వేములవాడశ్రీ రాజన్న ఆలయం

కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. దీన్ని మొదట్లో లేములవాడ, లేంబాల వాటిక అనే పేర్లతోనూ పిలిచేవారని ఇక్కడున్న శాసనాల

Updated : 14 Mar 2023 12:14 IST

కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. దీన్ని మొదట్లో లేములవాడ, లేంబాల వాటిక అనే పేర్లతోనూ పిలిచేవారని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి.. ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం.

క్షేత్రచరిత్ర/స్థలపురాణం: మాళవ ప్రభువైన రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పౌరాణిక ఆధారాలు చెబుతున్నాయి. వేములవాడను చాళుక్యులు రాజధానిగా చేసుకొని పాలించినట్లు చరిత్రలో ఉంది. చాళుక్య రాజులలో మొదటి రాజు వినయాదిత్య యుద్ధమల్లుడు, అతని కుమారుడు అరికేసరి, ఆ తర్వాత రెండో యుద్ధమల్లుడు వేములవాడ కేంద్రంగా రాజ్యాన్ని పాలించారు. చాళుక్య రాజుల్లో చివరివాడు.. భద్రదేవుడి కుమారుడైన మూడో అరికేసరి అని దేవస్థానంలో ఉన్న శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.

ఆలయ ప్రత్యేకత: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడెమొక్కు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కల్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, ఆకుల పూజ, పల్లకిసేవల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల్లో చాలామంది స్వామివారికి తమ తలనీలాలు సమర్పించి తమ ఎత్తు బంగారాన్ని(బెల్లం) స్వామికి మొక్కుగా చెల్లించి.. ఆపై దాన్ని స్వామి ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ప్రతినెలా దాదాపు 10లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకొంటారని అంచనా.

ప్రధాన వేడుకలు: ఆలయంలో ఏటా మహాశివరాత్రి సందర్భంగా మూడురోజులపాటు వైభవంగా జాతర నిర్వహిస్తారు. సుమారు 5-6 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఆపై శ్రీరామనవమి సందర్భంగా జరిగే శివ కల్యాణోత్సవాలు ఈ క్షేత్రం ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. పదివేలమంది హిజ్రాలు, 25 వేల మంది శివపార్వతులు శ్రీరామనవమి రోజున శివుడిని పెళ్లాడతారు. అలాగే.. త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు, ముక్కోటి ఏకాదశి, దసరా నవరాత్రోత్సవాలూ ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు. మాస శివరాత్రి, ఏకాదశి రోజున స్వామికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశిపూజ, మహాలింగార్చన చేస్తారు. ఇందులో పాల్గొనే దంపతులతో పాటు కుటుంబసభ్యులను అనుమతిస్తారు. కల్యాణపూజలో పాల్గొన్న భక్తులకు 20లడ్డూలు, భోజన వసతి కల్పిస్తారు.

ప్రత్యేకపూజలు

* ఉదయం 4 నుంచి 4.10 వరకు మంగళ వాయిద్యాలు
* ఉదయం 4.10 నుంచి 4.30 వరకు సుప్రభాత సేవ, ప్రదాత హారతి
* ఉదయం 4.30 నుంచి 4.45 వరకు సర్వదర్శనం
* ఉదయం 4.45 నుంచి 5 వరకు ఆలయ శుద్ధి
* ఉదయం 5 నుంచి 5.15 వరకు గోపూజ
* ఉదయం 5.15 నుంచి 6.15 వరకు ప్రాతఃకాల పూజ
* ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు దర్శనాలు
* సాయంత్రం 6 నుంచి 7 వరకు ప్రదోశకాల పూజ
* రాత్రి 9 నుంచి 10 వరకు నిశిపూజ
* రాత్రి 10 నుంచి 10.20 వరకు పవళింపు సేవ, అనంతరం దేవస్థానం మూసివేత

దర్శనవేళలు

* ఆలయాన్ని ఉదయం 4 గంటలకు తెరిచి రాత్రి 10.20 గంటలకు పవళింపుసేవ అనంతరం మూసివేస్తారు.
* ధర్మదర్శనం ఉచితం, ప్రత్యేక దర్శనం రూ. 20, ప్రత్యేక ప్రవేశదర్శనం రూ. 100
* సాధారణ దర్శనం: ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, రాత్రి 7.30 నుంచి 8.30 వరకు
* ప్రత్యేక దర్శనం: ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7.30 వరకు. ఒక టికెట్‌పై నలుగురిని మాత్రమే అనుమతిస్తారు.
* ప్రత్యేక దర్శనం టికెట్లకు పరిమితి లేదు.
* దర్శన సమయాల్లో ఎలాంటి విరామం లేదు.
* ప్రత్యేక దర్శనం టికెట్ల వివరాలు: ప్రత్యేక దర్శనం రూ. 20, త్వరిత దర్శనం రూ. 100

ఆలయప్రాంగణంలోని ఉప ఆలయాలు

రామాలయం, అనంతపద్మనాభస్వామి ఆలయం, బాలా త్రిపురసుందరీదేవి ఆలయం, మహిషాసురమర్ధిని ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం.

* ఉపాలయాల్లో ప్రత్యేక పూజలు లేవు. అన్ని చోట్లా ఉచిత దర్శనమే.

ఆర్జిత సేవలు.. ప్రధానపూజలు

ఆలయంలో.. తెల్లవారుజామున 4.35 గంటల నుంచి 5 గంటల వరకూ ఉచిత సర్వదర్శనం.
* ధర్మదర్శనం, అభిషేకం ఉదయం 6.15 నుంచి 11.30 వరకు ఉచితంగా ఉంటుంది.
* అన్నపూజ మధ్యాహ్నం 12.15 నుంచి 2 గంటల వరకు.. టికెట్‌ ధర రూ. 200, రూ. 600.
* బిల్వార్చన, శివార్చన మధ్యాహ్నం 2.30 నుంచి 6 వరకు, టికెట్‌ ధర రూ.600.
* ఆకుపూజ రూ. 150, మహాపూజ రూ. 100, పల్లకిసేవ రూ. 200, పెద్దసేవలు రూ. 350.
* నిత్యకల్యాణం ఉదయం 10.30 నుంచి 12.30 వరకు.. టికెట్‌ ధర రూ. 1000.
* అన్నపూజల నివేదన: ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు.. టికెట్‌ ధర రూ. 200
* శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు, టికెట్‌ ధర రూ. 350
* కుంకుమపూజ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు, టికెట్‌ ధర రూ. 150
* మహాలింగార్చన సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 వరకు... టికెట్‌ ధర రూ. 1000
* గండ దీపార్చన ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 వరకు.. టికెట్‌ ధర రూ. 5
* కోడెమొక్కులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 వరకు.. టికెట్‌ ధర సాధారణం రూ. 100, ప్రత్యేకం రూ. 200
* ఆలయంలో పూజలకు ఆన్‌లైన్‌ సౌకర్యం లేదు.
* ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయాలైన రామాలయం, అనంతపద్మనాభస్వామి ఆలయం, బాలత్రిపురసుందరీదేవి ఆలయం, మహిషాసురమర్ధిని ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేకపూజలు లేవు.
* దేవతామూర్తుల పూజలు, టికెట్లు, పల్లకిసేవలు, పెద్దసేవలు, కల్యాణాలు

ఆలయంలో నిర్వహించే పూజలు నిర్వహించే సమయాలు

* ప్రాతఃకాల పూజ
* మధ్యాహ్న పూజ
* ప్రదోషకాల పూజ
* నిశికాల పూజ

 

ఆలయంలో ఇతర పూజలు

* మాస శివరాత్రికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన
* ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రదోశపూజ
* పునర్వసు నక్షత్రం రోజున మహాన్యాసపూర్వ ఏకాదశ రుద్రాభిషేకం, ఉప ఆలయాల్లో సదస్యం
* రేవతి నక్షత్రం సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉపాలయంలో సదస్యం

ప్రత్యేక రోజులు.. విశిష్ట పూజలు

* ఉగాది సందర్భంగా నవరాత్రులు
* శ్రీరామనవమికి కల్యాణోత్సవం
* ఆషాఢమాసంలో తొలి ఏకాదశి పూజలు
* శ్రావణమాసంలో గోకులాష్టమి ఉత్సవాలు
* వినాయకచవితికి నవరాత్రి ఉత్సవాలు
* దసరాకు దేవీనవరాత్రి ఉత్సవాలు
* దీపావళికి లక్ష్మీపూజ
* కార్తీక పౌర్ణమికి ద్వాదశి తులసీ కల్యాణం
* వైకుంఠ చతుర్దశికి మహాపూజ, పొన్నసేవ
* మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన
* ఫాల్గుణ మాసంలో రాజరాజేశ్వరస్వామివారికి శివకల్యాణం, ఐదురోజులపాటు ప్రత్యేక పూజలు
* ఆర్జితసేవల టికెట్లకు ఆన్‌లైన్‌ సౌకర్యం లేదు.

ఆలయంలో వసతి సౌకర్యాలు

* రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 489 వసతిగదులున్నాయి. ఫోన్‌నంబర్‌: 08723-236018
* రాజేశ్వరపురం ఏసీ 4 గదులు.. అద్దె రూ. 350
* పార్వతిపురం 88 గదులు, అద్దె రూ. 200
* నందీశ్వరపురం ఏసీ సూట్స్‌ 8, అద్దె రూ. 2,000, ఏసీ గదులు 56, అద్దె రూ. 1000, నాన్‌ ఏసీ గదులు 122, అద్దె రూ. 350
* లక్ష్మీగణపతిపురంలో 88 గదులు అందుబాటులో ఉండగా.. అద్దె రూ. 250
* శివపురంలో 46 గదులు అద్దె రూ. 150
* శంకరపురంలో 58 గదులు అద్దె రూ. 50
* భీమేశ్వర వసతి సముదాయంలో రెండు గదులు.. అద్దె రూ. 2,000
* అమ్మవారి కాంప్లెక్స్‌ 8 గదులు.. అద్దె రూ. 1,000

హోటళ్లు

* హరిత హోటల్‌ 8 గదులు. అద్దె నాన్‌ ఏసీ రూ. 550, ఏసీ రూ. 1000

ఎలా వెళ్లొచ్చంటే: హైదరాబాద్‌ నుంచి సుమారు 150 కి.మీ.ల దూరంలో ఉన్న వేములవాడ వెళ్లేందుకు ఎంజీబీఎస్‌.. జేబీఎస్‌ నుంచి సిద్దిపేట.. సిరిసిల్ల మీదుగా టీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులున్నాయి. సుమారు ప్రతి 30 నిమిషాలకొకటి చొప్పున బస్సు సర్వీసులున్నాయి. అలాగే శంషాబాద్‌ విమానాశ్రయం ద్వారా కూడా హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి వేములవాడకు చేరుకోవచ్చు. ప్రైవేటు క్యాబ్‌లు.. బస్సులు విస్తృతంగా ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు