ప్రపంచకప్‌లూ... కొత్త లీగ్‌లూ!

క్రీడల పరంగా ఈ ఏడాది ఎన్నో రకాలుగా కొత్తదనాన్ని చూడనున్నాం. క్రికెట్‌లో మొదటిసారి మహిళల ఐపీఎల్‌ చూడబోతున్నాం.

Published : 01 Jan 2023 01:08 IST

ప్రపంచకప్‌లూ... కొత్త లీగ్‌లూ!

క్రీడల పరంగా ఈ ఏడాది ఎన్నో రకాలుగా కొత్తదనాన్ని చూడనున్నాం. క్రికెట్‌లో మొదటిసారి మహిళల ఐపీఎల్‌ చూడబోతున్నాం. పురుషుల క్రికెట్‌, హాకీ ప్రపంచకప్‌లకూ ఇండియా వేదిక కానుంది. తొలిసారి ఫార్ములా-ఈ రేసింగ్‌ కూడా మన దగ్గర జరగనుంది.

జనవరిలోనే జాతీయ క్రీడ హాకీతో దేశంలో క్రీడల సందడి మొదలవ్వనుంది. పురుషుల హాకీ ప్రపంచకప్‌ జనవరి 13-29 మధ్య ఒడిశాలో మొదలవుతుంది. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా రూర్కెలా, భువనేశ్వర్‌లలో పోటీలు జరుగుతాయి. ఫైనల్‌తో కలిపి మొత్తం 44 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

ఈ టోర్నీ కోసమే ఒడిశా ప్రభుత్వం రూర్కెలాలో బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియంను నిర్మించింది.

* భారత్‌లో మహిళల క్రికెట్‌ కొత్త పుంతలు తొక్కనుంది. ఈ ఏడాది అయిదు జట్లతో మొదటిసారి దేశంలో మహిళల ఐపీఎల్‌ మొదలు కానుంది. గతంలో ఐపీఎల్‌ జరిగిన సమయంలో రెండుసార్లు మూడు జట్లతో మహిళల టీ20 ఛాలెంజ్‌ను నిర్వహించింది బీసీసీఐ.ఆ మ్యాచ్‌లలో విదేశీ క్రీడాకారులకూ చోటిచ్చింది. ఈసారి పురుషుల ఐపీఎల్‌ తరహాలో ఫ్రాంచైజీలు ఉండే లీగ్‌ని మార్చిలో నిర్వహిస్తోంది. ఈ లీగ్‌లో 22కిపైగా మ్యాచ్‌లు ఉంటాయి.

* ఇప్పటివరకూ భారత్‌ మూడు సార్లు పురుషుల క్రికెట్‌ ప్రపంచకప్‌ని నిర్వహించింది. వాటిని భారత్‌ మాత్రమే కాకుండా పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో   కలిసి నిర్వహిస్తూ వచ్చింది. కానీ 2023లో మొదటిసారి పూర్తిగా భారత్‌లోనే మ్యాచ్‌లన్నీ జరగనున్నాయి. ఇప్పటివరకూ క్రికెట్‌ ప్రపంచకప్‌ వేసవిలో సందడి చేసింది. కానీ ఈ ఏడాది అక్టోబర్‌- నవంబరులో జరగనుంది. ఈ టోర్నీలో పది జట్లు తలపడనున్నాయి.

* 37వ జాతీయ క్రీడలు గోవాలో అక్టోబరులో జరగనున్నాయి. 30కిపైగా క్రీడాంశాల్లో దాదాపు 7000 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

* యువతను క్రీడలవైపు ప్రోత్సహించడం, ప్రతిభావంతుల్ని గుర్తించడం కోసం నిర్వహిస్తోన్న ఖేలో ఇండియా క్రీడలు మధ్యప్రదేశ్‌లో జరగనున్నాయి. జనవరి 31- ఫిబ్రవరి 11 మధ్య ఈ క్రీడలు జరుగుతాయి. ఈసారి కెనోయింగ్‌, కయాకింగ్‌, రోయింగ్‌ లాంటి క్రీడల్నీ వీటిలో ప్రవేశపెడుతున్నారు.

* దేశంలో మొట్టమొదటి ఫార్ములా- ఈ రేసింగ్‌ పోటీలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. ఫిబ్రవరి 11న ఈ పోటీలు హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ కొత్తగా అభివృద్ధిచేసిన రేసింగ్‌ సర్క్యూట్‌లో జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా 17 రౌండ్లలో జరిగే ఈ పోటీల్లో భాగంగా నాలుగో రౌండ్‌కు హైదరాబాద్‌ వేదిక. ఈ పోటీల్లో మహింద్రా రేసింగ్‌, జాగ్వార్‌ టీసీఎస్‌ రేసింగ్‌, మెర్సెడెస్‌-ఈక్యూ ఫార్ములా-ఈ తదితర 11 జట్లు పాల్గొననున్నాయి. శిలాజ ఇంధనాలతో కాకుండా బ్యాటరీలతో నడిచే వాహనాల రేస్‌ ఇది.

* గ్రేటర్‌ నోయిడాలోని ప్రఖ్యాత బుద్ధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో సెప్టెంబరులో మోటో జీపీ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. ఈ పోటీలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.

* ఈ ఏడాది మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు మనదేశం వేదిక కానుంది.

* టెన్నిస్‌లో బెంగళూరు, చెన్నై, పుణె, నాగ్‌పుర్‌లలో ఏటీపీ ఛాలెంజర్‌ టోర్నీలు జరగనున్నాయి. వీటిలో నాగ్‌పుర్‌ ఈసారి కొత్తగా చేరింది. కొవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు ఈ టోర్నీలు మన దేశంలో జరగలేదు.


కొత్త లీగ్స్‌ వస్తున్నాయి..

లాస్ట్‌ మ్యాన్‌ స్టాండ్స్‌(ఎల్‌ఎమ్‌ఎస్‌)- సూపర్‌ లీగ్‌ ఇండియాకు వచ్చింది. గల్లీ క్రికెటర్లూ పాల్గొనే క్రికెట్‌ టోర్నీ ఇది. దిల్లీ వేదికగా మేలో ఈ పోటీలు జరగనున్నాయి. 20 జట్లు పాల్గొననున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, అమెరికా లాంటి దేశాల్లో ఈ టోర్నీకి ఆదరణ ఉంది. ప్రతి దేశం నుంచి గెల్చిన జట్టు చివరకు దక్షిణాఫ్రికాలో జరిగే ఎల్‌ఎమ్‌ఎస్‌- ప్రపంచ లీగ్‌లో ఆడుతుంది.

* 2017లో ఆగిపోయిన హాకీ లీగ్‌ ఈ ఏడాది మళ్లీ పట్టాలెక్కే సూచనలున్నాయి.


అంతర్జాతీయ వేదికలపైన...

ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పది జట్లు పాల్గొననున్నాయి.

* చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబరు 23- అక్టోబరు 8 మధ్య ఆసియా క్రీడలు జరగనున్నాయి. 2022లో ఉండాల్సిన ఈ క్రీడలు ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఇవి జరుగుతాయో లేదో వేచి చూడాలి. తర్వాత పది నెలలకే 2024లో ప్యారిస్‌ ఒలింపిక్స్‌ ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..