ఇవి తింటే... ప్లేట్‌లెట్స్‌ పదిలం!

డెంగీ... ఈ జ్వరం పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారు జనం. పరీక్షలు చేయించడం ఆలస్యం... ఆసుపత్రిలో చేరక తప్పని పరిస్థితి... ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోవడమే ఇందుకు కారణం. కేవలం ఈ ఒక్క జ్వరం అనే కాదు, కొవిడ్‌ వచ్చినా ఇతరత్రా ఇన్ఫెక్షన్లు సోకినా ఈ రక్తకణాల సంఖ్య ఒక్కసారిగా పడిపోవచ్చు.

Updated : 23 Nov 2022 10:09 IST

ఇవి తింటే... ప్లేట్‌లెట్స్‌ పదిలం!

డెంగీ... ఈ జ్వరం పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారు జనం. పరీక్షలు చేయించడం ఆలస్యం... ఆసుపత్రిలో చేరక తప్పని పరిస్థితి... ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోవడమే ఇందుకు కారణం. కేవలం ఈ ఒక్క జ్వరం అనే కాదు, కొవిడ్‌ వచ్చినా ఇతరత్రా ఇన్ఫెక్షన్లు సోకినా ఈ రక్తకణాల సంఖ్య ఒక్కసారిగా పడిపోవచ్చు. అందుకే అవి తగ్గకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆహారపదార్థాలను విధిగా తీసుకోమని చెబుతున్నారు పోషక నిపుణులు. అవేమంటే..!

ఒకప్పటితో పోలిస్తే- కారణాలేమయినప్పటికీ ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గిపోవడం అన్నది ఈమధ్యే ఎక్కువగా వినిపిస్తోంది. కొవిడ్‌, చికున్‌గన్యా, డెంగీ... వంటి వైరల్‌ జ్వరాలు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, లుకీమియా, ఆల్కహాల్‌ అతిగా తీసుకోవడం, కాలేయ, ప్లీహ సమస్యలతోపాటు కొన్ని రకాల మందులు వాడినప్పుడూ ఈ ప్లేట్‌లెట్స్‌ పడిపోవడం జరుగుతుంటుంది.  
ప్లేట్‌లెట్స్‌... ఇవీ ఒక రకం రక్త కణాలే. వీటినే థ్రాంబోసైట్స్‌ అనీ పిలుస్తారు. ఎర్ర రక్తకణాలు శరీరమంతా ఆక్సిజన్‌ అందేలా చేస్తే, తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తాయి. ఇక, ప్లేట్‌లెట్స్‌ రక్తం గడ్డకట్టడానికి దోహదపడతాయి. మైక్రోలీటరు రక్తంలో లక్షన్నర నుంచి నాలుగున్నర లక్షల వరకూ ప్లేట్‌లెట్స్‌ ఉంటాయి. ఇవి దాదాపుగా 5-10 రోజులు మాత్రమే జీవిస్తాయి. ఈ ప్లేట్‌లెట్స్‌ ఎప్పటికప్పుడు ఎముక మజ్జ నుంచి ఉత్పత్తి అవుతూ రక్తంలో కలుస్తుంటాయి. రోగనిరోధక వ్యవస్థలో భాగంగా ఇవీ ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి. అయితే వైరస్‌ తీవ్రత ఎక్కువయ్యేకొద్దీ ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గిపోతుంటుంది. కనీస సంఖ్య లక్షన్నర నుంచి బాగా తగ్గితే - అంటే సుమారు యాభై వేలకన్నా తక్కువకి పడిపోతే నీరసం, కళ్లు తిరిగి పడిపోవడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చర్మంమీద రాషెస్‌ రావడం, విరేచనం నల్లగా అవ్వడం... వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రకమైన పరిస్థితినే థ్రాంబొసైటొపీనియాగా పిలుస్తారు. వీటి సంఖ్య ఇంకా తగ్గిపోతే మెదడు, పేగు, కండర భాగాల్లో రక్తం కారి, ప్రాణానికే ప్రమాదంగా పరిణమిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్లేట్‌లెట్స్‌ ఎక్కించడం అనేది తప్పనిసరి. అందుకే ఆయా జ్వరాల బారినపడ్డప్పుడు- ముందుగానే పోషకాలన్నీ ఉండే కొన్ని ఆహారపదార్థాలని విధిగా తీసుకుంటే ప్లేట్‌లెట్స్‌కి ఢోకా ఉండదు అంటున్నారు పోషక నిపుణులు.


బొప్పాయి

డెంగీ జ్వరాలతో ఆమధ్య బొప్పాయికి ఎక్కడలేని గిరాకీ ఏర్పడటం తెలిసిందే. అయితే పండుకన్నా ఈ చెట్టు ఆకుల్లో ఉన్న కైమోపపైన్‌, పపైన్‌లు హీమోగ్లోబిన్‌తోపాటు రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్యను త్వరగా పెంచినట్లు మలేషియాలోని ‘ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’కి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. డెంగీతో దెబ్బతిన్న కాలేయ పనితీరునీ మెరుగుచేస్తాయివి. అందుకే ఈ మొక్క లేత ఆకుల్ని మరిగించి ఆ రసాన్ని టేబుల్‌స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య ఒక్కరోజులోనే పెరిగిందట. 68 వేలకు పడిన వీటి సంఖ్య కేవలం పన్నెండు గంటల్లోనే రెండు లక్షలకు చేరినట్లు కొన్ని పరిశీలనలు చెబుతున్నాయి. దాంతో ఈ ఆకుల రసంతో చేసిన సప్లిమెంట్లూ వస్తున్నాయి. పచ్చి బొప్పాయి తిన్నా మేలు జరుగుతుంది. అలాగే బొప్పాయి పండ్లలోని సి-విటమిన్‌ వల్ల కూడా ఫలితం ఉంటుంది అంటున్నారు కొందరు వైద్య నిపుణులు.


దానిమ్మ

ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతోపాటు ఐరన్‌ మెండుగా ఉండటంతో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గకుండా ఉంటుంది. రోజూ ఓ గ్లాసు దానిమ్మ రసాన్ని కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా తాగితే రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.


గోధుమ గడ్డి

యూనివర్సల్‌ ఫార్మసీ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌కు చెందిన నిపుణులు గతంలో చేసిన ఓ అధ్యయనంలో గోధుమ గడ్డి కారణంగా ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరిగినట్లు తేలింది. దీనివల్ల ఎర్ర రక్తకణాలు, హీమోగ్లోబిన్‌, తెల్ల రక్త కణాల సంఖ్య కూడా పెరిగిందట. ఇందులో అధికంగా ఉండే క్లోరోఫిల్‌ హీమోగ్లోబిన్‌ నిర్మాణాన్ని పోలి ఉండి, అచ్చం దానిలానే పనిచేస్తుందట. అందుకే అరకప్పు గోధుమ గడ్డి రసంలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని పిండుకుని రోజూ తాగితే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరుగుతుంది అంటున్నారు. ముఖ్యంగా కీమోథెరపీ సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.


పాలు

కాల్షియం, ప్రొటీన్‌ పుష్కలంగా ఉండే పాలు ఎముకలూ కండరాల వృద్ధికి తోడ్పడితే, పాలల్లోని కె-విటమిన్‌ రక్తం గడ్డకట్టేందుకు సాయపడుతుంది. కాబట్టి రోజూ గ్లాసు పాలు తాగితే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరగడం ఖాయం అంటున్నాయి మరికొన్ని పరిశీలనలు. అలాగే డి-విటమిన్‌, ఫోలేట్‌ పుష్కలంగా ఉండటం వల్ల పాలు తాగితే రోగనిరోధకశక్తీ పెరుగుతుంది.


డ్రాగన్‌ ఫ్రూట్‌

డెంగీ వైరస్‌ రక్తాన్ని గడ్డ కట్టించే థ్రాంబిన్‌ను అడ్డుకోవడంతో అంతర్గత అవయవాల్లో బ్లీడింగ్‌ సమస్యలు తలెత్తుతాయి. అవి లేకుండా చేయగల శక్తి డ్రాగన్‌ ఫ్రూట్‌కు ఉంది అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లూ ఫైటోన్యూట్రియంట్లూ లైకోపీన్‌ పీచూ ఐరన్‌ శాతం ఎక్కువ. కాబట్టి డ్రాగన్‌ పండు వ్యాధి తీవ్రతని తగ్గిస్తుంది. ఎరుపురంగు డ్రాగన్‌ తొక్కతో చేసిన పెరుగు తినడంవల్ల హీమోగ్లోబిన్‌, ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగినట్లు ఎలుకలపై చేసిన పరిశీలనలోనూ తేలిందట.


కివీ

ఇందులో ప్రొటీన్‌, కాల్షియం, పొటాషియంతోపాటు సి, కె, ఇ విటమిన్లు పుష్కలం. కాబట్టి రక్తహీనత, బి-విటమిన్‌ లోపంతోనూ వైరల్‌ ఇన్ఫెక్షన్లతోనూ బాధపడేవాళ్లు రోజుకి రెండు కివీ పండ్లను తినడం వల్ల ఫలితం ఉంటుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోకుండానూ కాపాడుతుందీ పండు.


ఉసిరి

సి-విటమిన్‌ సమృద్ధిగా ఉండే ఉసిరి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. తద్వారా రక్తంలో ప్లేట్‌లెట్లూ వృద్ధి చెందుతాయి. అందుకే డెంగీ జ్వర బాధితులకి కాస్త ఉసిరి రసాన్ని పట్టిస్తే ఫలితం ఉంటుంది. లేదా పరగడుపున మూడూనాలుగు ఉసిరికాయల్ని నేరుగానో లేదా జామ్‌ రూపంలోనో తీసుకున్నా మేలేనట.


ఎండుద్రాక్ష

రక్తంలో ఎర్ర రక్తకణాలతోపాటు ప్లేట్‌లెట్లూ పెరగడానికి ఐరన్‌ ఎంతో అవసరం. కాబట్టి ఇది అధికంగా ఉండే ఎండుద్రాక్షను రాత్రంతా నానబెట్టి స్మూతీ రూపంలోగానీ పాలల్లోగానీ వేసుకుని తింటే అన్ని విధాలా మంచిది.


చేప నూనెలు

ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే చేపల్నీ అవిసె గింజల్నీ ఆహారంగాగానీ లేదా వాటి నూనెల్ని సప్లిమెంట్ల రూపంలోగానీ తీసుకుంటే- ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరిగినట్లు థండర్‌ బే రీజినల్‌ హెల్త్‌ సెంటర్‌కు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు.


గుమ్మడి

ఇందులో అధికంగా ఉండే ఎ-విటమిన్‌ శరీర కణాలు ఉత్పత్తి చేసే ప్రొటీన్లను సమన్వయపరుస్తుంది. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ పెరగడానికి ఈ ప్రక్రియ ఎంతో అవసరం. అందుకే తాజా గుమ్మడిపండు రసంలో కాస్త తేనె వేసుకుని అరకప్పు చొప్పున రోజుకి రెండుసార్లు తీసుకున్నా లేదా స్మూతీలూ సూప్‌ల రూపంలో తాగినా తక్షణ ఫలితం ఉంటుంది.


తిప్పతీగ

మధుమేహానికి మంచి మందుగా పనిచేసే ఈ తీగ, కొమ్మలరసం ప్లేట్‌లెట్ల సంఖ్యనీ పెంచుతుంది అంటోంది ఆయుర్వేదం. ఇందులోని ఫైటో కెమికల్స్‌ రోగనిరోధకశక్తిని పెంచడం ద్వారా జ్వరతీవ్రతని తగ్గిస్తాయట.


ఆహార పదార్థాలతోపాటు కొన్ని విటమిన్లూ ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచేందుకు తోడ్పడతాయి. అవేమంటే..
సి-విటమిన్‌: ఇది ఎక్కువగా ఉండే పండ్లూ కూరగాయలూ ఏవైనాగానీ ఐరన్‌ శోషణను పెంచడం ద్వారా రక్తకణాల వృద్ధికి తోడ్పడతాయి. సి-విటమిన్‌ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి, హానికర ఫ్రీ-రాడికల్స్‌ నుంచి ప్లేట్‌లెట్స్‌ను రక్షిస్తుంది. అందుకే రోజుకి 65-90 మి.గ్రా. సి-విటమిన్‌ శరీరానికి అందేలా చూసుకోవాలి. కాబట్టి నిమ్మ, పాలకూర, బ్రకోలీ, నారింజ, క్యాప్సికమ్‌... వంటి వాటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే సరి.

కె-విటమిన్‌: ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతే రక్తంలో గడ్డ కట్టే లక్షణం తగ్గిపోతుంది. కాబట్టి వాటి సంఖ్య తగ్గుతుందనిపిస్తే కె-విటమిన్‌ లభించే కేల్‌, మెంతికూర, పాలకూర, బ్రస్సెల్‌ స్ప్రౌట్స్‌, లివర్‌, మాంసం, క్యాబేజీ... వంటివి తింటే మేలు. కప్పు కేల్‌ నుంచి 547 మైక్రోగ్రాముల కె-విటమిన్‌ లభిస్తుంది.
బి12: రక్తకణాల్ని ఆరోగ్యంగా ఉంచడంలో దీని పాత్ర కీలకం.  ఇది తగ్గితే రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యా తగ్గుతుంది. కాబట్టి బి12 అధికంగా ఉండే పాలు, చీజ్‌తోపాటు గుడ్లూ, కాలేయం, సాల్మన్‌, ట్యునా... వంటి చేపల్నీ తినాలి.

డి-విటమిన్‌: ఎముక మజ్జలో రక్తకణాల ఉత్పత్తికి ఇది తోడ్పడుతుంది
అని ప్లేట్‌లెట్‌ డిజార్డర్‌ సపోర్ట్‌ అసోసియేషన్‌ పేర్కొంటోంది. కాబట్టి చేపలు, ఫోర్టిఫైడ్‌ పాలు, పెరుగు, పుట్టగొడుగులు తీసుకుంటే మేలు. ఎ-విటమిన్‌ పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌, క్యారెట్ల రసాన్ని వారానికి రెండుసార్లు తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యకి ఎలాంటి ఢోకా ఉండదట. అలాగే ఫోలేట్‌ పుష్కలంగా ఉండే రాజ్మా, నారింజ, వేరుసెనగ, బఠాణీలు తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గకుండా ఉంటుంది. ఈ విటమిన్లను ఆహారం రూపంలో పూర్తిగా తీసుకోలేనివాళ్లు కొంతకాలంపాటు సప్లిమెంట్ల రూపంలో తీసుకున్నా త్వరగా కోలుకోవచ్చు మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..