ధ్యానం కుదిరే ఉపాయం

స్వామి వివేకానంద ఆధ్యాత్మిక జైత్రయాత్ర ముగించి స్వదేశానికి తిరిగొచ్చిన రోజులవి. ఒకరోజు స్వామీజీ కోల్‌కతాలోని ఓ ధార్మికుడి ఇంటికి అతిథిగా వెళ్లారు.

Published : 20 Apr 2023 00:42 IST

స్వామి వివేకానంద ఆధ్యాత్మిక జైత్రయాత్ర ముగించి స్వదేశానికి తిరిగొచ్చిన రోజులవి. ఒకరోజు స్వామీజీ కోల్‌కతాలోని ఓ ధార్మికుడి ఇంటికి అతిథిగా వెళ్లారు. ఆ సందర్శ కులు సందేహాలు అడుగుతుండగా బెంగాల్‌ థియసాఫికల్‌ సొసైటీకి చెందిన యువకుడు వచ్చాడు. ముఖం నిండా నిరాశ. ఆ ఉదాసీన వైఖరితోనే చేతులు జోడించి ‘స్వామీజీ! ధ్యానం, పూజ చేస్తుంటే మనసుకు శాంతి లభిస్తుందని బోధించారో గురువు. ఆయన సూచన మేరకు రోజూ తలుపు లేసుకొని ధ్యానం చేస్తున్నాను. ఎవరినీ కలవకుండా ఎన్నో రోజులుగా ఇలాగే సాధన చేస్తున్నా. కానీ ధ్యానం కుదరటం లేదు. శాంతి లభించటం లేదు. అసలు మనసు నిలవటం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు వివేకానంద అమిత ఆదరణతో ఆ యువకుణ్ణి దగ్గరకు తీసుకుని ‘నాయనా! నా మాటల మీద ఏమాత్రం గౌరవమున్నా, నా సలహా పాటించు. ముందు నీ గది తలుపులు, కిటికీలు తెరిచి ఉంచు. మీ ఇంటి చుట్టూ ఎందరో పేదలు దీనావస్థలో, దుఃఖంలో మగ్గుతున్నారు. వారి వద్దకు వెళ్లి ప్రేమగా సేవచెయ్యి! రోగపీడితులకు శ్రద్ధగా మందులు పంచు. ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టు. నిరక్షరాస్యులకు చదువు నేర్పించు. ఇలా నీ తోటివారిని సేవించుకో! నీకు తప్పక మనశ్శాంతి, ఓదార్పు లభిస్తాయి. ధ్యానం కుదురుతుంది. మనసు సంకుచితం చేసుకుని ఎన్ని సాధనలు చేసినా ఫలితం ఉండదు. మన పరిధి విశాలం చేసుకుంటేనే ఆధ్యాత్మిక సాధనలు ఫలిస్తాయి’ అంటూ ప్రేమగా వివరించారు.

ప్రహ్లాద్‌


ఆకలితో ఉన్నవారికి గుప్పెడు మెతుకులు పెడితే అదే ఇష్టదైవానికి మహా నివేదన. పడిపోయిన వారికి చేయూతనిచ్చి ఓదార్చి, ఊరడిస్తే అదే లక్షనామార్చన.

జిల్లెళ్లమూడి అమ్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని