అమ్మలా ఆకలి తీర్చుతున్నారు!

ఉరుకుల పరుగుల జీవితంలో పొరుగువారి గురించి ఆలోచించే తీరికే ఉండట్లేదు చాలామందికి. అలాంటిది వీళ్లు తమ కుటుంబంతోపాటు అభాగ్యుల గురించీ ఆలోచించి అమ్మలా వారి ఆకలి తీర్చుతున్నారు.

Updated : 12 Jun 2022 04:33 IST

అమ్మలా ఆకలి తీర్చుతున్నారు!

ఉరుకుల పరుగుల జీవితంలో పొరుగువారి గురించి ఆలోచించే తీరికే ఉండట్లేదు చాలామందికి. అలాంటిది వీళ్లు తమ కుటుంబంతోపాటు అభాగ్యుల గురించీ ఆలోచించి అమ్మలా వారి ఆకలి తీర్చుతున్నారు.


వెతికి మరీ అన్నం పెడుతూ...

ఆకలి బాధ ఎలా ఉంటుందో దాన్ని అనుభవించిన వారికే బాగా తెలుస్తుంది. హైదరాబాద్‌కి చెందిన ప్రసాద్‌ కూడా ఒకప్పుడు తినడానికి తిండి లేక రోడ్ల పక్కన ఆకలితో పడుకున్న రోజులెన్నో ఉన్నాయి. తరవాత కష్టపడి ఆ బాధల్నీ, ఆర్థిక సమస్యల్నీ అధిగమించిన ప్రసాద్‌ తనలాగా ఆకలితో బాధపడేవారి గురించి ఆలోచించాడు. తాను సంపాదించుకున్న డబ్బుతోనే అభాగ్యుల కడుపునింపాలని రోజూ 200-300 మందికి సరిపోయేలా బిర్యానీ, పలావ్‌ వంటివి ఏదో ఒక వెరైటీ వండుతుంటాడు. సాయంత్రం నగరంలోని రోడ్ల పక్కన ఆకలితో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లి మంచినీళ్లూ, ఆహారం అందిస్తుంటాడు. అంతేకాదు అట్ట కట్టిన జుట్టుతో మాసిన దుస్తులతో ఉన్నవాళ్లకైతే షేవ్‌ చేయించి శుభ్రంగా స్నానం చేయిస్తుంటాడు. అలా చేయించినప్పుడు తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో కుటుంబసభ్యులు వారిని గుర్తుపట్టి ఇంటికి తీసుకెళుతున్నారు. మూడేళ్లుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రసాద్‌ది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం దగ్గర చెల్లూరులోని నిరుపేద కుటుంబం. తండ్రి వ్యవసాయ కూలీ. ఉపాధికోసం ప్రసాద్‌ చిన్నతనంలోనే కర్ణాటకకు వలస వెళ్లింది వీరి కుటుంబం. అక్కడికెళ్లిన కొంత కాలానికి ఆర్థికంగా స్థిరపడినా అనుకోని పరిస్థితుల వల్ల సంపాదించినదంతా పోగొట్టుకున్నారు. అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన ప్రసాద్‌ తల్లిదండ్రులకు భారం కాకుండా ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చి బంధువుల ఇంట్లో ఉన్నాడు. కొంతకాలానికి వాళ్లనీ ఇబ్బంది పెట్టకూడదని బయటకొచ్చాడు. ఆ సమయంలో పస్తులతో గడిపిన రోజులెన్నో. అయినా ఆఫీసు బాయ్‌గా పనిచేస్తూనే వీడియో ఎడిటింగ్‌ నేర్చుకున్నాడు. తరవాత పార్ట్‌టైమ్‌గా కొన్ని సంస్థల్లో వీడియో ఎడిటర్‌గా పని చేసేవాడు. తరవాత ఒక కంప్యూటర్‌ కొనుక్కుని కొన్ని సంస్థల్నుంచీ ఎడిటింగ్‌ ప్రాజెక్టులు తెచ్చుకోవడంతో కొంత కాలానికి ప్రసాద్‌ ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. తండ్రితో వ్యాపారం పెట్టించాడు. పోగొట్టుకున్న పొలాల్ని కొన్నాడు. కుటుంబానికి చేయాల్సినవన్నీ చేశాక అభాగ్యుల ఆకలి తీర్చాలనుకున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఎంత మందికి వీలైతే అంత మందికి అన్నం పెట్టేవాడు. అందుకు చాలామంది అభినందించడంతో ప్రతిరోజూ వంట చేయడం మొదలుపెట్టాడు. అందుకోసం ఓ వ్యానూ, వంట పాత్రలూ కొనుక్కున్న ప్రసాద్‌ వీలు కుదిరినప్పుడు వైజాగ్‌, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు తదితర చోట్లకూ వెళ్లి కొన్ని రోజులపాటు అక్కడే ఉండి అన్నదానం చేస్తుంటాడు.  


అమ్మకు ప్రేమతో..

అహ్మదాబాద్‌కి చెందిన వ్యాపారవేత్త మయూర్‌ కాందార్‌ తల్లి మంజులాబెన్‌ బతికున్నప్పుడు పులు సేవాకార్యక్రమాల్లో పాల్గొనేది. మరణించాక ఆమె జ్ఞాపకార్థంగా ఓ ఫుడ్‌ట్రక్‌ను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చుతున్నాడు మయూర్‌. రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ట్రక్‌ ద్వారా రోజుకు మూడొందల నుంచి  ఐదొందల మంది వరకూ ఆకలి తీర్చుకుంటారు. ఈ ట్రక్‌లో అన్నం కూరలతోపాటు ఇడ్లీ, దోశ, పావ్‌భాజీ, పుల్కా, పరోటా, పూరీ, చపాతీ, బజ్జీ, గులాబ్‌జామున్‌, రవ్వకేసరి, గోధుమనూక హల్వా తదితరాలన్నీ వేడి వేడిగా వడ్డిస్తారు. రోజుకు కొన్ని చొప్పున మెనూలో ఉంటాయి. అహ్మదాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం సాయంత్రం అందుబాటులో ఉండే ఈ ట్రక్కును సొంత ఖర్చులతోనే నడిపిస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలప్పుడు దాతలు ఈ ట్రక్కు ద్వారా అన్నదానం చేయడానికి ముందుకొస్తుంటారు.


కడుపు నింపే ఫ్రిజ్‌..

చెన్నైకి చెందిన ఫాతిమా జాస్మిన్‌ దంత వైద్యురాలు. ఆమె నిత్యం ఇంటికి దగ్గర్లోని అండర్‌ బ్రిడ్జి కింద నివాసముండే పేదల్ని చూస్తుండేది. వీలున్నప్పుడల్లా వారికి అన్నం పెట్టించేది. అయితే ఆకలి అనేది నిత్యం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే కడుపు నింపడం వల్ల ప్రయోజనం ఉండదని భావించింది. అందుకే ఫ్రిజ్‌లను ఏర్పాటు చేసి రోజంతా ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకుంది. అందుకోసం చెన్నైలోని 15 చోట్ల ఫ్రిజ్‌లను ఏర్పాటు చేసింది. వలంటీర్ల సాయంతో హోటళ్లలో ఆహారాన్ని కొని ఆ ప్యాకెట్లని ఫ్రిజ్‌లో ఉంచుతుంది. అలానే పండ్లూ, పానీయాలూ, మంచినీళ్లూ, బిస్కెట్లూ కూడా పెడుతుంది. ‘ది పబ్లిక్‌ ఫౌండేషన్‌’ పేరుతో ఆహారంతోపాటు దుస్తులూ, స్టేషనరీ, నిత్యావసరాలూ, బొమ్మలూ కూడా అందిస్తుంది. ఇదేవిధంగా వెల్లూరు, బెంగళూరులోనూ కొన్ని ఫ్రిజ్‌లను ఏర్పాటు చేసిన ఫాతిమా దాదాపు ఐదేళ్లుగా ఈ సేవాకార్యక్రమాలు చేస్తోంది. సాయానికి దాతలు ముందుకొస్తే డబ్బు రూపంలో కాకుండా ఏదో ఒకటి వండి ఫ్రిజ్‌లో ఉంచమని చెబుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..