యం వరకూ అనేక విభాగాల్ని వీరు నడిపిస్తున్నారు.

* భారతీయుల్ని ఎక్కువగా కలవరపెడుతున్న అంశం... మేధో వలస. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లెక్కల ప్రకారం వలసపోతున్న నిపుణులూ, విద్యావంతుల్లో భారతీయులే ఎక్కువ. భారత్‌ నుంచి 100 మంది విదేశాలకు వెళ్తే వారిలో 65 శాతం నిపుణులూ, విద్యావంతులే. 2000-2020 మధ్య కోటి మంది భారత్‌ను విడిచి వెళ్లారు.  

* ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్న మన విద్యార్థుల సంఖ్య సుమారు 12 లక్షలు. 2024 చివరికి వీరి సంఖ్య 18లక్షలు ఉంటుందని రెడ్‌స్ట్రీట్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్‌ సంస్థ చెబుతోంది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్తోన్న దేశాలు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూకే. వీరిలో అధిక శాతం అక్కడే స్థిరపడటం గమనార్హం.  

ప్రవాసుల్లో సగం మంది- అంటే సుమారు 90 లక్షలు గల్ఫ్‌ దేశాల్లో ఉన్నారు. యూఏఈలో 35 లక్షలు, సౌదీ అరేబియాలో 27 లక్షలు, కువైట్‌ 10 లక్షలు, ఖతార్‌ 7.5 లక్షలు, ఒమన్‌ 7.8లక్షలు ఉన్నారు. ఖతార్‌లో నివసిస్తున్నవారిలో భారతీయులు 25 శాతం.

* ఆస్ట్రేలియన్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌- 2021 జనాభా లెక్కల ప్రకారం ఆ దేశంలో భారతీయ మూలాలున్న వారు.. 7,83,958. జనాభాలో వీరు 3.1 శాతం. చైనా, న్యూజిలాండ్‌లను అధిగమించి అత్యధికంగా వలస వచ్చింది భారతీయులే.


రాజకీయ శక్తి...

భారతీయ మూలాలున్న వ్యక్తులు వివిధ దేశాల్లో రాజకీయంగానూ ఉన్నత పదవుల్లో ఉన్నారు.
1. రిషి సునాక్‌, బ్రిటన్‌ ప్రధాన మంత్రి
2. కమలా హ్యారిస్‌, అమెరికా ఉపాధ్యక్షురాలు
3. ఆంటోనియో కోస్టా, పోర్చుగల్‌ ప్రధాని
4. మహమ్మద్‌ ఇర్ఫాన్‌, గయానా అధ్యక్షుడు
5. ప్రవీంద్‌ జగన్నాథ్‌, మారిషస్‌ ప్రధాని
6. పృథ్వీరాజ్‌సింగ్‌ రూపన్‌, మారిషస్‌ అధ్యక్షుడు
7. చంద్రికాప్రసాద్‌ సంతోఖి, సురినామ్‌ అధ్యక్షుడు
8. లియో వరాద్కర్‌, ఐర్లాండ్‌ ప్రధాన మంత్రి
9. హాలిమా యాకబ్‌, సింగపూర్‌ అధ్యక్షురాలు
10. వేవెల్‌ రామ్‌కాలవన్‌, సీషెల్స్‌ అధ్యక్షుడు


2003 నుంచి జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1915లో మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చింది ఈ తేదీనే.  


వ్యాపార నాయకత్వం..

ప్రముఖ బహుళజాతి కంపెనీల్ని నడిపిస్తోన్న భారతీయ సీఈఓల్లో కొందరు...
1. సత్య నాదెళ్ల- మైక్రోసాఫ్ట్‌
2. సుందర్‌ పిచ్చయ్‌- ఆల్ఫాబెట్‌ (గూగుల్‌)
3. లక్ష్మణ్‌ నరసింహన్‌- స్టార్‌బక్స్‌
4. లీనా నాయర్‌- షనెల్‌,
5. శంతను నారాయణ్‌- అడోబీ
6. అర్వింద్‌ కృష్ణ-  ఐబీఎమ్‌
7. గుంజన్‌ షా-  బాటా
8. వసంత్‌ నరసింహన్‌- నోవార్టిస్‌
9. రేవతి అద్వైతి-  ఫ్లెక్స్‌
10. పునీత్‌ రంజన్‌- డెలాయిట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు