చంద్రగుప్త మౌర్యుడికి చాణక్యుడు చేసిన సూచనేంటి?

పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలు... గర్వం, అహంకారం మనిషి పతనానికి

Updated : 14 Mar 2023 16:00 IST

పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలు... గర్వం, అహంకారం మనిషి పతనానికి హేతువులని చాటుతున్నాయి. అహంకారం శాస్త్రీయత లేని తత్త్వమని మానసిక వైద్యనిపుణులు అంటారు. తమ గురించే తాము సదా ఆలోచిస్తూ ఇతరులను అకారణంగా చిన్నచూపు చూడటం, తప్పుల్ని వెతకడం... అహంకారంలోని తీక్షత. తన సంక్షేమమే, తన హితమే అహంకారి లక్షణం. మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనప్పుడు చంద్రగుప్తుడికి చాణక్యుడు ఒక సూచన చేస్తూ- ‘రెండు కారాల్ని వదిలేస్తేనే నీకు సంక్షేమ పాలనలోని పరమానందపు రుచి తెలుస్తుంది. అవే అహంకారం, మమకారం’ అని చెబుతాడు. ఇతరుల్లోని చెడును అన్వేషిస్తూ వారిని అవమానించడం కచ్చితంగా అహంకారమే! ఎన్నడూ లేనివాటిని ఉన్నట్లుగా, ఉన్న వాటిని లేనట్లుగా అహంకారులు ఊహించుకొంటారు. ఆత్మజ్ఞానం కలిగిన వారు, ఎప్పుడూ ఉన్నవాటిని ఉన్నట్లుగా... లేనివాటిని లేనట్లుగానే భావిస్తారు. ధర్మం, దైవబలం పాండవుల వద్ద ఉన్నాయి. యుద్ధం వద్దని కురు వృద్ధులు ఎంత చెప్పినా, అహంకారానికి ప్రతిరూపమైన దుర్యోధనుడు వినలేదు. పాండవుల దగ్గర ఉన్నదానికన్నా గొప్ప బలం తన వద్దే ఉందని గర్వపడి, కడకు వంశ నాశనానికి కారణమయ్యాడు. అందుకే అహంకారాన్ని మనిషిలోని బలహీనతగా విజ్ఞులు భావిస్తారు.

అహంకారంలో అహం (నేను) అనే భావానికే అధిక ప్రాధాన్యం వినాశకారకం. ‘నేను’ అనే యోచన తగనిదని శ్రీ శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో చెప్పారు. ఇంకొకరిలోని గొప్పతనాన్ని అహంకారులు అంగీకరించరు. వాడా... వాడికేం తెలుసు- అనడం వీరి నైజం. శ్రీకృష్ణుడిలోని దైవత్వాన్ని అంగీకరించలేక శిశుపాలుడు తన మరణాన్ని కొనితెచ్చుకొన్నాడు. దక్షిణాఫ్రికాలో రైలులో మొదటి తరగతి పెట్టెలో ప్రయాణిస్తున్న గాంధీని శ్వేత జాతీయుడు అహంకారంతో అవమానించడం తెలిసిందే. ఆ అతి ధోరణి కారణంగానే తనలో భారత జాతీయ స్వాతంత్య్ర పోరాటానికి అంకురారోపణ జరిగిందని ఆత్మకథలో బాపూజీ వెల్లడించారు. స్వేచ్ఛను ప్రేమించడం అంటే ఇతరుల్ని ప్రేమించడం... మనల్ని మనమే ప్రేమించుకోవడం అహంకారమని కబీరుదాస్‌ అమృతవాణి చెబుతోంది.

తాను బలవంతుణ్నని అహంకరించడం తగనిదని... ఎంతో బలం ఉన్నా పాము చలిచీమల చేత చిక్కి మరణిస్తుందని సుమతీ శతకకారుడు బద్దెన స్పష్టీకరించాడు. మన గురించి మనకు ఎంత ఎక్కువగా తెలిస్తే అంత తక్కువ అహంకారం. ఎంత తక్కువగా తెలిస్తే అంత ఎక్కువ అహంకారమని మన వేమన అనే పుస్తకంలో ఆరుద్ర రాశారు. నాకన్నీ తెలుసునని ఎవరికి వారు అనుకోవడమంత మూర్ఖత్వం మరొకటి లేదు.

ఎనిమిదో శతాబ్దంలో నివసించినట్లు భావిస్తున్న గొప్ప తత్వవేత్త మండన మిశ్రుడికి ఎనలేని అహంకారం. మీమాంస, అద్వైత దర్శనాలపై ఆయన రచనలు చేశాడు. గర్వంతో శంకరాచార్యులతో తర్క గోష్ఠిలో పాల్గొంటాడు. చివరికి ఓటమిని ఒప్పుకొని సముద్ర జలం లాంటి విజ్ఞానంలో తనకు తెలిసింది గరిటెడు మాత్రమేనని అంగీకరించి శంకరులను గురువుగా స్వీకరిస్తాడు. శంకరాభగవత్పాదులు మండన మిశ్రుడికి సురేశ్వరాచార్యులని పేరుపెట్టి ఆయనలోని జ్ఞానాన్ని తగిన రీతిలో సత్కరించి దక్షిణామ్నాయ మఠమైన శారదా పీఠానికి తొలి పీఠాధిపతిగా నియమిస్తారు. విజ్ఞుడికి, అహంకారికి ఉన్న తేడా అదే.

పెద్ద గాలికి నిలువెత్తు వృక్షాలు నేలకూలతాయి. వెదురు మొక్క మాత్రం గాలితో పాటు వంగి, కూలకుండా నిలిచి గాలి జోరు తగ్గగానే నిటారుగా అయ్యి బతుకుతుంది. అందుకే విజ్ఞుల ముందు విర్రవీగడం మాని, తల వంచడం సైతం నేర్చుకోవాలి. లేకపోతే ఎంతటివారైనా చతికిలపడక తప్పదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని