వైశాఖ పౌర్ణమి ప్రాముఖ్యత ఏమిటి?

చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. మాసములలో వైశాఖం రెండో మాసం కావడం.. అందులోనూ ఉత్తరాయణంలో ఉండటంతో....

Updated : 14 Mar 2023 15:51 IST

చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. మాసాల్లో వైశాఖం రెండో మాసం కావడం.. అందులోనూ ఉత్తరాయణంలో ఉండటంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మన సనాతనధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్రస్నానం ఆచరించకూడదు. వైశాఖ పౌర్ణమి రోజున కచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం ఒకటి. ఈ రోజు కరక్కాయను తీసుకెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానమాచరించడం వల్ల నరఘోష, నరదిష్టి తొలగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జ్ఞాన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, శ్రీకూర్మ జయంతి, అన్నమాచార్యుల జయంతి.. ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. 

వైశాఖ పౌర్ణమి రోజు సిద్దార్థుడు జన్మించడం, అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందని; ఆధ్యాత్మిక సాధకులకు, జ్ఞాన ప్రాప్తి పొందేవారికి, సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు. వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మ పురాణం తెలియజేస్తోంది. అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించడం, ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. 

ఈరోజు ఏం చేస్తారు?  
వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువు ఆరాధించి పూజించడంతో పాటు సంపత్‌ గౌరీ వ్రతాన్ని ఆచరించడం విశేషం. ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. సంపదలు కలగాలనే కోరికతో ప్రతి మహిళ పసుపుతో గౌరీదేవిని చేసి పూజించి, ఆ పసుపు గౌరీదేవిని ముత్తైదువుకు వాయనం ఇవ్వడం ఈ వ్రతం విశేషం. అలాగే, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, గౌరీదేవిని పూజించడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం, అన్నమాచార్యుల వారిని, బుద్ధుడిని, కూర్మావతారంలో ఉన్న మహావిష్ణువును పూజించండం విశేషం.

ఏం దానం చేయాలి?
వైశాఖ పౌర్ణమి రోజు చేసే దానధర్మాలకు అనేక శుభ ఫలితాలు ఉన్నాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, పేదవారికి వస్త్రదానం, గొడుగు, చెప్పులు, నీటికుండ వంటివి దానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. అలాగే, గయలో స్నానమాచరించినా పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో తులసి కోటను శుభ్రం చేసుకొని పూజించడం వల్ల గొప్ప పుణ్యం కలుగుతుందని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని