సిసింద్రీ

పట్టుమని పదేళ్లు నిండని ప్రాయం. ప్రతిభలో మాత్రం ఘనం. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో భారత సంప్రదాయ క్రీడ మల్లఖంబలో గుజరాత్‌కు చెందిన శౌర్యజిత్‌ రంజిత్‌కుమార్‌ ఖైర్‌ సత్తా చాటుతున్నాడు.

Updated : 12 Jan 2024 16:29 IST

పిట్ట కొంచెం... విన్యాసం ఘనం!

ట్టుమని పదేళ్లు నిండని ప్రాయం. ప్రతిభలో మాత్రం ఘనం. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో భారత సంప్రదాయ క్రీడ మల్లఖంబలో గుజరాత్‌కు చెందిన శౌర్యజిత్‌ రంజిత్‌కుమార్‌ ఖైర్‌ సత్తా చాటుతున్నాడు. కొన్ని నెలల క్రితం జరిగిన జాతీయ క్రీడల్లో స్టాండింగ్‌పోల్‌ ఓపెన్‌ విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. అతిచిన్న వయసులోనే పతకం సాధించి గుర్తింపు పొందాడు. ప్రధాని, రాష్ట్రపతి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. మల్లఖంబ క్రీడ అంటే పెద్ద కర్రదుంగ ఆసరాగా విన్యాసాలూ, తాడు ఆధారంగా యోగాసనాలూ వేయాల్సి ఉంటుంది. కష్టమైన, సాహసంతో కూడుకున్నదైనా ఈ నేస్తం విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు.


తెలివైన కవి!

పూర్వం శాకుంతల రాజ్యం ఉండేది. దానికి కుమారసేనుడు రాజు. అతడు హాస్యప్రియుడు. కళలన్నా చాలా ఇష్టం ప్రదర్శించేవాడు. అతని ఆస్థానంలో ఆనందవర్మ అనే కవి ఉండేవాడు. అతడు మహా చతురుడు. ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించేవాడు. సభలో కుమారసేనుడు ఎన్ని పరీక్షలు పెట్టినా తన యుక్తితో వాటిలో నెగ్గేవాడు. కనీసం ఒక్కసారైనా ఆనందవర్మను ఓడించాలని కుమారసేనుడి మనసులో ఉండేది. ఎప్పటిలానే ఓ రోజు సభ ప్రారంభమైంది. అప్పుడు కుమారసేనుడు, ఆనందవర్మతో... ‘కవివర్యా! నేను మీకు తినడానికి ఒకటి ఇస్తాను. మీరు స్వీకరిస్తారా?’ అని అడిగాడు. ‘తప్పకుండా మహారాజా!’ అన్నాడు ఆనందవర్మ. ‘మరోసారి ఆలోచించు. నా గురించి తెలుసుగా... ఒప్పుకున్న తర్వాత తప్పుకుంటే... నేను శిక్ష విధిస్తానని’ అన్నాడు. ‘చిత్తం ప్రభూ.. మీ ఇష్టం’ అన్నాడు ఆనందవర్మ. ఇంతలో కుమారసేనుడు భటులను పిలిచాడు. వారు చేతిలో ఒక పళ్లెంతో వచ్చారు. దాని పైన ఉన్న వస్త్రాన్ని తొలగిస్తే బాతు ఉంది. సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆనందవర్మ శాకాహారి. ఒక క్షణంపాటు ఆలోచించిన ఆనందవర్మ.. ఆ బాతును తీసుకుని.. బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. ‘ఆనందవర్మా.. మీరు బాతును తింటారా.. శాకాహారి కదా మీరు?’ అని ప్రశ్నించాడు రాజు. ‘‘ప్రభూ.. మీరు ఏమన్నారు.. ‘నేను తినడానికి ఇచ్చింది స్వీకరిస్తారా’ అని మాత్రమే అడిగారు. ఎలా తింటావు అని అడగలేదు. నేనూ చెప్పలేదు. ఈ బాతును సంతలో అమ్మి, అలా వచ్చిన డబ్బులతో కూరగాయలు కొనుక్కుని, వండుకుని తింటాను’’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో సభ చప్పట్లతో మారుమోగింది. రాజు కూడా ఆనందవర్మ లౌక్యానికి ముచ్చటపడి, తగిన కానుకలిచ్చి, సత్కరించాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..