Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్‌ కారుపై పుష్‌ అప్స్‌ తీస్తూ యువకుడి హల్‌చల్‌!

ప్రయాణిస్తున్న కారుపైకి ఎక్కి ఓ యువకుడు పుష్‌ అప్స్‌ తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన గురుగ్రామ్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి.. కారు యజమానికి రూ.6500 జరిమానా విధించారు.

Updated : 31 May 2023 21:12 IST

గురుగ్రామ్‌: వెర్రి వేయి విధాలు అంటే ఇదేనేమో..! రోడ్డుపై ప్రమాదకర విన్యాసాలు ప్రాణాల మీదకు తెస్తున్నా కొందరిలో మార్పురావట్లేదు. స్టంట్‌(stunts)ల మోజులో పడి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌(Traffic rules) ఉల్లంఘిస్తున్నవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొంటున్నా వారు భయపడటం లేదు. వాహనాలను వేగంగా నడపడం, ప్రమాదకర ఫీట్లు చేయడంలాంటివి కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా హరియాణా(Haryana)లోని గురుగ్రామ్‌లో ఇలాంటి తరహా ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న కారుపై ఏకంగా పుష్‌ అప్స్‌(Push ups) తీస్తూ హంగామా చేయడం కలకలం రేపింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి రావడంతో వారు వెంటనే స్పందించారు. కారును సీజ్‌ చేయడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకొని వారికి జరిమానా విధించారు. 

గురుగ్రామ్‌లోని రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై ఎక్కి ఓ వ్యక్తి పుష్‌ అప్స్‌ తీస్తుండగా.. అతడి స్నేహితులైన మరో ముగ్గురు కారు అద్దాలపై కూర్చొని బయటకు చూస్తూ హంగామా చేసినట్టుగా కనిపించే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో పోలీసులు సీరియస్‌గా స్పందించారు. నిందితుడిని లోకేశ్‌గా గుర్తించిన గురుగ్రామ్‌ పోలీసులు కారు యజమానికి రూ.6500 జరిమానా విధించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా మీ జీవితాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దు అని విజ్ఞప్తి చేశారు. పుష్‌అప్స్‌ తీయడంతో పాటు ఆ వ్యక్తి చేతిలో ఏదో బాటిల్‌ను పట్టుకొని ఉన్నట్టుగా కూడా మరో వీడియోలో గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని