సంతానాన్ని ప్రసాదించే వెంకన్న!

కలియుగ దైవమైన వేంకటేశ్వరుడు... భూమిపైన తొలిసారి అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతమే పాలకొండ్రాయుడి క్షేత్రం. పిల్లల్ని ప్రసాదించే సంతాన ప్రభువుగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిశాడని చెబుతారు.

Published : 08 Oct 2022 23:38 IST

సంతానాన్ని ప్రసాదించే వెంకన్న!

కలియుగ దైవమైన వేంకటేశ్వరుడు... భూమిపైన తొలిసారి అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతమే పాలకొండ్రాయుడి క్షేత్రం. పిల్లల్ని ప్రసాదించే సంతాన ప్రభువుగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిశాడని చెబుతారు.

చుట్టూ పచ్చని కొండలు... జాలువారే జలపాతాల మధ్య కొలువై భక్తుల కోర్కెలు తీర్చే వరదుడిగా పూజలు అందుకుంటున్నాడు పాలకొండ్రాయుడు. వేంకటేశ్వరస్వామే పాలకొండ్రాయుడిగా ఇక్కడ వెలిశాడని అంటారు. కడప నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో కొలువైన స్వామిని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు... తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు.  
స్థలపురాణం
ఓసారి భృగు మహర్షి త్రిమూర్తులను దర్శించుకోవాలనుకున్నాడు. మొదట బ్రహ్మ-సరస్వతి దగ్గరకు వెళ్తే ఆ ఇద్దరూ మహర్షిని పట్టించుకోలేదు. ఆ తరువాత కైలాసానికి వెళ్లినా అదే అవమానం ఎదురుకావడంతో ఆగ్రహానికి గురైన భృగు చివరకు వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేవలను అందుకుంటూ శేషతల్పంపైన విశ్రాంతి తీసుకుంటున్నాడట. ఎన్నిసార్లు పిలిచినా స్వామి స్పందించకపోవడంతో కోపోద్రిక్తుడైన భృగు మహర్షి మహావిష్ణువు వక్షస్థలంపైన తన్నాడు. దాంతో నారాయణుడు భృగుని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తూనే ఆ రుషి పాదాలను నొక్కడం ప్రారంభించాడట. ఆ రుషి అరిపాదంలో మూడో కన్ను ఉండటం వల్లే భృగుకి అహంకారం ఎక్కువని అంటారు. అందుకే అతని అరి పాదంలోని మూడోకంటిని చిదిమేశాడు. దాంతో భృగులోని అహంకారం పూర్తిగా తొలగిపోవడంతో విష్ణుమూర్తిని క్షమాభిక్ష అర్థించి, తాను నిత్యం స్వామి సేవలో తరించేందుకు వీలుగా నదిలా మార్చమని కోరి వెళ్లిపోయాడట. ఆ తరువాత లక్ష్మీదేవి... తాను నివసించే వక్షస్థలంపైన ఓ మహర్షి తన్నడాన్ని సహించలేక వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోయింది. దాంతో శ్రీహరి దేవిని వెతుక్కుంటూ భూలోకం బయలుదేరాడు. అలా స్వామి మొదటిసారి ఈ ప్రాంతంలో పాదం మోపి శిలగా మారాడని కథనం. తన దేవేరిని వెతుకుతూ అడవులన్నీ తిరిగిన స్వామి ఓ లోయలో పడిపోవడంతో మహావిష్ణువు కోసం బ్రహ్మ, శివుడు ఆవు-దూడ రూపాల్లో వచ్చి స్వామికి పాలు అందించి ఆకలి తీర్చారనీ... అందుకే ఈ ప్రాంతానికి పాలకొండలు అనే పేరు వచ్చిందనీ అంటారు. అప్పటినుంచీ నారాయణుడిని పాలకొండ్రాయుడిగా పిలుస్తున్నారు. అలాగే క్షీరసాగర మథనం సమయంలో కొన్ని పాల చుక్కలు ఈ కొండపైన పడటం వల్ల ఈ ప్రాంతానికి క్షీరశైలమనే పేరు వచ్చిందని మరో కథనం ఉంది. ఈ ఆలయానికి సమీపంలో భృగుమహర్షి నదిలా ఏర్పడి భృగువంకగా మారాడని అంటారు. క్రమంగా అదే బుగ్గవంకగా మారిందనీ.. ఆ నది నీళ్లే అటు దేవుని కడపలో రాయుడినీ, ఇటు పాలకొండ్రాయుడినీ అభిషేకిస్తున్నాయనీ చెబుతారు.

పిల్లలకు స్వామి పేరు...
ఇక్కడ పాలకొండ్రాయుడి మూర్తితోపాటు పద్మావతీదేవినీ, నవగ్రహాలనూ, ఉగ్ర నారసింహుడినీ దర్శించుకోవచ్చు. సంతానం లేనివారు పుష్కరిణిలో స్నానం చేసి తడి వస్త్రాలతో స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందనీ... అలా పుట్టిన పిల్లలకు పాలకొండ్రాయుడు, పాలకొండన్న, కొండయ్య, పాలకొండమ్మ, కొండమ్మ అనే పేర్లు పెడుతుంటారనీ చెబుతారు స్థానికులు.  

ఎలా చేరుకోవచ్చు  
కడప వరకూ రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో వస్తే.. అక్కడి నుంచి ఆలయం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడప పట్టణం నుంచి రాజంపేటకు వెళ్లే బైపాస్‌ రహదారి మీదుగా పాలకొండలకు చేరుకోవచ్చు. కొండపాదం వరకూ
వాహనాల్లో అక్కడినుంచి నడకమార్గాన ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది.  

- గుండ్రాతి రాజేష్‌గౌడ్‌, ఈనాడు, కడప


ఇది విన్నారా...
అక్కడ అమ్మవారికే మొదట పూజ

ఆ ఆలయం పేరు నచ్చియార్‌ కోయిల్‌. అంటే.. రాణి ఆలయం అని అర్థం. పేరుకు తగినట్లుగానే ఈ ఆలయంలో అమ్మవారికే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. నచ్చియార్‌ లేదా శ్రీనివాస పెరుమాళ్‌ కోయిల్‌కు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో మహాలక్ష్మిని వంజులవల్లి తాయార్‌గా పిలుస్తారు. వంజులవల్లిని వివాహం చేసుకునే ముందు మహావిష్ణువు దేవికి మొదటి ప్రాధాన్యం ఇస్తానంటూ ఆమె తండ్రికి ప్రమాణం చేశాడట. అందుకే ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వామితో పోలిస్తే ఒక అడుగు ముందే ఉంటుందట. అదేవిధంగా మొదట అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించాకే స్వామికి అర్చనలు చేస్తారు. ఇక.. ఇక్కడున్న కాల్‌గరుడన్‌ విగ్రహానికీ ఓ విశిష్టత ఉంది. సాలగ్రామ శిలతో తయారుచేసిన ఆ విగ్రహం ఊరేగింపు సమయంలో బరువు పెరుగుతుందని అంటారు. ఆ విగ్రహాన్ని గర్భగుడి బయటకు తీసుకొచ్చేటప్పుడు కేవలం నలుగురు మాత్రమే మోసేందుకు సరిపోతారట. క్రమంగా విగ్రహం బరువు పెరిగి ఎనిమిది, పదహారు, ముప్ఫైరెండు... ఇలా ఆ సంఖ్య రెట్టింపు అవుతూ చివరకు ఊరేగింపు పూర్తయ్యే సమయానికి 128 మంది అవసరం అవుతారట. మళ్లీ గర్భగుడిలోకి తీసుకెళ్లే సమయానికి నలుగురు మాత్రమే సరిపోతారని అంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..