పన్ను కట్టండి.. పిండి పట్టించుకోండి

మహారాష్ట్రలోని ఓ చిన్న కుగ్రామం మానసవలి. పన్నెండు వందల మంది జనాభా ఉన్న ఆ గ్రామ పంచాయతీకి ఓ సమస్య వచ్చి పడింది.

Updated : 04 Jun 2023 04:17 IST

మహారాష్ట్రలోని ఓ చిన్న కుగ్రామం మానసవలి. పన్నెండు వందల మంది జనాభా ఉన్న ఆ గ్రామ పంచాయతీకి ఓ సమస్య వచ్చి పడింది. దాదాపు పదేళ్లుగా గ్రామపెద్దలూ, అధికారులూ ఆ సమస్య పరిష్కారం కోసం సతమతమయ్యారు. చివరికి ఓ ఇల్లాలికొచ్చిన ఆలోచనతో పరిష్కార మార్గాన్ని కనిపెట్టారు అధికారులు. అసలు విషయం ఏంటంటే..  పదేళ్లుగా ఆ గ్రామస్థులు ఇంటి పన్ను కట్టడం మానేశారు. పంచాయతీ సిబ్బంది వెళ్లి అడిగినా రేపూ, మాపూ అంటూ తిప్పుతున్నారు. దాంతో నిధుల్లేక గ్రామాభివృద్ధి కుంటుపడుతూ వచ్చింది. పైగా అన్నేళ్లలో రాబట్టాల్సిన పన్నులు లక్షలకు చేరుకున్నాయి. దాంతో అధికారులు ఆ గ్రామంలో సమస్యలు తెలుసుకునే క్రమంలో ఓ విషయం వారి దృష్టికొచ్చింది. అక్కడ గోధుమలు, చిరుధాన్యాలు ఎక్కువ వాడతారు. కానీ ఆ చుట్టుపక్కల పిండి మిల్లు లేకపోవడంతో మగవాళ్లు దూరప్రాంతాలకు వెళ్లి మరీ పిండి పట్టించుకుని వస్తారట. ఈ క్రమంలో ఒక ఇల్లాలు ‘మేం పిండికోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఓ మిల్లు ఏర్పాటు చేసి.. ఇంటి పన్ను కట్టిన వాళ్లకే పిండి పట్టించి ఇవ్వండి’ అని కోరింది. దాంతో అధికారులు పంచాయతీ కార్యాలయంలో పిండి మిల్లు ఏర్పాటు చేసి... పన్ను కట్టిన వారికి ఉచితం అంటూ బోర్డు పెట్టారు.అంతే..అప్పటిదాకా పన్నులు కట్టకుండా భీష్మించుకుని కూర్చున్న వాళ్లంతా ఆ పని పూర్తి చేసి పిండికోసం క్యూలో నిల్చుంటున్నారు. భలే ఉపాయం కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..