రోజూ... ఉచితంగా... ఎన్టీఆర్‌ సినిమా!

తెనాలి పట్టణంలోని పెమ్మసాని థియేటర్‌... సమయం ఉదయం ఎనిమిది గంటలు... సిబ్బంది గేటు తీయగానే లోపలకు పరుగుతీశారు ప్రేక్షకులు. ఈ హడావుడి ఏదో రిలీజ్‌ సినిమా చూడ్డానికి కాదు, తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు నటించిన అలనాటి మేటి చిత్రాలు వీక్షించడానికి.

Updated : 16 Jan 2023 12:16 IST

రోజూ... ఉచితంగా... ఎన్టీఆర్‌ సినిమా!

తెనాలి పట్టణంలోని పెమ్మసాని థియేటర్‌... సమయం ఉదయం ఎనిమిది గంటలు... సిబ్బంది గేటు తీయగానే లోపలకు పరుగుతీశారు ప్రేక్షకులు. ఈ హడావుడి ఏదో రిలీజ్‌ సినిమా చూడ్డానికి కాదు, తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు నటించిన అలనాటి మేటి చిత్రాలు వీక్షించడానికి. తెనాలితో పాటు గుంటూరు జిల్లా నలుమూలల నుంచీ వచ్చారు వాళ్లంతా. ఏడు నెలలుగా అక్కడ రోజూ కనిపించే దృశ్యం ఇది. ఇదంతా ఎందుకంటే..

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనుకుంది తెలుగుదేశం పార్టీ. ఈ వేడుకల్ని తెనాలిలో కనీవినీ ఎరగని రీతిలో చేయాలనుకున్నారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌. ఈ విషయాన్ని తెనాలికే చెందిన తన మిత్రుడు, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌తో చర్చించారు. వీరికి ఎన్టీఆర్‌ అభిమాని, నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు తోడయ్యారు. ముగ్గురూ ఉత్సవాల ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చెప్పారు. ఆయన సమ్మతించడంతో ఉత్సవ కమిటీ ఏర్పాటైంది.

రోజుకో సినిమా..

ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌ నటించిన చిత్రాలను ఏడాది పొడవునా ప్రేక్షకుల కోసం ప్రదర్శించాలని నిర్ణయించారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న సుమారు 280కు పైగా చిత్రాలను నేటి థియేటర్లలో ప్రదర్శనకు వీలుగా డిజిటలైజేషన్‌ ప్రక్రియకు గత జనవరిలో శ్రీకారం చుట్టారు. ప్రదర్శనకు పెమ్మసాని(రామకృష్ణ) థియేటర్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ ఎన్టీఆర్‌ విగ్రహాల్నీ, కటౌట్‌నీ ఏర్పాటుచేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఉచితంగా సినిమాలు ప్రదర్శిస్తారు. శని-ఆదివారాల్లో స్థానిక కల్యాణ మండపంలో ఎన్టీఆర్‌ నట, రాజకీయ ప్రస్థానంలోని వివిధ అంశాలపైన ప్రసంగాలు ఉంటాయి. అదే విధంగా రోజూ కళాకారుల్నీ, సాహితీవేత్తలనీ సత్కరిస్తారు. నెలలో ఒక రోజు స్త్రీ, పురుష కళాకారులకు వేర్వేరుగా ఎన్టీఆర్‌ శతాబ్ది రంగస్థల పురస్కారాలనూ, ఒకరికి చలనచిత్ర పురస్కారాన్నీ అందిస్తారు. ప్రతి నెలా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాల నిర్వహణకు ఆర్థిక సహకారం అందించే, కార్యక్రమాల్ని పర్యవేక్షించే బాధ్యతల్ని ఆలపాటి తీసుకోగా, మిగతా అంశాల్ని సాయిమాధవ్‌, వెంకటేశ్వరరావులతోపాటు మరికొంతమంది ప్రతినిధులు పంచుకున్నారు. బాలకృష్ణ ముఖ్య అతిథిగా 2022 మే 28న ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలకు తెనాలిలో తెరలేచింది. ఆరోజు శ్రీవేంకటేశ్వర మహత్యంతో ప్రారంభించి- ఆత్మబంధువు, డ్రైవర్‌ రాముడు, బడిపంతులు, పాతాళభైరవి, మల్లీశ్వరి, భూకైలాస్‌, తెనాలి రామకృష్ణ... లాంటి అద్భుతమైన చిత్రాలెన్నో ప్రదర్శిస్తూ వస్తున్నారు.

అభిమానుల కోలాహలం...

సినిమాలు చూడ్డానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు బస్సు పాసులు తీసుకుని మరీ రావడం గమనార్హం. అనంతపురం జిల్లాకు చెందిన ఒక పెద్దాయన తెనాలిలోని బంధువుల ఇంట్లో ఉంటూ మనవరాలి సాయంతో థియేటర్‌కు వస్తున్నారు. ఆయనకు చూపు పూర్తిగా క్షీణించింది. చూడలేకపోయినా ఎన్టీఆర్‌ డైలాగులు వింటే చాలు తనకు ఎంతో తృప్తి అంటారు. పట్టణానికే చెందిన ఒక మహిళా అభిమాని రోజూ తప్పకుండా థియేటర్‌కు వచ్చి సినిమాలు చూసి, ఆ వివరాలూ, అనుభవాల్ని డైరీలో రాసుకుంటున్నారు. ఇలా ఒక్కో అభిమానిది ఒక్కో చిత్రమైన కథ. ఇప్పటివరకూ సినీ రంగ ప్రముఖులు ప్రభ, అశ్వనీదత్‌, రాఘవేంద్రరావు, జయసుధ, జయప్రద, ఎల్‌.విజయలక్ష్మి, మురళీమోహన్‌, జయచిత్ర, ఘంటసాల వెంకటేశ్వరరావు తరఫున ఆయన కుమారుడు శంకర్‌ తదితరులు తెనాలి వచ్చి పురస్కారాలు అందుకున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మొదలు పలువురు రాజకీయ నాయకులూ, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులూ వేడుకల్లో పాలుపంచుకున్నారు.

సినిమాలూ, సాంస్కృతిక కార్యక్రమాలూ, ప్రముఖుల రాకపోకలతో తెనాలిలో రోజూ ఎన్టీఆర్‌ పేరూ వినిపిస్తూనే ఉంది. ఆయన వ్యక్తిత్వం, విశిష్టతల గురించి చిన్నాపెద్దా చర్చిస్తూనే ఉన్నారు. ఇక్కడి ఉత్సవాల ప్రేరణతో తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని చోట్లా ఇలాంటి కార్యక్రమాల్ని చేయాలని చూస్తున్నారు ఎన్టీఆర్‌ అభిమానులు. ఈ ఏడాది మే 28న ముగింపు వేడుకలను భారీగా నిర్వహించనున్నారు. తెలుగు వారికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను నిర్వహించటం మనందరి బాధ్యతని చెబుతోన్న నిర్వాహకులు.. ఏడాదిపాటు చిత్రాల ప్రదర్శన అంశాన్ని గిన్నిస్‌ రికార్డుల్లో ఎక్కించేందుకూ ప్రయత్నిస్తున్నారు!

షేక్‌.అబ్దుల్‌ తాజుద్దీన్‌, న్యూస్‌టుడే, తెనాలి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..