దివ్యాంగులకు అండగా...

మంచి విద్య, చక్కటి ఉద్యోగం... ఇవి రెండూ అందిరావడం గగనమైపోతోంది. వేలాదిమందితో పోటీపడితేకానీ ఇవి చేతికి అందడం లేదు. మామూలువాళ్ల పరిస్థితే ఇలా ఉంటే... శారీరక వైకల్యమున్నవాళ్లు అంతకు వందరెట్లు ఎక్కువ పోరాడాల్సి వస్తోంది.

Published : 17 Jul 2022 00:31 IST

దివ్యాంగులకు అండగా...

మంచి విద్య, చక్కటి ఉద్యోగం... ఇవి రెండూ అందిరావడం గగనమైపోతోంది. వేలాదిమందితో పోటీపడితేకానీ ఇవి చేతికి అందడం లేదు. మామూలువాళ్ల పరిస్థితే ఇలా ఉంటే... శారీరక వైకల్యమున్నవాళ్లు అంతకు వందరెట్లు ఎక్కువ పోరాడాల్సి వస్తోంది. అడుగడుగునా ఎన్నో అవమానాల్ని భరించాల్సి ఉంటోంది. ఆ కష్టాల్ని సానుభూతితోనో, స్వీయానుభవంతోనో గ్రహించిన ఈ ముగ్గురూ...వాళ్లకి తమదైన చేయూతనిస్తున్నారు... చక్కటి అవకాశాలెన్నో కల్పిస్తున్నారు.


ఆ ‘చేయి’ కోసం ఎంత శ్రమించాడో!

చేతులు లేకుండా పుట్టిన, లేదా ప్రమాదవశాత్తూ చేతులు కోల్పోయినవాళ్లకు కృత్రిమ అవయవాలని అందిస్తుంటాడు ప్రశాంత్‌ గాడే. అతను అందించే ఈ కృత్రిమ చేతులు అత్యాధునికమైనవి. మెదడు నుంచి సంకేతాలని అందుకుని మామూలు చేతుల్లాగే పనిచేయగలుగుతాయివి. ముంబయికి చెందిన ప్రశాంత్‌ బీటెక్‌ మధ్యలోనే మానేసి... అమెరికాలోని ఎంఐటీ నుంచి ఆన్‌లైన్‌ కోర్సు చదివాడు. అక్కడ తన ప్రాజెక్టులో భాగంగా కృత్రిమ చేతిని రూపొందించాలను కున్నాడు. ‘ఓసారి మా పక్కనే ఉన్న ఆసుపత్రిలో చేతుల్లేని పాప పుట్టిందని తెలిసి వెళ్లాను. ఆ రోజు ఆ పాప తల్లి రోదన చూశాక నాకూ కన్నీరు ఆగలేదు. ఆ చిన్నారికి సాయం చేయాలనిపించి నా ప్రాజెక్ట్‌ని సీరియస్‌గా తీసుకున్నాను!’ అంటాడు ప్రశాంత్‌. ఎన్నో ప్రయోగాలతో అతను రూపొందించిన నమూనాలని... ఉత్పత్తిచేయడానికి ఏ కంపెనీ ముందుకురాలేదు. దాంతో యూట్యూబ్‌లో పెట్టాడు. వాటిని చూసిన అమెరికన్‌ ప్రొఫెసరొకరు అక్కడ జరిగిన ఓ బయోమెట్రిక్‌ సదస్సుకి ప్రశాంత్‌ని రమ్మన్నారు. సదస్సులో అతని ప్రయోగాన్ని మెచ్చి... తయారీకి కావాల్సిన డబ్బుని అప్పటికప్పుడే అందించారు అక్కడి శాస్త్రవేత్తలు. ఆ ఉత్సాహంతో ఏడాది తిరక్కుండానే కృత్రిమ చేతుల్ని తయారుచేశాడు ప్రశాంత్‌. ఇన్ఫోసిస్‌ సుధామూర్తి ఆర్థిక సాయంతో ‘ఇనాలి ఫౌండేషన్‌’ అన్న స్వచ్ఛంద సంస్థని స్థాపించాడు. దాని ద్వారా మూడేళ్లలో 1500 మందికి ఉచితంగా కృత్రిమ చేతుల్ని అందించాడు!


బధిరుల కోసం బ్యాడ్మింటన్‌ అకాడమీ

గౌరవ్‌ కన్నాది లఖ్‌నవూ. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ స్థాయి ఉద్యోగి. ఓ రోజు కమాండో ట్రెయినింగ్‌కని ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌కి వెళ్లాడు. వీళ్లు శిక్షణ తీసుకుంటున్న మైదానానికి పక్కనే పిల్లలు కొందరు బ్యాడ్మింటన్‌ ఆడటం గమనించాడు. ఆసక్తిగా వాళ్ల దగ్గరకి వెళ్లి చూస్తే... అందరూ అరుస్తున్నారుకానీ మాట్లాడటం లేదని గమనించాడు. దగ్గరకెళ్లాకే తెలిసింది వాళ్లందరూ బధిర విద్యార్థులని. వాళ్లతోపాటూ తానూ కాసేపు బ్యాడ్మింటన్‌ ఆడిన గౌరవ్‌... వాళ్ల సైగభాషనీ నేర్చుకోవాలనుకున్నాడు. ఆ నేర్చుకోవడం ఆయన్ని అనతికాలంలోనే బధిరులకి జాతీయస్థాయి కోచ్‌గా నిలబెట్టింది. ఆ తర్వాత పారాలింపిక్స్‌ కోచ్‌గా మారి ప్రతిష్ఠాత్మక ద్రోణాచార్య అవార్డూ అందుకున్నాడు. ఆయన శిక్షణ అందించిన విద్యార్థులు రెండు
స్వర్ణాలూ, ఓ వెండీ, ఒక రజతంతో 2021 పారాలింపిక్స్‌లో అద్భుతాలు సృష్టించారు.
వైకల్యమున్న క్రీడాకారులకి మరింత మంచి వసతులతో శిక్షణ ఇవ్వగలిగితే మరెన్నో గొప్ప విజయాలు సాధిస్తారని భావించాడు గౌరవ్‌. ఆ భావనతోనే లఖ్‌నవూలో ‘గౌరవ్‌కన్నా ఎక్సీలియా బ్యాడ్మింటన్‌ అకాడమీ’(జీకేఈబీఏ)ని ఏర్పాటుచేశాడు. మనదేశంలో వికలాంగుల కోసం రూపొందించిన తొలి బ్యాడ్మింటన్‌ అకాడమీ ఇదే. క్రీడాకారులకి స్టీమ్‌బాతింగ్‌, కోల్డ్‌బాతింగ్‌ వంటి అత్యాధునిక సౌకర్యాలతోపాటు ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్‌ కోర్టులతో రూపుదిద్దిన ఈ అకాడమీలో నిరుపేద గ్రామీణ విద్యార్థులకి ఉచితంగానే శిక్షణ అందిస్తున్నారు!


అంధులు చదువుకోవాలని...

వైకల్యం ఉన్నా... దాన్ని అధిగమించి అద్భుత విజయాలు అందుకున్న ఎంతోమంది గురించి వినే ఉంటాం. బత్తుల శివకుమార్‌ రెడ్డి అలాంటివారే కానీ... ఆయన అక్కడితో ఆగకుండా తనలాంటివాళ్లెందరినో విజయతీరాలకి చేరుస్తున్నాడు. నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కురుగొండకి చెందిన శివకుమార్‌ పుట్టుకతోనే అంధుడైనా పట్టుదలతో డిగ్రీ చేశాడు. హైదరాబాద్‌లోని ఇఫ్లూ (ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజస్‌ యూనివర్సిటీ)లో ఎంఏ ఇంగ్లిష్‌ చదివాడు. అంధుల చదరంగంలో ఆరుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ పోటీలకోసం వెళుతున్నప్పుడే వివిధ రాష్ట్రాల్లో అంధులు కంపెనీ సీఈఓలుగానూ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌లుగానూ ఉండటం గమనించాడట. తెలుగురాష్ట్రాల వాళ్లకీ అలాంటి అవకాశాలు కల్పించాలని ‘అంజనా రూరల్‌ డెవలప్‌మెంట్ వలంటరీ ఆర్గనైజేషన్‌’ని స్థాపించాడు. అప్పట్లో తన పీహెచ్‌డీ ఫెలోషిప్‌ కింద వస్తున్న పాతికవేల రూపాయల్నీ ఆ సొసైటీ కోసం ఖర్చుచేసేవాడు. ఆ తర్వాత ఆయనకి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో డిప్యుటీ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. నాటి నుంచీ తనకొచ్చే జీతం రూ.87 వేలని అంధుల ఉన్నతి కోసమే ఉపయోగిస్తున్నాడు. అంధవిద్యార్థులు ఎవరైనా శివకుమార్‌ వద్దకొచ్చి చదువుకోవచ్చు. భోజనం, బసతోపాటూ నెల్లూరు చుట్టుపక్కల్లోని విద్యాసంú్థ£ల్లో సీట్లూ ఇప్పిస్తాడు. ఆరేళ్లకాలంలో 70 మందికి సాయం చేశాడాయన. వీరిలో 18 మంది బ్యాంకు ఉన్నతాధికారులుగానూ, ప్రభుత్వ శాఖల్లో హెడ్‌క్లర్కులుగానూ కుదిరారు. ప్రస్తుతం 34 మంది శివకుమార్‌ సాయంతో చదువుకుంటున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..