చదువులతల్లి ఆరాధనలో..

మాఘ శుద్ధ పంచమే వసంత పంచమి. శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి పేర్లతోనూ పిలిచే ఈ రోజున రతీదేవి, కామదేవుడు, సరస్వతీదేవి, వసంతులకు పూజలు చేస్తారు. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటి లక్షణాలతో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది.

Updated : 14 Mar 2023 15:31 IST

ఫిబ్రవరి 5 వసంత పంచమి

మాఘ శుద్ధ పంచమే వసంత పంచమి. శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి పేర్లతోనూ పిలిచే ఈ రోజున రతీదేవి, కామదేవుడు, సరస్వతీదేవి, వసంతులకు పూజలు చేస్తారు. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటి లక్షణాలతో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది.

మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. అన్ని సిరులకీ మూలాధారం చదువు. కళలూ, శాస్త్రాలూ, వృత్తులూ, మేధస్సు, వాక్బుద్ధి.. అన్నింటికీ అధిష్టాన దేవత సరస్వతీదేవి. శ్వేత వస్త్రాలను ధరించి హంస వాహనంతో తెల్లటి తామర పుష్పంపై చదువుల తల్లి కొలువుతీరి ఉంటుంది. నాలుగు చేతులతో నాలుగు దిక్కుల్లో ఉండటం సర్వవ్యాపకత్వానికి సంకేతం. ఎడమచేతిలోని పుస్తకం సమస్త విద్యలకు చిహ్నం కాగా, కుడిచేతిలోని అక్షరమాల జ్ఞానాన్ని సూచిస్తుంది. హస్తభూషణమైన వీణ, సకల కళల అధిదేవతగా ప్రకటించగా, పాశాంకుశాలు మనిషిలోని మనోకాలుష్యాన్ని హరింపజేసే ఆయుధాలకు సంకేతాలు. పాలనీ నీటినీ వేరు చేసే హంస మంచి చెడుల విచక్షణాజ్ఞానంతో మెలగాలని తెలియచేస్తుంది.

శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణీ

వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే

వసంత పంచమి రోజున సరస్వతీదేవిని తెల్లటి వస్త్రాలతో అలంకరించి, తెల్లని పుష్పాలతో పూజించి, చందనం, క్షీరాన్నం, పేలాలు, నువ్వుండలు, అటుకులు, చెరుకు ముక్కలను నివేదించాలని శ్రీమహావిష్ణువు నారదునికి చెప్పినట్టు దేవీభాగవతంలో ఉంది. పెరుగు, వెన్న, బెల్లం, తేనె, పంచదార, కొబ్బరికాయ, రేగుపండులను నివేదిస్తే దేవి ప్రసన్నురాలవుతుందని చెబుతారు. విద్యార్థులు సరస్వతిని పూజించి అనుగ్రహం పొందుతారు. ఆయా వృత్తులవారు పనిముట్లను దేవి రూపంగా భావించి వాటికి పూజ చేస్తారు.

వసంత పంచమిని రాజస్థాన్‌లో విశేషంగా జరుపుతారు. వంగదేశంలో శ్రీపంచమి పేరుతో పూజిస్తారు. పుస్తకాలకు పసుపురాసి పూజలో పెడతారు. సాయంకాలం దేవి విగ్రహాన్ని ఊరేగించి నిమజ్జనం చేస్తారు.

- సుమంత్‌ సకలాభక్తుల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని