Maharajas Express: ఈ రైలు ప్రయాణం కాస్ట్‌లీ గురూ.. ఏకంగా ₹ లక్షలే!

Maharajas Express: రైలు టికెట్‌ రూ.లక్షల్లో అంటే నమ్మగలరా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! విలాసవంతమైన ఈ మహారాజా ఎక్స్‌ప్రెస్‌లో ఆ మాత్రం రేట్లు ఉంటాయి మరి!!

Published : 17 Dec 2022 21:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రైలు ప్రయాణమంటే తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దూర ప్రాంతాలకు.. అదీ ఏసీ బోగీలో అయితే ఓ ఐదువేల రూపాయలుంటే సరిపోతుంది. అదే విమానంలో అయితే, ఓ రూ.పదివేలు పెట్టాలి. బిజినెస్‌ క్లాస్‌ అయితే ఇంకాస్త ఖరీదు ఉంటుంది. కానీ రైలు టికెట్టే రూ.లక్షల్లో ఉందంటే అంటే నమ్మగలరా? అదీ మన భారత్‌లో? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! ఐఆర్‌సీటీసీకి చెందిన ఈ మహారాజా ఎక్స్‌ప్రెస్‌లో (Maharajas Express) ప్రయాణించాలంటే రూ.లక్షల్లో వెచ్చించాల్సిందే.

రైల్వే ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని కల్పించటం కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) మహారాజా ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొచ్చింది. ఇందులో ప్రయాణించాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుంది. పేరుకు తగ్గట్టే ప్రయాణం కూడా ‘మహారాజా’ అనుభూతి పంచడం ఖాయం అని చెబుతోంది ఐఆర్‌సీటీసీ. ఇందులో నాలుగు రకాల టూర్‌ ప్యాకేజీలు, వివిధ శ్రేణుల్లో కేబిన్లు అందుబాటులో ఉంటాయి. 7 రోజుల ప్రయాణానికి ఎంచుకున్న శ్రేణిని బట్టి టికెట్‌ ధర ఉంటుంది. ప్రముఖ దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రాంతాలు ఈ ప్యాకేజీలో భాగంగా చూడొచ్చు. అక్టోబర్‌- ఏప్రిల్‌ మధ్య వివిధ తేదీల్లో (మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ సందర్శించండి) ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఖర్చు అధికంగా ఉన్నా మర్యాదకు ఏమాత్రం కొదవ ఉండదని మహారాజా ఎక్స్‌ప్రెస్‌ అధికారిక వెబ్‌సైట్లో ఐఆర్‌సీటీసీ పేర్కొంది. 

తాజాగా కుశాగ్రత్యాల్‌ అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మహారాజా ఎక్స్‌ప్రెస్‌లో ఉచిత వైఫై కనెక్షన్, లైవ్‌ టెలివిజన్‌, చిన్నతరహా బార్‌ ఇంకా మరెన్నో ఆశ్చర్యం కలిగించే వసతులు ఉన్నాయని ఆ వీడియోలో సదరు వ్లాగర్‌ పేర్కొన్నాడు. టికెట్‌ ధర రూ.19 లక్షల పైమాటేనని తెలిపాడు. నవంబరు 10న పోస్ట్‌ చేసిన వీడియోకు 48వేల లైక్‌లు వచ్చాయి. దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియో కింద కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఆ మొత్తంతో తానైతే ఓ స్థలాన్ని కొనుగోలు చేసేవాడినని పేర్కొన్నాడు. తానైతే ఏకంగా విదేశాలు చుట్టొచ్చేవాడినని ఇంకొకరు కామెంట్‌ పెట్టారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు