సిల్లీ పాయింట్‌

మన ప్రపంచంలోని ఖండాలన్నీ ఇప్పటికీ ఏటా 2 సెం.మీ మేర... ముందుకు కదులుతూనే ఉన్నాయట!

Published : 29 Oct 2022 23:42 IST

సిల్లీ పాయింట్‌

* మన ప్రపంచంలోని ఖండాలన్నీ ఇప్పటికీ ఏటా 2 సెం.మీ మేర... ముందుకు కదులుతూనే ఉన్నాయట!

* అమెరికా, కెనడా దేశాలకంటూ ప్రత్యేకంగా కోతి జాతులేవీ లేవు.అక్కడున్నవన్నీ ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నవే!

* దిల్లీలోని సినిమా థియేటర్లలో ఒకప్పుడు మహిళలకి ప్రత్యేకమైన విభాగాలు ఉండేవి. మహిళల సీట్లు ఖాళీగా ఉండి, పురుషుల సెక్షన్‌ ఫుల్‌ అయినా సరే... మగవారిని అటువైపు పంపేవారు కాదు. ఇప్పటికీ కొన్ని థియేటర్లు ఈ పద్ధతిని పాటిస్తూనే ఉన్నాయి!

* శ్మశానాన్ని ఇంగ్లిషులో ‘సెమెట్రీ’ అని కూడా అంటారు. ఆ పదానికి అసలు అర్థం... డార్మిటరీ అని... అంటే నిద్రించే స్థలం అని!

* ప్రపంచంలోనే అతిపెద్ద నదీ లంక... బ్రహ్మపుత్రలో ఉంది. అసోం రాష్ట్రంలోని మజులీ అన్న ఈ లంకని 2016లో ఓ జిల్లాగా గుర్తించింది కేంద్రప్రభుత్వం. అలా చేయడం కూడా ప్రపంచంలో అదే తొలిసారి!

* అమెరికన్‌ రెస్టరంట్లలోకి షూస్‌ వేసుకుంటే మాత్రమే అనుమతిస్తారు... ఒట్టి కాళ్లతోనో, చెప్పులతోనో వెళితే ‘నో ఎంట్రీ’యే!

* 50 ఎకరాల స్థలంలో సుమారు 1.5 లక్షలమంది పాల్గొన్న ఓ పెళ్ళి విందు...గిన్నిస్‌ రికార్డుని సాధించింది. ఇప్పటిదాకా ఎవరూ బ్రేక్‌ చేయడానికి సాహసించని ఆ రికార్డు విందుని ఏర్పాటుచేసిన ఘనత... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితది.ఆమె తన పెంపుడు కొడుకు పెళ్ళి సందర్భంగా 1995లో ఏర్పాటుచేసిన రిసెప్షన్‌ కార్యక్రమం అది!

* ఒకప్పుడు మనదేశంలో మొబైల్‌ ఎస్టీడీ కాల్స్‌ చేయాలంటే నంబర్‌ ముందు ‘0’ యాడ్‌ చేస్తుండేవాళ్లం కదా! చైనా, యూకేల్లో పక్కరాష్ట్రాలకే కాదు... లోకల్‌ కాల్స్‌ చేయాలన్నా జీరో వాడాల్సిందే. సున్నాతో కలిపి ఆ దేశంలోని మొబైల్‌ నంబర్లలోని మొత్తం అంకెలు 11!

* చైనాలో నోటితో ఈలవేస్తూ ధ్యానం చేసే పద్ధతి ఒకటుంది. ట్రాన్సెండెంటల్‌ విజిలింగ్‌ అని పిలిచే ఈల ధ్యానంతో... చుట్టూ ఉన్న జంతువులతోనూ మాట్లాడవచ్చన్నది చైనీయుల విశ్వాసం!


* ‘లైగర్‌’తో తెలుగుతెరకి పరిచయమైన ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌ మైక్‌ టైసన్‌ పదేళ్లప్పటి నుంచే పావురాల్ని పెంచుకుంటున్నాడు. వందల సంఖ్యలో ఉన్న వాటితో పోటీలు నిర్వహించడమే కాదు... యాంకర్‌గా ‘యానిమల్‌ ప్లానెట్‌’ ఛానల్‌ కోసం పావురాలపైన ప్రత్యేక టీవీ కార్యక్రమాలూ చేస్తుంటాడు!


* మ్యాప్‌లని తొలిసారి ఉపయోగించింది గ్రీకులే.కాకపోతే, ప్రపంచం మొత్తానికీ తమ దేశమే కేంద్రమని భావించేవారు. ఆ తర్వాతి కాలంలో ప్రపంచంలో ఆసియా, ఐరోపా ఖండాలు మాత్రమే ఉన్నాయని భావించి ఆ రకంగానే మ్యాప్‌లు తయారుచేశారు!


* ఏనుగులూ, జింకలూ, గుర్రాలూ... చాలా శుభ్రత పాటిస్తాయి.అడవిలో ప్రత్యేకంగా బహిర్భూముల్ని ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ మాత్రమే విసర్జనకెళతాయి!


* జపాన్‌లో డైనింగ్‌ టేబుల్‌ వాడకం దాదాపు లేదనే చెప్పాలి. ఎంత సంపన్నులైనా సరే... అక్కడ చాపలపైన కూర్చునే భోజనం చేస్తారు!


* 1980 నుంచి ఓ నాలుగేళ్లపాటు క్యాడ్‌బరీస్‌ చాక్లెట్స్‌కి కావాల్సిన కోకో పంట మొత్తం కేరళలోనే పండించి ప్రపంచదేశాలకి ఎగుమతిచేశారు.


* మిగతా జంతువులతో పోలిస్తే పాములూ, మొసళ్లకి అరుగుదల చాలా తక్కువ. వారానికోసారే తింటాయవి. కొన్నిసార్లు వారం విడిచి వారం మాత్రమే ఆహారాన్ని తీసుకుంటాయి.


* భారతదేశంలో ఒకప్పుడు ఓ రాజు గొప్పతనం...యుద్ధంలో అతనికి తగిలిన గాయాల సంఖ్యని బట్టి ఉండేది. ఎంత ఎక్కువ గాయాలుంటే అంత గొప్పవీరుడన్నది లెక్క. సముద్రగుప్తుడు, అశోకుడు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్లు... వందకుపైగా గాయాల్ని దాల్చినవాళ్లట!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..