నాలాంబళ యాత్ర

శ్రీరామ నామం దివ్యమైనది.  యుగాలు గడుస్తున్నా  శ్రీరామ చంద్ర ప్రభువును స్మరిస్తున్నాం. ఆ నామాన్ని జపిస్తున్నాం. అరణ్యవాసంలో ఆయన సంచరించిన ప్రదేశాలను చూసి తరిస్తున్నాం. సీతాదేవి, ఆయన సోదరుడు లక్ష్మణుడు అయోధ్యను వదిలి అరణ్యవాసం చేసిన రోజుల్లో భరతుడు.. అన్న పాదుకలను సింహాసనంపై ...

Updated : 14 Mar 2023 18:43 IST

నలుగురు అన్నదమ్ముల దర్శనం నాలాంబళం

శ్రీరామ నామం దివ్యమైనది.  యుగాలు గడుస్తున్నా  శ్రీరామ చంద్ర ప్రభువును స్మరిస్తున్నాం. ఆ నామాన్ని జపిస్తున్నాం. అరణ్యవాసంలో ఆయన సంచరించిన ప్రదేశాలను చూసి తరిస్తున్నాం. సీతాదేవి, ఆయన సోదరుడు లక్ష్మణుడు అయోధ్యను వదిలి అరణ్యవాసం చేసిన రోజుల్లో భరతుడు.. అన్న పాదుకలను సింహాసనంపై ఉంచి పాలించాడు. కనిష్ఠ సోదరుడైన శత్రఘ్నుడు అతడికి సాయంగా ఉండేవాడు. అగ్రజుని మాటే వేదవాక్కుగా పరిగణించేవారు. అయితే, దేశంలో ఏ రామ మందిరంలోనూ ఈ ఇద్దరి సోదరుల విగ్రహాలు పెద్దగా కనిపించవు. కేరళలో మాత్రం ఈ నలుగురు అన్నదమ్ముల ఆలయాలను మనం వీక్షించొచ్చు. త్రిస్సూర్‌, ఎర్నాకుళం జిల్లాల్లో ఈ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ యాత్రనే నాలాంబళం యాత్రగా పేర్కొంటారు.

నాలాంబళం అంటే..?

మళయాళంలో అంబళం అంటే దేవాలయం. నాల్‌ అంటే నాలుగు. శ్రీరామునితో పాటు భరత, లక్ష్మణ, శత్రఘ్న ఆలయాలను ఒకే రోజులో దర్శించుకోవడాన్ని నాలాంబళ యాత్ర అని అంటారు. మళయాళ క్యాలండర్‌ ప్రకారం కర్కాడకం నెలలో (జులై-ఆగస్టు) ఈ యాత్ర ఉంటుంది. ఒకే రోజులో యాత్రను పూర్తిచేస్తే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.

శ్రీకృష్ణ భగవానుడు పూజించిన విగ్రహమూర్తులు..

ద్వాపర యుగంలో శ్రీకృష్ణభగవానుడు ఈ నాలుగు విగ్రహాలను పూజించాడని స్థలపురాణం చెబుతోంది. ద్వాపరయుగం చివర్లో ప్రళయం ఏర్పడింది. ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ఈ విగ్రహాలు సముద్రంలో కొట్టుకువచ్చి కేరళ తీరంలోని చీటువ ప్రాంతంలో తేలాయి. వక్కయిల్‌ కైమల్‌ అనే  స్థానికమంత్రికి కలలో దివ్యమంగళ రూపం కనిపించి విగ్రహాల గురించి చెప్పింది. మరునాడు తీరానికి చేరుకున్న ఆయనకు స్థానిక మత్స్యకారులు విగ్రహాలను అందజేశారు. వీటిని వివిధ ప్రదేశాల్లో ప్రతిష్టించారు.

శ్రీరామ దర్శనంతో.. 

ఈ యాత్రలో మొదటగా  త్రిస్సూర్‌ జిల్లాలోని త్రిప్రయార్‌ ఆలయంలోని శ్రీరాముని దర్శనంతో ప్రారంభమవుతుంది. ఈ ఆలయంలో స్వామి ఆరడుగుల నిండైన విగ్రహంతో దర్శనమిస్తారు. శంఖము, సుదర్శనచక్రము, పూలమాలను ధరించిన స్వామిని దర్శించుకోవడంతో యాత్ర ఆరంభమవుతుంది. తిరుఓనం రోజున ఆలయంలో సేతుబంధన మహోత్సవం నిర్వహిస్తారు. రామున్ని దర్శించుకున్న అనంతరం ఇరింజల్‌కుడలోని కూడల్‌మాణిక్యం ఆలయానికి చేరుకోవాలి. ఇక్కడే భరతుని ఆలయం ఉంది. ఇక యాత్రలో మూడో ఆలయమైన లక్ష్మణస్వామిని దర్శించుకునేందుకు ఎర్నాకుళం జిల్లాలోని అంగమాలి ప్రాంతంలోని మూళికులానికి చేరుకోవాలి. పూర్ణా నది సమీపంలో ఉన్న లక్ష్మణ్‌ పెరుమాళ్‌ ఆలయం ఉంది. ఇక్కడే హరిత మహర్షి తపస్సు చేశారని పురాతన గ్రంథాలు పేర్కొంటున్నాయి. రాముని సోదరుల్లో చిన్నవాడైన శత్రఘ్న స్వామి ఆలయ సందర్శనంతో నాలాంబళ యాత్ర ముగుస్తుంది. ఇక్కడి విగ్రహం కూడా చిన్నదిగా ఉండటం విశేషం. ఈ ఆలయం కూడా త్రిస్సూర్‌ జిల్లాలోనే ఉంది. అక్కడి కి దగ్గర్లోనే ఉన్న హనుమంతుని దర్శనంతో యాత్రకు పరిపూర్ణత లభిస్తుంది.

ఇలా చేరుకోవాలి..

రైలులో వెళ్లేవారు త్రిస్సూర్‌లో దిగి ట్యాక్సీలు మాట్లాడుకోవచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిలో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు సౌకర్యం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు