ఇవి... వైరస్‌ను అడ్డుకుంటాయి!

మొన్న సార్స్‌, నిన్న ఎబోలా, నేడు కరోనా... ఇలా గత ఇరవయ్యేళ్ల నుంచీ ఏదో ఒక వైరస్‌ మానవాళిని వణికిస్తూనే ఉంది. రేపు మరే వైరస్‌ రానుందో తెలియదు.

Updated : 30 Aug 2022 12:07 IST

ఇవి... వైరస్‌ను అడ్డుకుంటాయి!

మొన్న సార్స్‌, నిన్న ఎబోలా, నేడు కరోనా... ఇలా గత ఇరవయ్యేళ్ల నుంచీ ఏదో ఒక వైరస్‌ మానవాళిని వణికిస్తూనే ఉంది. రేపు మరే వైరస్‌ రానుందో తెలియదు. అంతెందుకు... సీజన్‌ మారగానే వచ్చే జలుబు, ఫ్లూ, డెంగీ జ్వరాలకు కారణమూ వైరస్సే. కాబట్టి వాటిని ఎదుర్కొనేందుకు మన శరీరాన్ని సిద్ధం చేయాలి. అంటే- రోగనిరోధకశక్తిని పెంచి, వైరస్‌తో పోరాడగలిగే గుణాలున్న ఔషధమొక్కల్ని ఆహారంలో భాగంగా చేసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అవేంటో చూద్దామా..!

కొవిడ్‌ వైరస్‌ క్రమంగా తగ్గుతోంది. కానీ దాంతోపాటు ఏ వైరస్‌ ఎప్పుడు ఏ రూపంలో విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి వాటితో పోరాడి జీవించాలంటే జాగ్రత్తలు పాటిస్తూ రోగనిరోధకశక్తినీ పెంచుకోవాల్సిందే. అందుకోసం సహజంగా లభ్యమయ్యే ఔషధ మొక్కల్ని ఏదో ఒక రూపంలో తీసుకోవాలనీ ఆయుర్వేద నిపుణులు చెబుతూనే ఉన్నారు. అందులోభాగంగా ఇప్పటికే పసుపు, అల్లం, వెల్లుల్లి, లవంగం, దాల్చినచెక్క... వంటి సుగంధ ద్రవ్యాలను కషాయాల రూపంలో తాగుతూనే ఉన్నారు. వీటితోపాటు మరికొన్ని యాంటీ వైరల్‌ గుణాలున్న ఔషధ మొక్కల్నీ తరచూ తినడం, లేదా టీ రూపంలో తాగడం వల్ల ఫలితం ఉంటుందట. ఇప్పటికే కొన్ని కంపెనీలు వైరస్‌లను ఎదుర్కొనే ఉత్పత్తుల్ని తయారుచేసి పేటెంట్‌ హక్కుల్నీ సొంతం చేసుకున్నాయి. అందుకే ఆయా మొక్కల గురించి క్లుప్తంగా...

తులసి... ఆధ్యాత్మిక ఔషధం!

పూజనీయమైనదిగానే కాదు, ఔషధ రాణిగానూ పేరొందిన తులసి ఆరోగ్యానికి చేసే మేలెంతో. ఆక్సిజన్‌ని అందించడంతోపాటు క్రిమికీటకాల్నీ ఇంట్లోకి చేరనివ్వదు.  తులసి ఆకుల్లో ఎ, సి, కె- విటమిన్లూ కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలూ పుష్కలమే. కాసిని ఆకుల్ని కోసి, టీలోనో లేదా కషాయం రూపంలో తాగడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అందుకే దీన్ని సర్వరోగ నివారిణిగా పేర్కొంటూ గుండె, మూత్రపిండాలు, కాలేయం, చర్మం... వంటి అనేక వ్యాధుల నివారణలో ఎప్పటినుంచో వాడుతోంది ఆయుర్వేదం. ఇక, ఇందులోని మోనో టెర్పినాయిడ్లు, ఫ్లేవొనాయిడ్లు వంటి పదార్థాలు బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లనీ అడ్డుకుంటాయని ఆధునిక పరిశీలనల్లో స్పష్టమైంది. ఇవి హెర్పిస్‌, హెచ్‌ఐవీ వంటి ఇన్ఫెక్షన్లతోపాటు క్యాన్సర్‌ కంతుల్నీ నివారిస్తాయట. యుర్సోలిక్‌ ఆమ్లంతోపాటు విసినిన్‌,2-ఓ-పి హైడ్రాక్సీ బెంజోయేట్‌ వంటి పదార్థాలు సార్స్‌-కోవ్‌-2 ప్రొటీన్‌ను అడ్డుకుంటున్నాయనేది తాజా పరిశోధన. కాబట్టి తులసి ఆకుల్ని కషాయంగానో టీ రూపంలోనో తీసుకుంటే మేలు అంటున్నారు.

సోంపు... ఔషధాల మేళవింపు!

తిన్నది అరిగేందుకూ నోటి సువాసనకోసం సోంపు గింజల్ని తినడం తెలిసిందే. అయితే ఆ మొక్క ఆకులూ కాండం అన్నీ ఆరోగ్యానికి మంచివే. యాంటీ వైరల్‌ గుణాలు ఎక్కువగా ఉన్న ఈ మొక్క ఇన్‌ఫ్లూయెంజా, హెర్పిస్‌ వైరస్‌లను నివారించడంతోపాటు కొన్ని రకాల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లనీ తగ్గిస్తుందట. రోగనిరోధకశక్తిని పెంచుతుందనీ స్పష్టమైంది. ఈ మొక్క మొదల్లోని ఉబ్బుగా ఉండే కాండాన్నీ ఆకుల్నీ మరిగించి కషాయంలా చేసుకుని తాగినా గింజల్ని మరిగించిన నీటిని తాగినా, ఆవిరి పట్టినా ఆస్తమా, బ్రాంకైటిస్‌... వంటివన్నీ తగ్గుతాయి. కాబట్టి కొవిడ్‌ తగ్గాక తలెత్తే సమస్యలకి సోంపు మంచి మందు. ఈ మొక్క లేదా గింజల్లోని 28 రకాల పదార్థాలు హృద్రోగాలు, క్యాన్సర్లు, నాడీ వ్యాధులు, మధుమేహం రాకుండానూ రక్తశుద్ధికీ తోడ్పడతాయి. నైట్రైట్‌ శాతాన్ని పెంచి బీపీని నియంత్రిస్తాయి. పైగా సోంపు ఆకలిని తగ్గిస్తుంది కాబట్టి ఊబకాయులకీ మంచిదే.

సేజ్‌... వైరస్‌కి చెక్‌!

పోషకాలు  పుష్కలంగా ఉండే సేజ్‌, మెదడు ఆరోగ్యాన్ని పెంచే దివ్యౌషధం. ఇది జ్ఞాపకశక్తినీ ఆలోచనాశక్తినీ పెంచుతుంది. సేజ్‌ టీని రోజూ రెండుసార్లు తాగితే యాంటీఆక్సిడెంట్లూ లింఫోసైట్ల శాతం పెరిగి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌, చక్కెర తగ్గుతాయి. ఆకుల్లోని శాఫిసినోలైడ్‌ వైరల్‌ నివారిణిగా పనిచేస్తుందట. అందుకే దీన్ని తాగితే శరీరంలోకి చేరిన కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ రేటూ తగ్గిందట. ఎండిన ఆకులూ మంచి ఫలితాలే ఇచ్చాయట. కాబట్టి డ్రై లీఫ్‌ రూపంలో దొరికే సేజ్‌తో టీ చేసుకోవచ్చు. రెండుమూడు ఆకుల్ని తింటే దంతవ్యాధులూ తగ్గుతాయి. ఎముకలూ కండరాల ఆరోగ్యమూ బాగుంటుంది. ఎండు ఆకుల్ని ఇంట్లో ధూపంగా వేసుకున్నా క్రిమికీటకాలు నశిస్తాయి.

పుదీనా... ఎలాగైనా మేలే!

పోషకాల నిధి అయిన పుదీనా వంటకాల్లో రుచిని పెంచడంతో పాటు అజీర్తిని తగ్గించి, మెదడు పనితీరునీ మెరుగుపరుస్తుంది. జలుబు వైరస్‌కి పుదీనా టీ మంచి మందు. దీనివల్ల ఆస్తమా నుంచి ఉపశమనం ఉంటుంది. చెడు బ్యాక్టీరియాని తొలగించి దంత ఆరోగ్యాన్నీ సంరక్షిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, వికారాల్ని తగ్గిస్తుంది. ఇందులోని మెంథాల్‌ జీర్ణశక్తిని పెంచుతుంది. పొట్టనొప్పి, తలనొప్పి, సైనస్‌, మైగ్రెయిన్‌లకి పెయిన్‌కిల్లర్‌లా పనిచేయడంతోపాటు నిద్రలేమినీ నివారిస్తుంది. ఈ ఆకుల్ని మరిగించి టీ రూపంలో తీసుకోవడంవల్ల సీజనల్‌గా వచ్చే అలర్జీలన్నీ తగ్గుతాయట. పుదీనా రకాల్లో ఒకటైన పెప్పర్‌మింట్‌ ఆకుల్లోని మెంథాల్‌, రోజ్‌మారినిక్‌ ఆమ్లాలకి యాంటీవైరల్‌ లక్షణాలూ ఉన్నాయట. కాబట్టి మింట్‌ రకాలన్నీ రోగాల్ని తగ్గించే ఔషధ వనరులే!

లెమన్‌ బామ్‌... నొప్పులు మాయం!

దగ్గూ తలనొప్పిలతో బాధపడేవాళ్లకీ ఉదర వ్యాధుల నివారణలకీ లెమన్‌ బామ్‌ మంచి మందు. అందుకే దీన్ని అన్నిరకాల బామ్‌ల తయారీలోనూ వాడతారు. పోతే, ఈ మొక్క ఆకులు యాంటీ వైరల్‌ గుణాల్నీ కలిగి ఉన్నాయట. సాధారణ జలుబు, ఫ్లూ, బర్డ్‌ఫ్లూ వైరస్‌ల్ని నివారించగల శక్తి దీనికి ఉంది. పిల్లల్లో తరచూ వచ్చే ఎంటెరోవైరస్‌నీ ఇది తగ్గిస్తుందట. దీన్నుంచి తీసిన తైలం పంటినొప్పినీ తగ్గిస్తుంది. అందుకే దీని ఆకుల్ని హెర్బల్‌ టీల తయారీలోనూ సలాడ్ల అలంకరణలోనూ వాడతారు. ఈ ఆకుల పరిమళమే కాదు, అందుకు కారణమైన యుర్సోలిక్‌, రోజ్‌మారినిక్‌, ఒలియానోలిక్‌ ఆమ్లాలు మెదడు పనితీరుని మెరుగుపరచడం ద్వారా ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించి, సాంత్వన చేకూర్చి నిద్రపట్టేలా చేస్తాయి. కాబట్టి కొవిడ్‌ భయంతో నిద్రపట్టనివాళ్లకి దీని ఆకులతో చేసిన టీ తాగడం వల్ల ఫలితం ఉంటుంది. ఇది ఆల్జీమర్స్‌నీ తగ్గిస్తుందట.

కరివేపాకు... తీసిపారేయొద్దు!

తాలింపులో నాలుగు కరివేపాకు ఆకులువేసి వావ్‌... కూర వాసన సూపర్‌ అనుకుంటాం. తినేటప్పుడు తీసేస్తాం. కొద్దిమంది మాత్రమే దీన్ని పొడి, పచ్చడి రూపంలోనూ తింటుంటారు. కానీ చిరపరిచితమైన కరివేపాకులో మరెన్నో సుగుణాలు ఉన్నాయి. ఆకుల్ని మరిగించి ఆ నీళ్లను తాగడం ద్వారా నాడీ సంబంధిత వ్యాధులూ క్యాన్సర్లూ మధుమేహం... వంటి వ్యాధుల్ని అడ్డుకోవచ్చట. రోజూ టీస్పూను కరివేపాకు పొడిని తిన్నా మేలే. కాలేయ వ్యాధుల్నీ రక్తహీనతనీ తగ్గిస్తుంది. విటమిన్లూ ఖనిజాలూ అన్నీ సమృద్ధిగా ఉండే కరివేపాకు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఆల్జీమర్స్‌ నుంచీ రక్షిస్తుందట. హానికర బ్యాక్టీరియానీ వైరస్‌లనీ నిరోధించే శక్తీ కరివేపాకుకి ఉందట. తరచూ నీళ్లతో లేదా మౌత్‌వాష్‌లతో పుక్కిలించడం వల్ల నోట్లోని వైరస్‌ లోడ్‌ తగ్గుతుందనేది తెలిసిందే. అయితే కరివేపాకుతో చేసిన మౌత్‌వాష్‌ వల్ల వైరస్‌ ప్రభావం చాలావరకూ తగ్గిందట. కాబట్టి ఏ రూపంలో తీసుకున్నా కరివేపాకు మంచిదే!

తిప్ప తీగ.. మధునాశిని!

ఆయుర్వేదంలో వాడే మరో అద్భుతమైన ఔషధ మొక్క తిప్పతీగ. సంస్కృతంలో అమృతవల్లి అంటారు. ఆకులు, కాండం, పువ్వు, వేరు, విత్తనం... ఇలా మొక్క మొత్తం ఔషధభరితమే. కామెర్లు, మూత్ర సమస్యలు, చర్మ వ్యాధులు, మధుమేహం, రక్తహీనత, ఇన్‌ఫ్లమేషన్‌, అలర్జీలు... ఇలా అనేక వ్యాధుల నివారణలో ఈ తీగని వాడతారు. ఆకులతో చేసిన అరటీస్పూను పొడిని ఉదయం, రాత్రి భోజనం తరవాత నీళ్లలో కలిపి తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. అందుకే దీనికి మధునాశిని అని పేరు. ఇక, దీని ఆకులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆర్థ్రయిటిస్‌, గౌట్‌... వంటి వ్యాధుల్నీ తిప్పతీగ నివారిస్తుంది. డెంగీ, అలర్జీతో వచ్చే జ్వరాలన్నింటికీ తిప్పతీగ మంచి మందు. కాడలతో సహా దీని ఆకుల్ని మెత్తగా నూరి, నీళ్లలో కలిపి జ్యూస్‌ లేదా టీ రూపంలో పరగడుపున తాగితే ఫలితం ఉంటుంది. లేదంటే ఎండబెట్టి పొడి చేసీ వాడుకోవచ్చు. ముఖ్యంగా దీని కషాయంలో నాలుగైదు తులసి ఆకుల్నీ వేసుకుని తాగితే డెంగీ జ్వరం త్వరగా తగ్గుతుందట. అంతేకాదు, ఇందులోని బెర్బిరిన్‌, ఆక్టాకొసనాల్‌... వంటి పదార్థాలు శరీర కణాల్లోని ప్రొటీన్లకు కరోనా వైరస్‌ను అతుక్కోకుండా చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తంగా రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా వైరస్‌ తీవ్రతను తగ్గిస్తుందట.

వేప... ఔషధ గని!

పెరట్లోనూ రోడ్డుపక్కనా ఎక్కడంటే అక్కడ పెరిగే వేప చెట్టులోని అన్ని భాగాలనీ సంప్రదాయ వైద్యంలో ఐదు వేల ఏళ్ల నుంచీ వాడుతున్నారు. దీని ఆకుల్లో 130 రకాల పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా హైపరోసైడ్‌ అనే పదార్థం ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటుందట. ఆ కారణంతో ఆకుల్ని అనేక మందుల్లోనూ చిగుళ్లవ్యాధుల్ని నివారించే మౌత్‌వాష్‌ల తయారీలోనూ వాడుతుంటారు. వేపాకుల నుంచి తీసిన 20 రకాల పదార్థాలు కొవిడ్‌-19ను సమర్థంగా అడ్డుకోగలిగాయట. దాంతో హెర్బల్‌ టీల తయారీలోనూ వేపాకుల్ని జోడించడం పెరిగింది. రోజూ పరగడుపునే వేప చిగుళ్లు తినడం ద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే ఆకుల్ని పొడి రూపంలోగానీ లేదా పేస్టులా చేసుకుని నీళ్లు కలిపి తాగడం ద్వారాగానీ రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు. చర్మవ్యాధులకీ
పుండ్లకీ వేపాకు పొడి మంచి పూత మందు.

ఇవనే కాదు, ఐరోపా వంటల్లో ఎక్కువగా వాడే ఆరెగానో, రోజ్‌మేరీ, చైనా సంప్రదాయ వైద్యంలో ఉపయోగించే లికోరిస్‌, అంతటా గడ్డిమొక్కగా పెరిగే డాండీలియన్‌... వంటి మరెన్నో ఔషధమొక్కల్లోనూ హెర్పిస్‌, హెచ్‌ఐవీ, డెంగీ, హెపటైటిస్‌... వంటి వైరస్‌లతోపాటు సార్స్‌కోవ్‌-2 వైరస్‌నీ నియంత్రించగలిగే గుణాలు ఉన్నాయట. కాబట్టి అందుబాటులో ఉన్న ఔషధ మొక్కల్ని ఆహారంలో భాగంగా చేసుకుంటూ రోగనిరోధకశక్తిని పెంచుకుందాం... వైరస్‌లను తిప్పికొట్టే ప్రయత్నం చేద్దాం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..