రెండున్నర శతాబ్దాలనాటి ద్రాక్ష!

సాధారణంగా ద్రాక్ష తీగలేవయినా రెండు మూడేళ్ల వయసు నుంచీ ఇరవై అయిదు ఏళ్ల వరకూ కాస్తాయి. ఆ తరవాతి నుంచీ కాపు తగ్గిపోతుంది.

Published : 25 Mar 2023 23:32 IST

రెండున్నర శతాబ్దాలనాటి ద్రాక్ష!

సాధారణంగా ద్రాక్ష తీగలేవయినా రెండు మూడేళ్ల వయసు నుంచీ ఇరవై అయిదు ఏళ్ల వరకూ కాస్తాయి. ఆ తరవాతి నుంచీ కాపు తగ్గిపోతుంది. అందుకే వాటిని తీసేసి కొత్తవి నాటుతారు. అయితే ముదిరిన ద్రాక్ష తీగకి కాసే పండ్లు ఎంతో రుచిగా ఉంటాయన్న కారణంతో కొంతమంది కొన్ని తీగల్ని అలాగే ఉంచుతుంటారు. కానీ దాన్నుంచి దిగుబడి తక్కువ. తెగుళ్లు ఎక్కువ. అయితే లండన్‌లోని ‘ద గ్రేట్‌ వైన్‌’ మాత్రం రెండు వందల యాభై సంవత్సరాల నుంచీ నాణ్యమైన కాయల్ని కాస్తూనే ఉంది. మూడో జార్జ్‌ పరిపాలిస్తున్న సమయంలో- బ్రౌన్‌ అనే వ్యక్తి ఎసెక్స్‌లోని వ్యాలెంటైన్‌ భవంతి నుంచి ఓ చిన్న కొమ్మను తెచ్చి 1768లో హ్యాంప్టన్‌ కోర్టు ప్యాలెస్‌లో నాటాడట. నాటి నుంచీ అది ఏటా కనీసం 270 కిలోల వరకూ కాస్తూనే ఉంది. 2001లో అయితే అత్యధికంగా 363 కిలోల వరకూ కాసిందట. అప్పట్లో దీని పండ్లను విక్టోరియా మహారాణికి పంపించేవారు. తరవాత వచ్చిన ఏడో ఎడ్వర్డ్‌ చక్రవర్తి వీటిని ప్రజలకి అమ్మమని చెప్పడంతో హ్యాంప్టన్‌ భవంతి ప్రాంగణంలోని షాపుల్లో ఏటా సెప్టెంబరు నెలలో ఆ పండ్లను విక్రయిస్తారట. ఇవి ఎంతో రుచిగా ఉంటాయన్న కారణంతో జనం కూడా ఇష్టంగా కొనుక్కుంటారు. గ్లాస్‌హౌస్‌కి పాకించిన ఈ తీగ చుట్టుకొలత నాలుగు మీటర్లు కాగా,  ఓ కొమ్మ మాత్రం 40 మీటర్ల పొడవు పెరిగింది. నాటిన చోటు నుంచి ద్రాక్ష మొక్కను మార్చలేదు కానీ అది ఏటికేడూ పెరుగుతుండటంతో దానికి వేసిన గాజు పందిరిని మాత్రం ఇప్పటివరకూ ఐదారుసార్లు మార్చాల్సి వచ్చింది. ఈ తీగ సంరక్షణకోసం నిరంతరం ఓ వ్యక్తి దీనికి సమీపంలోనే నివసిస్తాడు. ఇప్పటివరకూ పది మంది సంరక్షకులు మారారు. వాళ్లలో ఒకే ఒక్క మహిళ, మేరీ పార్కర్‌ను 1962లో నియమించారు. ఆమె 1983లో రిటైరయినప్పటినుంచీ నేటివరకూ స్ట్రడ్‌విక్‌ అనే వ్యక్తి గ్రేట్‌ వైన్‌ బాగోగులు చూస్తున్నాడు. విక్టోరియా పరిపాలనానంతరం ఈ భవంతిని ప్రజలకోసం తెరవడంతో ఏటా ఎందరో సందర్శకుల్ని ఆకర్షిస్తోందీ ద్రాక్ష పందిరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు