ఘృశ్నేశ్వరస్వామి : భక్తులు తాకే జ్యోతిర్లింగం

అత్యంత సుందర శిల్పాలకు నెలవైన ఎల్లోరా గుహలకు సమీపంలో ఘృస్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం విరాజిల్లుతోంది. మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ జ్యోతిర్లింగం అపూర్వ మహిమలకు పేరుగాంచింది.

Updated : 14 Mar 2023 19:03 IST

అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన శిల్పాలకు నెలవైన ఎల్లోరా గుహలకు సమీపంలో ఘృశ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం విరాజిల్లుతోంది. మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ జ్యోతిర్లింగం అపూర్వ మహిమలకు పేరుగాంచింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పన్నెండవదిగా వినుతికెక్కింది. ఔరంగబాద్‌ జిల్లా, వేరూల్‌ గ్రామంలో శివాలయ తీర్థం సమీపంలో వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించి తరించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులది మహాద్భాగ్యమని చెప్పొచ్చు. జ్యోతిర్లింగా ఆఖరిది అయిన ఘృశ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు.

ఇళాపురే రమ్య విశాల కేస్మిన్‌ సముల్లసం తంచ జగద్వరేణ్యం వందే మహోదార తర స్వభావం ఘుశ్శేశ్వరాఖ్యం శరణ్యం ప్రపద్యే

పురాణగాథ 

పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసీలు నివాసం ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబీ అనేవారు. ఆదిమతెగ భాషలో బాంబీ అంటే పాముల పుట్ట అని అర్థం. మరాఠీలో దీనిని ‘వరూల్‌’ అంటారు. కాలక్రమేణ అది వేరూల్‌గా మారింది. ఈ ప్రాంతంలో ఏలగంగా నది ప్రవహిస్తుంది. ఏలగంగా నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని మరో కథనం.

చరిత్ర 

ఈ ప్రాంతంలో ఏల్‌ అనే రాజు ఉండేవాడు. ఆయన రాజధాని ఏలాపూర్‌. అదే వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఒకసారిరాజు వేటకు వనానికి వెళ్తాడు. అక్కడ అడవి జంతువులతో పాటు మునుల ఆశ్రమంలో ఉండే జంతువులని కూడా సంహరిస్తాడు. అది చూసిన మునులు రాజు సర్వాంగాలకు పురుగులు పట్టాలని శపిస్తారు. ఆ శాపం వల్ల రాజు వనాల వెంట తిరుగుతూ ఉంటాడు. ఒకనాడు బాగా దాహం వేయడంతో అడవిలోని చాలా చోట్ల తిరుగుతాడు. అయిన కూడా ఎక్కడా నీరు దొరకదు. ఒక చోట మాత్రం ఆవు డెక్కలతో చేసిన నీటికుంటలో కొద్దిగా నీరు కనిపిస్తుంది. రాజు వాటిని కొద్దిగా తాగగానే విచిత్రంగా అతని శరీరానికి పట్టిన పురుగులన్నీ మటుమాయం అవుతాయి. రాజు ఆ సరస్సు ఉన్న ప్రదేశంలో తపస్సును ఆచరించగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రదేశంలో తీర్థాలను ప్రతిష్టిస్తాడు. దగ్గరలో ఒక సరోవరాన్ని నెలకొల్పుతాడు. బ్రహ్మ నెలకొల్పిన సరోవరమే బ్రహ్మసరోవరం. కాలక్రమేణ అది శివాలయంగా ప్రసిద్ధి గాంచింది.

స్థలపురాణం 

పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్మడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. వారు నిత్యం అనేక పూజలు, నైతిక కార్యక్రమాలను నిర్వహించేవాడు. కానీ వారికి సంతానం లేక బాధపడేవారు. ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన ఘుష్మను భర్తకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది. వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్య పడనని వాగ్ధానం చేస్తుంది. వివాహం అయిన తరువాతా అక్కాచెల్లెళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాలక్రమేన ఘుష్మకు మగ సంతానం కలిగింది. కొంతకాలానికి ఘుష్మ కుమారుడికి వివాహం జరుగుతుంది. చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేని సుదేహ.. ఘుష్మ కుమారున్ని చంపి కోనేటిలో పడేస్తోంది. శివ భక్తురాలైన ఘుష్మ ‘ ఇదంతా పరమేశ్వరుని లీల’ అనుకుంటూ ముక్కంటిని స్తుతిస్తుంది. అప్పుడక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్ని ఘుష్మకు వివరిస్తాడు. పరమ శివుడు సుదేహని సంహరించడానికి ఉపక్రమించగా వద్దని ఘుష్మ ప్రాధేయపడుతుంది. దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాపపరిహారం కల్పిస్తాడు. అప్పుడు ఘుష్మ స్వామిని తన పేరు మీద అక్కడ కొలువుతీరమని వేడుకుంటుంది. అంతట ఆ స్వామి అక్కడ స్వయంభువు కొలువయ్యాడు. ఘుశమేశుడిగా వెలసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఆ ఘుశమేశుడే కాలక్రమంలో ఘృశ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం.

ఆలయ విశిష్టత 

పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుతున్న స్థితిలో వేరూల్‌ గ్రామ పెద్ద, పరమ శివ భక్తుడైన భోస్లేకు ఘృశ్నేశ్వరుని మహిమ వలన పాముపుట్టలో ఒక పెద్ద నిధి లభిస్తుంది. ఆ సంపదతో అతను ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయిస్తాడు. అంతేకాక శిఖర సింగనపూర్‌లో ఒక చెరువును తవ్వించాడని ప్రతీతి. ఆ తరువాత భోస్లే వంశంలో సాక్షాత్తు ఆ భోలానాథుడే జన్మించి వంశప్రతిష్ఠను పెంచాడని కథనం. తరువాతి కాలంలో ఆలయానికి అహల్యాదేవి హోల్కార్‌ జీర్ణోద్ధరణ పనులు చేయించిందని ప్రశస్తి.

240 అడుగుల ఎత్తు, 185 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయం నేటికి ధృఢంగా, సుందరంగా నిలిచి ఉంది. మందిరానికి సగం ఎత్తులో ఫలకంపై దశావతారాల విగ్రహాలు చెక్కబడి దర్శనమిస్తాయి. ఇతర దేవతా విగ్రహాలూ భక్తి భావం రేకిత్తిస్తాయి.

24 రాళ్ల స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండపాన్ని నిర్మించారు. నందీశ్వరుడు ఏకశిల విగ్రహంగా దర్శనిమిస్తాడు. ఇక్కడ స్వామి వారు 17 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో పూర్వాభిముఖంగా దర్శనమిస్తారు. భక్తులే స్వయంగా అభిషేకాలు నిర్వహించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒక్కటే భక్తులు తాకే జ్యోతిర్లింగం. గర్భగుడిలోనికి పురుషులు పై వస్త్రాన్ని విడిచి వెళ్లాలి.

ఎలా చేరుకోవాలి 

ఔరంగాబాద్‌ నుంచి ఈ క్షేత్రం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
* దిల్లీ, ముంబయిల నుంచి ఔరంగాబాద్‌కు విమానాలను నడుపుతున్నారు. 
* రైలు మార్గం ద్వారా అయితే ఔరంగాబాద్‌ నుంచి ఇక్కడికి నేరుగా చేరుకోవచ్చు. 
* రోడ్డు మార్గం ద్వారా అయితే ప్రైవేట్‌, సొంత వాహనాల్లో ఔరంగాబాద్‌ నుంచి చేరుకోవచ్చు. 
* వేరూల్‌ గ్రామం నుంచి ఔరంగాబాద్‌కు బస్సులు నడుస్తుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని