America: మూడేళ్ల చిన్నారిని పట్టాలపైకి తోసేసి.. ఆపై తాపీగా కూర్చోని!

రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై నిలబడి రైలు కోసం ఎదురుచూస్తున్న మూడేళ్ల చిన్నారిని.. అక్కడున్న ఓ మహిళ పట్టాలపైకి తోసేసింది. అమెరికాలోని ఒరెగాన్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.

Published : 03 Jan 2023 01:23 IST

వాషింగ్టన్‌: అమెరికా(America)లో విస్మయకర ఘటన వెలుగుచూసింది. రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై ఉన్న మూడేళ్ల చిన్నారిని అక్కడున్న ఓ మహిళ.. ఒక్కసారిగా పట్టాలపైకి తోసేసింది. ఇక్కడి ఒరెగాన్‌(Oregon)లోని పోర్ట్‌ల్యాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానిక అధికారులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేశారు. దీంతో ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌(Viral Video)గా మారింది.

గతేడాది డిసెంబరు 28న ఓ బాలిక తన తల్లితో కలిసి ప్లాట్‌ఫాంపై నిలబడి.. రైలు కోసం వేచిచూస్తోంది. అంతలోనే.. అక్కడున్న ఓ మహిళ ఆమెను రైల్వే లైన్‌పైకి తోసేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఊహించని ఈ ఘటనతో షాక్‌ తిన్న తోటి ప్రయాణికులు.. వెంటనే తేరుకుని, బాలికను సురక్షితంగా కాపాడారు. ఆ సమయంలో రైలు రాకపోవడంతో బాలిక ప్రాణాలకు ప్రమాదం తప్పినట్లయ్యింది. అయితే, ఆమెకు గాయాలయ్యాయి.

ఈ దుశ్చర్యకు పాల్పడిన మహిళను 32 ఏళ్ల బ్రియానా లేస్ వర్క్‌మెన్‌గా గుర్తించారు. బాలికను నెట్టేసిన అనంతరం ఆమె తాపీగా అక్కడే కూర్చోవడం గమనార్హం. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసినట్లు ముల్ట్‌నోమా కౌంటీ డిస్టిక్‌ అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ఈ ఘటన వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని