ఒంటరితనం లేకుండా..

ఈ కాలం పిల్లలు ఫోన్లూ, ఇంటర్నెట్‌తోపాటే పరిగెత్తుతున్నారు. కుటుంబంలో వృద్ధులతో గడపడం, కబుర్లు చెప్పడం వంటివేం ఉండటంలేదు.

Published : 17 Dec 2022 23:29 IST

ఒంటరితనం లేకుండా..

ఈ కాలం పిల్లలు ఫోన్లూ, ఇంటర్నెట్‌తోపాటే పరిగెత్తుతున్నారు. కుటుంబంలో వృద్ధులతో గడపడం, కబుర్లు చెప్పడం వంటివేం ఉండటంలేదు. దాంతో చాలా ఇళ్లలో వయసు మీద పడినవారు ఒంటరితనంతో బాధపడటం మనకు తెలిసిందే. ఇండో-పాక్‌ సరిహద్దుల్లోని పంజాబ్‌ గ్రామం కక్కర్‌లో వృద్ధులు ఈ సమస్య నుంచి బయటపడటానికి ఓ కొత్త ఆలోచన చేశారు. 3500 జనాభా ఉన్న ఆ గ్రామంలోని గురుద్వారాలో ఏ ప్రత్యేక కార్యక్రమం జరిగినా గ్రామస్తులంతా కలుస్తుంటారు. ఆ సందర్భంగా వృద్ధులు కూడా బయటకు వస్తుంటారు. గురుద్వారాలోని ఉచిత అన్నదానంలో(లంగర్‌) అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే ప్రత్యేక సందర్భాల్లోనే ఎందుకు.. ప్రతిరోజూ మనం అలా కలిస్తే బాగుంటుంది అనుకున్నారు. గతేడాది నుంచి ప్రతి రోజూ వృద్ధులు తెల్లవారగానే గురుద్వారాకు చేరుకుంటారు. ఎవరికి తోచిన సరకులు వాళ్లు తీసుకొస్తుంటారు. ఆడవాళ్ల్లు, మగవాళ్లు అంతా కలిసి కూర్చుని వాళ్లు తెచ్చిన సరకులతో వంట చేసుకుంటారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీ, కాఫీలు ఆస్వాదిస్తారు. భోజనాలు చేస్తుంటారు. ఆ తరవాత ఆడవాళ్లంతా కులాసా కబుర్లు చెప్పుకుంటూ గిన్నెలు శుభ్రం చేసుకుంటారు. సాయంత్రానికి అందరూ తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. మొదట్లో ఆ గ్రామంలోని వారే అక్కడకు వచ్చేవారు. ఇప్పుడు చుట్టుపక్కల పది గ్రామాల వారు తమ దోస్తులకోసం ఆ గురుద్వారాను వెతుక్కుంటూ వస్తున్నారు. అలా తామంతా కలిసి సరదాగా గడుపుతుంటే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతున్నాయంటున్నారు కక్కర్‌ వాసులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..