ఒత్తిడికి ఉపశమనం... ‘సహజ యోగం’

మానవజాతికి భారతావని అందించిన బహుమతి యోగా. శారీరక, మానసిక ఆరోగ్య సాధనకు ఇది అత్యుత్తమ మార్గం. ఆధునిక కాలంలో యోగ సాధనకు వినూత్న మార్గాల్ని అభివృద్ధి చేసిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులూ ఉన్నారు.

Published : 19 Mar 2023 00:29 IST

ఒత్తిడికి ఉపశమనం... ‘సహజ యోగం’

మానవజాతికి భారతావని అందించిన బహుమతి యోగా. శారీరక, మానసిక ఆరోగ్య సాధనకు ఇది అత్యుత్తమ మార్గం. ఆధునిక కాలంలో యోగ సాధనకు వినూత్న మార్గాల్ని అభివృద్ధి చేసిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులూ ఉన్నారు. వారిలో ఒకరు నిర్మలాదేవి. ‘సహజయోగా’ ప్రక్రియకు రూపకల్పనచేసి, వందకుపైగా దేశాల్లో పరిచయం చేశారీమె. మార్చి 21న నిర్మలాదేవి శతజయంతి. ఆ సందర్భంగా...

నిర్మలాదేవి తండ్రి పి.కె. సాల్వే... న్యాయవాది. వీరిది మధ్యప్రదేశ్‌లోని చింద్వారా. ఆంగ్లేయులు పెట్టే అక్రమ కేసుల్ని పకడ్బందీగా వాదించేందుకు మహాత్మా గాంధీ ఆదేశానుసారం 1927లో నాగ్‌పుర్‌ చేరుకున్న సాల్వే... స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్నారు. ఆ రోజుల్లో గణితశాస్త్రంలో పట్టా పొందిన అతి కొద్దిమంది స్త్రీలలో శ్రీమతి సాల్వే ఒకరు. తల్లిదండ్రుల స్ఫూర్తితో రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు నిర్మల. తల్లిదండ్రులతో గాంధీజీ ఆశ్రమానికి వెళ్తూ... ఆయనతో సత్యం, అహింస మార్గాలలో ఆశయ సాధన గురించి చర్చిస్తుండేవారు. లాహోర్‌లో సైకాలజీ, వైద్య విద్యనభ్యసించారు.

క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో విద్యార్థులకు నాయకత్వం వహించి జైలుకు వెళ్లారు. 1947లో దేశ విభజన సమయంలో దిల్లీ వచ్చిన నిర్మలకు అదే ఏడాది చంద్రికా ప్రసాద్‌ శ్రీవాస్తవతో వివాహం జరిగింది. ఆయన ఐఏఎస్‌ అధికారి. విదేశీ వ్యవహారాల నిపుణుడు. ‘పద్మవిభూషణ్‌’ గ్రహీత. కుటుంబ బాంధవ్యాల కోసం నిరంతరం ప్రయత్నించేవారు నిర్మల. మరోవైపు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు.

ఇటలీలో ‘సహజ విశ్వం’

తన ఇద్దరు కుమార్తెల వివాహం అనంతరం ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టారు నిర్మలాదేవి. యువతపైన అమిత ప్రేమ చూపేవారు నిర్మల. కానీ వాళ్లలో కొందరు చెడు అలవాట్లకు బానిస కావటం చూసి, వాటి నుంచి విముక్తి కలిగించే పరిష్కారం కోసం తపన పడేవారు. ‘మనల్ని మనం అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చ’ని తెలిపే ఎన్నో బోధనలు చదివారు. ఆధ్యాత్మిక ప్రవచనాలూ విన్నారు. ధ్యాన మార్గంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించేవారు. 1970లో అరేబియా తీరంలోని నార్గోల్‌(గుజరాత్‌) దగ్గర ధ్యానం చేస్తున్న సమయంలో- ఒక్కసారిగా అంతర్గత సూక్ష్మ శక్తి ఉవ్వెత్తున లేచిన అనుభూతిని పొందారామె. ప్రతి ఒక్కరిలో నిద్రాణ స్థితిలో ఉన్న దివ్య శక్తిని జాగృతంచేసి చుట్టూ ఉన్న చైతన్య శక్తితో అనుసంధానం చేస్తే మనిషిలో అనూహ్యమైన పరివర్తన తేవచ్చనే మహత్తర సత్యాన్ని కనుగొన్నారు. దీనినే కుండలినీ శక్తిగా చెప్పారు నిర్మల. దీని గురించి అనాదిగా ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ వచ్చినా... దీన్ని అనుభూతి పరంగా మానవాళికి సునాయాసంగా అందించిన వ్యక్తి నిర్మలాదేవి.

ఈ సహజయోగాని ఒక ఉద్యమంగా చేపట్టి మానవాళికి సరైన దిశా నిర్దేశం చేశారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా దీన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ యోగా సాధనద్వారా దుర్వ్యసనాల ఉంచి బయటపడినవారున్నారు. ఆస్తమా, బీపీ లాంటి వ్యాధుల నివారణలో దీని ప్రభావం ఉందంటారు భక్తులు. భారత్‌తోపాటు ఇంగ్లాండ్‌, ఇటలీ, స్విట్జర్లాండ్‌, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, రష్యా, చైనా.. ఇలా అనేక దేశాల్లో పర్యటించి భారతీయ సంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మిక మార్గాల్ని ప్రచారం చేశారు. ‘సహజ యోగము’ పేరిట పుస్తకం రాసిన నిర్మలాదేవి.. ముంబయిలో అంతర్జాతీయ హాస్పిటల్‌నీ, క్యాన్సర్‌ రీసర్చ్‌ సెంటర్‌నీ ప్రారంభించారు. అక్కడి రోగుల్లో సహజయోగా ద్వారా ఫలితాల్నీ అధ్యయనం చేసేవారు. నాగ్‌పుర్‌లో అంతర్జాతీయ సంగీత పాఠశాలనీ, దిల్లీలో సేవాకేంద్రాన్నీ ప్రారంభించారు. 1991లో ఇటలీలోని కెబెల్లాలో పర్వతాల మధ్య ‘సహజ విశ్వం’ ను ఏర్పాటుచేశారు నిర్మలాదేవి. బార్బెరా నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతంలో శ్రీమాతాజీ కోట, ఆలయం, పాఠశాల, ఆశ్రమం, పూజా మందిరం ఉంటాయి. సహజయోగులు దీన్ని పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. 2011లో 87వ ఏట ఇటలీలోని జెనోవాలో కన్నుమూశారామె.

కుండలినీ జాగృతం...

సహజయోగా ప్రక్రియ శ్రమ లేకుండా చాలా సహజంగా, సులభంగా ఉండటమే కాకుండా స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేయొచ్చంటారు దీన్ని అనుసరించే యోగీలు. దీన్లో ధ్యాన చైతన్య అనుభూతి, జలక్రియ, సామూహిక ధ్యానం... లాంటి సాధనలు ఉంటాయి. ఈ యోగ ప్రక్రియలో కుండలినీ శక్తి జాగృతం అవుతుందనీ, మాడు దగ్గర ఉండే బ్రహ్మ రంధ్రంద్వారా అది బయటకు వచ్చి ఆ శక్తి సర్వ వ్యాప్తమైన పరమ చైతన్యంలో కలుస్తుందనీ చెబుతారు. అప్పుడు ఆత్మ సాక్షాత్కారమై ప్రశాంతత అనుభూతిలోకి వస్తుందంటారు. సహజయోగా బోధనకు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా పలు నగరాలూ, పట్టణాల్లో కేంద్రాలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..