ఎర్ర చందనం... ఎందుకంత ‘ప్రియం’..?

కాకులు దూరని కారడవులు... కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి... అయినా అక్కడ గొడ్డళ్లు మాత్రం నిర్విరామంగా దెబ్బమీద దెబ్బ వేస్తూనే ఉంటాయి. పోలీసులూ అటవీశాఖ అధికారులూ

Updated : 23 Jan 2022 07:14 IST

ఎర్ర చందనం... ఎందుకంత ‘ప్రియం’..?

కాకులు దూరని కారడవులు... కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి... అయినా అక్కడ గొడ్డళ్లు మాత్రం నిర్విరామంగా దెబ్బమీద దెబ్బ వేస్తూనే ఉంటాయి. పోలీసులూ అటవీశాఖ అధికారులూ రెప్పవాల్చక కాపలా కాస్తుంటారనీ ఏ కాస్త తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదమనీ తెలిసినా... వేలమంది రాత్రీపగలూ దాని వేటలోనే ఉంటారు. అంతర్జాతీయ స్మగ్లర్లు దానికోసం ఎన్ని కోట్ల రూపాయలైనా చెల్లిస్తారు... అదే... రక్త చందనం ఉరఫ్‌ ఎర్రచందనం. దానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం కొండలు. అసలింతకీ దానికంత డిమాండ్‌ ఎందుకు... దేనికి వాడతారు... ‘పుష్ప’ సినిమాతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించిన ఆ ఎర్ర చెక్క గురించిన కథాకమామీషు..!

బీజింగ్‌... చైనా రెడ్‌ శాండల్‌వుడ్‌ మ్యూజియం... 1999లో తొలిసారిగా ప్రజల సందర్శనార్థం తెరిచారు. అందులో... కళ్లు తిప్పుకోనివ్వని అద్భుతమైన కళాకృతులు... అన్నీ ఎర్రచందనంతో చేసినవే. హన్‌, మింగ్‌, క్వింగ్‌ వంశీకుల రాజప్రాసాదాల నుంచి సేకరించిన లక్షల కోట్ల సంపద అది. అవునుమరి... అరుదైన రక్తచందనంతో చేసిన కళాకృతులన్నా ఫర్నిచర్‌ అన్నా చైనా రాజులకి తగని మక్కువ... అది అదృష్టాన్ని తెచ్చిపెట్టే రూయీ కళాకృతి కావచ్చు... కూర్చునే సింహాసనం, పడుకునే మంచం కావచ్చు... ఏదయినా ఎర్రచందనంతో తయారయితే చాలు. అందుకే ఆ దేశంలోనూ చుట్టు పక్కల పెరిగే చెట్లన్నీ అంతరించిపోగా, అదెక్కడ ఉందో తెలుసుకుని మరీ దాన్ని తెప్పించేవారు. అందుకోసం ఎంత ఖర్చుకైనా కష్టనష్టాలకైనా వెనుకాడేవారు కాదు. ఆ అన్వేషణలో వాళ్ల దృష్టి భారతదేశంలోని తూర్పుకనుమల్లో ఉన్న శేషాచలం కొండల్లో దొరికే రక్తచందనంమీద పడింది. అలా కొన్ని వందల, వేల సంవత్సరాల నుంచీ మన రక్తచందనం చైనాకి చేరుకుని అక్కడి కోటల్లో అందంగా కొలువుదీరింది. క్రీ.శ.ఏడో శతాబ్దంలో బౌద్ధ యాత్రికుడు- హుయాన్‌సంగ్‌ మనదేశాన్ని సందర్శించే టప్పటికే ఎర్ర చందనం ఆ దేశానికి అక్రమంగా తరలుతున్నట్లు తెలుస్తోంది. దృఢంగా ఉన్నప్పటికీ ఈ కలప మృదువుగా ఉండటంతో కళారూపాలు చెక్కడానికి అనువుగా ఉంటుందట. నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ వేలంలో గృహాలంకరణలో భాగంగా వాడే ఫోల్డింగ్‌ స్క్రీన్‌ అక్షరాలా 170 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. 1755లో క్విలాంగ్‌ ప్రాంతాన్ని పాలించే రాజు యుద్ధంలో గెలిచినందుకు కానుకగా అందుకున్న రూయీ అనే అతి చిన్న కళారూపం సైతం రెండేళ్లక్రితం జరిగిన వేలంపాటలో సుమారు 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. దీన్నిబట్టి రక్తచందనంతో చేసిన వస్తువులంటే చైనీయులకి ఎంత క్రేజో అర్థం చేసుకోవచ్చు.

వాళ్లను చూశాకే పాశ్చాత్యులూ ఆ ఎర్ర చెక్కమీద మనసు పారేసుకోవడం మొదలెట్టారు. దాంతో ఆ చెట్టు అంతరించిపోతున్న జాబితాలోకి చేరిపోయింది. ఆపై భారత ప్రభుత్వం అడవుల్లోని చెట్లను కొట్టడం చట్ట విరుద్ధంగా పేర్కొంది. పెంచడంమీదా, అమ్మడంమీదా ఆంక్షలు విధించింది. అయినప్పటికీ... అది  సరిహద్దులు దాటుతూనే ఉంది. వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఫలితమే... ‘శేషాచలం అడవుల్లో ఇరవై మంది పోలీసు కాల్పుల్లో మరణించారనో లేదా వెయ్యిమందికి పైగా పట్టుబడ్డారనో చెక్‌పోస్టు దాటుతున్న లారీలో ఐదువేల కోట్ల రూపాయల సరకుని పట్టుకున్నారనో...’ అప్పుడప్పుడూ పత్రికల్లో చూస్తుంటాం. ఆ కాసేపూ అబ్బో... ఎర్ర చందనానికి అంత ధరా అనుకుంటాం... మర్చిపోతాం. నిజానికి ఆ చెట్లని కొట్టి, మోసుకెళ్లే వాళ్లలో చాలామందికి అది చట్టవిరుద్ధం అని కూడా తెలీదు. పొట్టకూటికోసమే ఆ పనికి ఒప్పుకుంటారు. అసలు ఆ చెక్క ఎందుకు... ఎక్కడికి వెళుతుంది... దేనికి వాడతారు... వంటివేమీ వాళ్లకు పట్టదు. కానీ మనదగ్గర అంతగా పట్టించుకోని ఆ ఎర్రచెక్కకి చాలా సీనుంది. ఒక మాదిరి చెక్కయితే టన్ను సుమారు 30 లక్షల రూపాయల ధర పలికితే, నాణ్యమైనదానికి టన్ను 70 నుంచి కోటి రూపాయల వరకూ చెల్లించి మరీ కొంటుంటారు. రోజురోజుకీ అంతరించిపోతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను కోటిన్నర రూపాయల పైనే పలుకుతుందట.

ఎక్కడెక్కడ?

ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం ప్రాంతంలో సుమారు - 5160 చదరపు కిలోమీటర్ల మేర ఎర్ర చందనం చెట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ చెట్లు ఎక్కడంటే అక్కడ పెరగవు. అవి పెరిగే చోటే నాటినా తొలి మూడేళ్లూ వేగంగా పెరుగుతాయి. తరవాత నెమ్మదిగా పెరుగుతుంటాయి. కనీసం 30 సంవత్సరాలకిగానీ మధ్యలోని చెక్క రంగు ఎరుపురంగులోకి మారదు. అదే వంద నుంచి రెండు వందల సంవత్సరాలపాటు పెరిగితే లోపలిభాగం మరింత ఎర్రగానూ వెడల్పుగానూ ఉంటుంది. కాబట్టి చెట్టుకి ఎన్నేళ్లుంటే అది అంత ఖరీదు చేస్తుందన్నమాట. ఆ రంగుని కాపాడేందుకే ఈ చెక్కల్ని చల్లని ప్రదేశాల్లో ఉంచుతారు. అక్కడక్కడా కేరళలోనూ ఉన్నప్పటికీ ప్రధానంగా తూర్పు కనుమల్లోని శేషాచలం అడవులే ఈ చెట్లు ఆవాసాలు. అక్కడి నేలలోని ఆమ్లశాతమూ పోషకాలూ నీరూ ఈ చెట్ల పెరుగుదలకి సరిపోతాయి. నేలలో ఉండే క్వార్ట్‌జ్‌ రాయి కూడా ఈ చెట్ల పెరగడానికి అవసరమే. అవన్నీ ఇక్కడ ఉండటం వల్లే శేషాచలం కొండప్రాంతం ఎర్ర చందనం చెట్లకి చక్కగా సరిపోయింది. ఈ రకమైన సమ్మేళనం మరెక్కడా ఉండదనీ, నేలతోపాటు ఇక్కడి వాతావరణమూ అవి పెరగడానికి దోహద పడుతుందనీ... ఈ కారణాలవల్లే ఆ ఒక్కచోటే ఈ చెట్లు పెరుగుతున్నాయనీ వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఎందుకు వాడతారు?

చైనా, జపాన్‌, మయన్మార్‌... వంటి తూర్పు ఆసియా దేశాల్లో దీనికి డిమాండ్‌ ఎక్కువ. అక్కడ దీన్ని కేవలం ఫర్నిచర్‌ తయారీకోసమే కాదు, ఔషధపరంగానూ వాడుతుంటారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రకారం- తలనొప్పి, చర్మ వ్యాధులు, జ్వరం, కంటి సమస్యలతోపాటు తేలు విషానికి విరుగుడుగానూ దీన్ని ఉపయోగిస్తారట. జపనీయుల షామిసేన్‌, వయొలిన్‌... వంటి వాటిని ఈ చెక్కతో తయారుచేస్తే వాటి వాద్యం అత్యంత వినసొంపుగా ఉంటుందట. విలాసవంతమైన ఫర్నిచర్‌ అయితే సరేసరి. ఆహారపదార్థాలూ ఔషధాల తయారీలోనూ ఈ చెట్టు బెరడు నుంచి తీసిన రంగుని వాడతారు. అంతేకాదు, న్యూక్లియర్‌ రియాక్టర్ల నుంచి వెలువడే వేడిని సైతం ఎర్రచందనం తగ్గించగలదు. నిజానికి మనదగ్గర వాడుకలో ఉన్న చందనం లేదా గంధం మాదిరిగా ఎర్ర చందనం పరిమళభరితం కాదు. కానీ దీన్నుంచి తీసిన తైలాన్ని కాస్మెటిక్స్‌ తయారీలో వాడతారు. ఇది చర్మాన్ని మెరిపిస్తుందనీ మొటిమలూ మచ్చలూ వంటివాటిని తొలగిస్తుందనీ వయసుని కనిపించనివ్వదనీ అంటారు. జీర్ణ సంబంధమైన సమస్యలూ, దగ్గూ జలుబూ వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లూ, క్యాన్సర్ల నివారణలోనూ దీన్ని వాడుతుంటారు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుందట. మూత్రం ద్వారా శరీరం నుంచి నీరు ఎక్కువగా పోకుండా కాపాడుతుందట. అలాగే ఈ చెక్కని ఒకలాంటి రుచి కోసం ఆల్కహాల్‌ తయారీలోనూ వాడతారట. ఈ పొడిని తేనె లేదా రోజ్‌ వాటర్‌లో కలిపి మచ్చలూ మొటిమలమీద రాస్తే అవి క్రమేణా తగ్గుతాయట. ఈ చెక్కని ముద్దలా నూరి గాయాలమీద పెడితే త్వరగా నయమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ చెట్టు బెరడుని చక్కెరవ్యాధి నివారణలోనూ వాడతారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్ల కారణంగా ఇది కొలెస్ట్రాల్‌, కాలేయ సమస్యల్నీ నివారిస్తుంది. చెక్కని మరిగించి తీసిన డికాక్షన్‌ డిసెంట్రీ, డయేరియాల్నీ నివారిస్తుంది. పావుటీస్పూను పొడిని నీరు లేదా తేనెతో కలిపి తాగితే పొట్ట సమస్యలూ అల్సర్లూ తగ్గుతాయట. దీన్నుంచి తీసిన నూనెని ఛాతీమీద రుద్దితే కఫ సంబంధిత సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ఎర్రచందనం పొడిలో రోజ్‌వాటర్‌ వేసి ముద్దలా చేసి నుదుటిమీద పెడితే తలనొప్పి, మైగ్రెయిన్‌ వంటివీ తగ్గుతాయి. ఈ పొడికి సెనగపిండి, నిమ్మరసం, రోజ్‌వాటర్‌ కలిపి పేస్టులా చేసి మాస్క్‌లా వేసి ఆరాక కడిగేస్తే ముఖం నిగారింపుని సంతరించుకుంటుంది. విలాసవంతమైన ఫర్నిచర్‌తోపాటు అటు అందం, ఇటు ఔషధపరంగానూ కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. ఆ కారణంతోనే అరుదైన రక్తచందనాన్ని కోట్ల రూపాయలు చెల్లించి మరీ అక్రమంగా తరలించుకుపోతున్నారు..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..